Budget Session 2026: వికసిత్ భారత్ నిర్మాణంలో 2026 ఏడాది కీలకమైనదిగా వర్ణించారు రాష్ట్రపతి ముర్ము. దశాబ్ద కాలంలో అన్నిరంగాలలో తన పునాదులను భారత్ పటిష్ఠం చేసుకుందన్నారు. అలాగే భవిష్యత్ వృద్ధికి బలమైన మార్గాన్ని నిర్మించుకుందని వెల్లడించారు. ముఖ్యంగా గ్రామీణ ఉపాధి కల్పన కోసం జీ రామ్ జీ చట్టాన్ని తీసుకువచ్చామని గుర్తు చేశారు.
పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభం.. రాష్ట్రపతి ముర్ము కీలక ప్రసంగం
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జనవరి 28 నుంచి నుంచి ప్రారంభమయ్యాయి. బుధవారం ఉదయం 11 గంటలకు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రసంగించారు.పూర్వీకుల సేవలను గౌరవించుకున్నప్పుడు యువతరంలో స్ఫూర్తి రగులుతుందన్నారు. అభివృద్ధి చెందిన దేశంగా భారత్ తన ప్రయాణాన్ని వేగవంతం చేస్తోందన్నారు.
వికసిత్ భారత్ విషయంలో రైతులకు తొలి ప్రాధాన్యం ఇచ్చామన్నారు. వ్యవసాయ మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం, వెనుకబడిన వర్గాల సంక్షేమం ప్రభుత్వ లక్ష్యమన్నారు. పదేళ్ల ఎన్డీయే పాలనలో దాదాపు 25 కోట్ల మందికి పేదరికం నుంచి విముక్తి కల్పించినట్లు పేర్కొన్నారు. అంతేకాదు 100 కోట్లకు పైగా గ్యాస్ కనెక్షన్లు ఇచ్చామని, ఆయుష్మాన్ భారత్ ద్వారా కోట్లాది మందికి వైద్య సేవలు అందిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఈ ఏడాది వికసిత్ భారత్కు పునాది-రాష్ట్రపతి
ఈసారి పదవీకాలంలో పేదలకు సాధికారత కల్పించే ప్రయత్నాలు వేగవంతం చేసినట్టు చెప్పారు. ప్రస్తుతం దేశంలో 150 వందే భారత్ రైళ్లు నడుస్తున్నాయని నొక్కి వక్కానించారు. అలాగే యూరోపియన్ యూనియన్తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంతో సేవా -తయారీ రంగాలకు ఊతం ఇస్తోందన్నారు. దీనివల్ల యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు.ప్రభుత్వం సంస్కరణల మార్గంలో పయనిస్తోందన్నారు.
జమ్మూకాశ్మీర్లో అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జి నిర్మించామని ఈ సందర్భంగా గుర్తు చేశారు రాష్ట్రపతి. స్పేస్ టూరిజం అభివృద్ధికి దేశంలో ఎన్నో అవకాశాలున్నాయని, భవిష్యత్లో అంతరిక్షంలో భారత స్పేస్ స్టేషన్ ఏర్పాటు చేస్తామన్నారు. అవినీతి కట్టడితో ప్రజాధనాన్ని ప్రభుత్వ సద్వినియోగం చేస్తోందన్నారు.
జీఎస్టీ స్లాబ్ల తగ్గింపుతో ప్రజల కొనుగోలు శక్తి పెరిగిందన్నారు. రూ.12లక్షల వార్షిక ఆదాయం వరకు ఆదాయపు పన్ను లేకుండా చేశామన్నారు. గ్రీన్ ఎనర్జీ రంగంలో భారత్ను పవర్ హౌస్గా తయారు చేస్తున్నట్లు వివరించారు. భవిష్యత్లో 100 గిగావాట్ల న్యూక్లియర్ ఎనర్జీ ఉత్పత్తి లక్ష్యమన్న రాష్ట్రపతి, 500 గిగావాట్ల గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తికి చర్యలు మొదలైనట్టు తెలిపారు.
ALSO READ: ఆకాశంలో ఆరిపోయిన ధ్రువతారలు.. రాజకీయ గమనాన్ని మార్చిన ఘోర ప్రమాదాలు!
ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలో 15 లక్షల ఉద్యోగాలు సృష్టించామన్నారు. పీఎం విశ్వకర్మ యోజనతో 20 లక్షల మందికి శిక్షణ ఇస్తున్నామని రాష్ట్రపతి తెలిపారు. కొత్త విక్షిత్ భారత్–జి RAM G చట్టం గురించి తన ప్రసంగంలో ప్రస్తావించారు. గ్రామాల్లో 125 రోజుల పనికి హామీ ఇవ్వడం ద్వారా రూరల్ ప్రాంతాల్లో ఉపాధి, అభివృద్ధిని ప్రోత్సహించడమే కొత్త చట్టం లక్ష్యమన్నారు.
ఆమె వ్యాఖ్యలపై ప్రతిపక్ష సభ్యులు నిరసన వ్యక్తం చేస్తూ చట్టాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. గురువారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆర్థిక సర్వేను సభలో ప్రవేశపెట్టనున్నారు. ఫిబ్రవరి ఒకటి అనగా ఆదివారం కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు.