PM Modi: మహిళా రిజర్వేషన్ బిల్లు లేదా నారీ శక్తి వందన్ అధినియమ్ చట్టసభల్లో ఆమోదం పొందే కీలక తరుణంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోషల్ మీడియా వేదికగా ఎంపీలందరికీ పిలుపునిచ్చారు. పార్లమెంట్లో ఓటింగ్ జరగడానికి కొద్దిసేపటి ముందు ఆయన ఈ ట్వీట్ చేశారు. ఇది కేవలం ఒక చట్టం మాత్రమే కాదని, దేశంలోని సగం జనాభాకు ఇస్తున్న గొప్ప గౌరవమని ఆయన అభివర్ణించారు.
ప్రతి ఎంపీ తమ ఇంట్లోని తల్లి, సోదరి, కుమార్తె, భార్యను గుర్తుకు తెచ్చుకుని, తమ అంతరాత్మ ప్రభోదం మేరకు ఈ బిల్లుపై నిర్ణయం తీసుకోవాలని ప్రధాని కోరారు. “మన దేశ నారీ శక్తికి కొత్త అవకాశాలను దూరం చేయకండి. మన ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసేందుకు, మహిళా శక్తిని మరింత సాధికారత వైపు నడిపించేందుకు ఈ సవరణ బిల్లుకు మద్దతు తెలపండి.” అని ఆయన విజ్ఞప్తి చేశారు. రాజకీయాలకు అతీతంగా అందరూ కలిసివచ్చి నేడు ఒక కొత్త చరిత్రను సృష్టిద్దామని పిలుపునిచ్చారు.
దాదాపు 40 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న ఈ మహిళా రిజర్వేషన్ల అంశం ఎంతో కాలయాపనకు గురైందని మోదీ ఆవేదన వ్యక్తం చేశారు. స్వాతంత్య్రం వచ్చి దశాబ్దాలు గడుస్తున్నా, నిర్ణయాధికారాల్లో మహిళలకు పరిమిత ప్రాతినిధ్యం ఉండటం సరైనది కాదని ఆయన అభిప్రాయపడ్డారు. దేశ ప్రగతిలో సగభాగంగా ఉన్న మహిళలకు వారి న్యాయబద్ధమైన వాటాను అందించాల్సిన సమయం ఇదేనని స్పష్టం చేశారు. నిన్న అర్ధరాత్రి 1 గంట వరకు, మళ్ళీ ఈ ఉదయం నుంచి పార్లమెంట్లో జరిగిన చర్చల్లో ప్రభుత్వం అన్ని సందేహాలను నివృత్తి చేసిందని, వాస్తవాలతో కూడిన సమాధానాలు ఇచ్చిందని గుర్తు చేశారు.
“కోట్లాది మంది మహిళలు ఈరోజు మన ఉద్దేశాలను, మనం తీసుకునే నిర్ణయాలను గమనిస్తున్నారు. వారి మనోభావాలను దెబ్బతీసేలా ఎవరూ ప్రవర్తించవద్దని నేను కోరుతున్నాను.” అని ప్రధాని ఎంపీలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. లోక్సభలో ఓటింగ్ జరగనున్న ఈ తరుణంలో అన్ని రాజకీయ పార్టీలు సున్నితంగా ఆలోచించి, మహిళా రిజర్వేషన్లకు అనుకూలంగా ఓటు వేయాలని అభ్యర్థించారు. అందరి ఏకాభిప్రాయంతో ఈ బిల్లు ఆమోదం పొందితే, అది భారత ప్రజాస్వామ్య చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.