Kavitha: తెలంగాన జాగృతి సంస్థ.. తెలంగాణ ప్రజా జాగృతి పార్టీగా మారబోతుందని ప్రకటించిన కల్వకుంట్ల కవిత పార్టీ ప్రకటనకు ముహూర్తం కూడా ఫిక్స్ చేశారు. తెలంగాణలో తమదొక్కటే ప్రాంతీయ పార్టీ అంటున్న కవిత స్టాండ్పై రాష్ట్రంలో రాజకీయంగా పెద్ద చర్చే మొదలైంది. కొత్త పార్టీతో ఏ పార్టీకి నష్టం జరుగబోతుందనేది హాట్ టాపిక్గా మారింది. అసలు కవిత పొలిటికల్ వ్యూహాం ఏంటి?…ఎలాంటి ఎజెండాతో ప్రజల్లోకి రాబోతున్నారనేది చర్చనీయంశంగా మారింది.
కొత్త పార్టీకి సంబంధించి తెలంగాణ జాగృతి అధ్యక్షు రాలు కవిత ప్రకటన చేశారు ఏప్రిల్ 25న జెండా, ఎజెండాను వివరిస్తామని ప్రకటించారు. మొత్తానికి ఎప్పుడాఎప్పుడా అనుకుంటున్న కవిత కొత్త పార్టీ లాంచింగ్ ఖారారైపోయింది. దీంతో తెలంగాణలో మరో ప్రాంతీయ పార్టీ పురుడుపోసుకోబోతుంది. కవిత స్ధాపించబోయే పార్టీ ప్రభావం ఎలా ఉండబోతోంది? ఏ పార్టీపై కవిత ఎఫైక్ట్ పడుతుందనే చర్చ ఇప్పుడు తెలంగాణలో హాట్ టాపిక్గా మారింది. రాజకీయంగా స్పష్టమైన వ్యూహాంతో కవిత ముందుకు వెళ్తున్నారు. యువత, రైతులు, మహిళలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలను తన వైపుకు తిప్పుకునేలా అడుగులు వేస్తున్నారు.
తెలంగాణలో ప్రాంతీయ పార్టీలు లేవంటున్న కవిత….జాగృతి పార్టీనే తెలంగాణ ప్రాంతీయ పార్టీ కాబోతుందన్న వాదన్ని, సెంటిమెంట్గా ప్రజల్లోకి తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. తన పార్టీ పేరులో తెలంగాణ ఉండేలా జాగ్రత్త పడిన కవిత, పార్టీ పేరులోంచి తెలంగాణ తీసేసి బీఆర్ఎస్గా పేరుమార్చుకున్న గులాబీ పార్టీ పాలన నాటి వైఫల్యాలను ఎండగడుతూ, సెంటిమెంట్ పండించే ప్రయత్నాలు మొదలుపెట్టారు. తెలంగాణ జాగృతి సంస్థ రాజకీయ పార్టీగా మారబోతుందంటున్న కవిత…తాము ఎవరికీ బీ టీమ్ కాదని, సర్వోదయ తెలంగాణ సాధించడమే తమ లక్ష్యమని స్పష్టం చేయడం.. పొలిటికల్ సర్కిల్స్లో చర్చకు దారి తీస్తుందట. కేసీఆర్ బంగారు తెలంగాణ అంటుంటే.. కవిత సర్వోదయ తెలంగాణ అంటుండటంతో పొలిటికల్గా ఆమె తండ్రినే ఫాలో అవుతున్నారన్న టాక్ వినిపిస్తోంది
నాలుగు ఏళ్లుగా తాను పడ్డ కష్టం అంతా ఇంతా కాదని, ఎవరికి నష్టం చేయాలనో తాను పార్టీ పెట్టడం లేదని, తమ పార్టీతో బీఆర్ఎస్ కు నష్టం జరిగితే తనకేం సంబంధమని కవిత ప్రశ్నిస్తున్నారు. దాంతో బీఆర్ఎస్కు కవిత బీటీమ్ అని జరుగుతున్న చర్చకు కవిత పుల్ స్టాప్ పెట్టినట్లు అయిందంటున్నారు. కవిత కామెంట్స్తో బీఆర్ఎస్ నేతల్లో గుబులు మొదలైందనే చర్చ నడుస్తోంది. బీఆర్ఎస్కు అనుబంధంగా పనిచేసిన జాగృతి సంస్ధ…రాజకీయ పార్టీగా మారబోతుండటంతో, బీఆర్ఎస్కు గ్రౌండ్ లెవల్లో కొంత ఇబ్బందికర పరిస్ధితులు తప్పవనేది విశ్లేషకుల మాట.
సెప్టెంబర్ 2025లో కవితను బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేశారు. హరీష్ రావు, సంతోష్ కుమార్లు కేసీఆర్ ప్రతిష్టను దెబ్బతీస్తున్నారని కవిత చేసిన ఆరోపణలను కారణంగా చూపుతూ కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది బీఆర్ఎస్. బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన కవిత…ఆ పార్టీ విధానాలను తప్పుబడుతూ ..గులాబీ కీలకనేతలపై అవకాశం దొరికినప్పుడల్లా విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. ఆమె కొత్త పార్టీ పేరు ప్రకటించినప్పుడు కూడా రాష్ట్రరాజకీయాలను మార్చాల్సినవసరం ఉందని, తెలంగాణ వచ్చినప్పటి నుంచి యువత ఉద్యోగాల కోసం వేచి చూడాల్సి వస్తోందని పరోక్షంగా గులాబీపార్టీనే టార్గెట్ చేశారు.
దాంతో కవిత పార్టీ మున్ముందు కూడా బీఆర్ఎస్ను టార్గెట్ చేసే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పటికే పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ప్రజలకు మేలు జరుగలేదంటున్న కవిత… తండ్రి స్థాపించిన పార్టీ విధానాలను ప్రశ్నిస్తున్నారు. కేసీఆర్ కుటుంబం నుంచి బయటకు వచ్చిన కవిత, రాజకీయ పార్టీ స్ధాపించడం, రాజకీయ శక్తిగా ఎదుగుతానని చెబుతుండడం, బీఆర్ఎస్ నుంచి కవిత పార్టీలోకి వలసలు ఉంటాయన్న ప్రచారాలతో .. బీఆర్ఎస్ నేతల్లో గుబులు స్టార్ట్ అయిందంటున్నారు.
కవిత పార్టీతో బీఆర్ఎస్ ఓట్ బ్యాంక్కు చీలుతుందనే చర్చ పొలిటికల్ సర్కిల్స్ నడుస్తోంది. బీఆర్ఎస్ పార్టీ స్ట్రక్చర్, నేతల వ్యూహాలు ఎలా ఉంటాయనేది కవితకు అవగాహన ఉంది. ఎందుకంటే సుదీర్ఘకాలం బీఆర్ఎస్లో పని చేసిన కవితకు ఆ పార్టీ అంతర్గత వ్యవహారాలపై పూర్తి అవగాహన ఉంది. దాంతో రాబోయే కవిత పార్టీ బీఆర్ఎస్కు సవాలుగా మారుతుందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ప్రధానంగా అసలే బలహీన పడిన గులాబీ పార్టీ ఓటు బ్యాంకు మరింత దెబ్బ తినే అవకాశం ఉందంటున్నారు.
బీఆర్ఎస్లో సముచిత గుర్తింపు, పదవులు లభించక.. అసంతృప్తిగా ఉన్న ఉద్యమ నేతలు ప్రత్యామ్నయంగా కవిత పార్టీ వైపు చూస్తారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇది సహజంగానే కవిత స్ధాపించే పార్టీకి అడ్వాంటేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. సందర్భం వచ్చినప్పుడులా సెంటిమెంట్ కార్డును ప్రయోగించే బీఆర్ఎస్కు…ఇప్పుడు కవిత కూడా సెంటిమెంట్ ఆస్త్రంగా ప్రజల్లోకి రావడం రాజకీయంగా పెద్ద ఇబ్బందే అంటున్నారు.
2023 ఎన్నికల్లో అధికారం కోల్పోవడం ..ఆ తర్వాత జరిగిన వరస ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమిపాలవడంతో క్యాడర్, నేతల్లో నైరాశ్యం నెలకొంది. ఇలాంటి తరుణంలో కవిత రాజకీయంగా యాక్టీవ్ కావడం కూడా బీఆర్ఎస్కు తలనొప్పిగా మారబోతుందట. కవిత పార్టీ పెడుతున్నట్లు ప్రకటించిన తర్వాత కాంగ్రెస్, బీజేపీ నేతలు దానిపై స్పందించినప్పటికి… బీఆర్ఎస్ మాత్రం అచితూచి వ్యవహారిస్తుంది. ప్రజా స్వామ్యంలో కవిత పార్టీని స్వాగతిస్తామని టీపీసీసీ చీఫ్ మమేష్కుమార్గౌడ్ అన్నారు.అయితే కవిత పార్టీతో కాంగ్రెస్ కు ఉన్న ఓటు బ్యాంకు చెక్కుచెదరదనే ధీమా వ్యక్తం చేశారు.
ప్రజాస్వామ్యం లో ఎవ్వరైనా ఎన్ని పార్టీలు అయినా పెట్టుకోవచ్చని, ప్రజలకు మంచి చేస్తే వారిని స్వాగతిస్తామని బీజేపీ నాయకులు అంటున్నారు. ఇదే సమయంలో బీఆర్ఎస్ నాయకత్వం మాత్రం ఆమెను ఒక రాజకీయ ప్రత్యర్థిగానే చూస్తోంది. ఆమె సొంతంగా ఎదిగేంత సీన్ లేదనే విధంగా గులాబీ నేతలు మాట్లాడుకుంటున్నారట. మొత్తంగా కవిత పార్టీ …ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో డిబెట్గా మారింది. పార్టీ జెండా,ఏజెండా ఎంటో ప్రకటిస్తే కానీ…కవిత పార్టీ ప్రభావం ఏమేరకు ఉంటుంది…ఏ పార్టీపై ఇంప్యాక్ట్ చూపబోతుందనేది స్పష్టం అవ్వదంటున్నారు.
Also Read: పెళ్లి విందులో ‘లెగ్ పీస్’ వార్.. వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే!
Story by: Apparao, Big Tv