Constitution Day: దిల్లీలోని పార్లమెంటు సంవిధాన్ సదన్ లో 75వ రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ పాల్గొని ప్రసంగించారు. ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ తన మాతృభాష తమిళంలో రాజ్యాంగ దినోత్సవ ప్రసంగం చేశారు. మలయాళం, మరాఠీ, నేపాలీ, పంజాబీ, బోడో, కాశ్మీరీ, తెలుగు, ఒడియా, అస్సామీలతో సహా తొమ్మిది భాషలలో రాజ్యాంగం అనువాదాలను, డిజిటల్ కాపీలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు, లోక్సభ స్పీకర్ ఓం బిర్లాతో పాటు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ పాల్గొన్నారు.
పార్లమెంటు సభ్యులను ఉద్దేశించి ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ మాట్లాడుతూ.. రాజ్యాంగ నిర్మాతలను ప్రశంసించారు. రాజ్యాంగం భారత జాతి ఆత్మను ప్రతిబింబిస్తుందని అన్నారు.
“డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, ఎన్.గోపాలస్వామి అయ్యంగార్, అల్లాడి కృష్ణస్వామి అయ్యర్, కేఎం మున్షి, దుర్గాబాయి దేశ్ముఖ్, మరెందరో గొప్ప నాయకులు రాజ్యాంగాన్ని రూపొందించారు. రాజ్యాంగంలోని ప్రతి పేజీలో దేశం ఆత్మను ప్రతిబించారు. రాజ్యాంగ సభలో అత్యుత్తమ నాయకులు రాజ్యాంగాన్ని రూపొందించి, చర్చించి, ఆమోదించారు. స్వేచ్ఛ కోసం పోరాడిన లక్షలాది మంది భారతీయుల సమిష్టి కృషి, త్యాగం, వారి కలలకు ప్రతిబింబం” అని ఉపరాష్ట్రపతి అన్నారు.
“గొప్ప నేతలు, ముసాయిదా కమిటీ, రాజ్యాంగ సభ సభ్యులు కోట్లాది మంది భారతీయుల ఆశలు, ఆకాంక్షలను నెరవేర్చడానికి ఎన్నో ఆలోచనలు చేసి రాజ్యాంగాన్ని రాశారు. వారి నిస్వార్థ సహకారం భారతదేశాన్ని నేడు ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యంగా మార్చింది. రాజ్యాంగం భారతీయులు తెలివితేటలు, జీవిత అనుభవం, త్యాగాలు, ఆశలు, ఆకాంక్షల నుంచి పుట్టింది” అని సీపీ రాధాకృష్ణన్ అన్నారు.
లోక్సభ స్పీకర్ ఓం బిర్లా రాజ్యాంగ పరిషత్ ఛైర్మన్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్లకు నివాళులర్పించారు. అనంతరం స్పీకర్ ఓం బిర్లా మాట్లాడుతూ.. భారత రాజ్యాంగ సభ అధ్యక్షుడు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేడ్కర్, మరియు రాజ్యాంగ సభ సభ్యులందరికీ నివాళులు అర్పిస్తున్నానన్నారు. వారి అద్భుతమైన జ్ఞానం, దూరదృష్టి కృషి ఫలితంగా నేడు ప్రతి పౌరుడికి న్యాయం, సమానత్వం, సోదరభావం, గౌరవం దక్కుతున్నాయన్నారు.
రాజ్యాంగ సభ చర్చించిన పవిత్ర ప్రదేశంగా సంవిధాన్ సదన్ను ప్రస్తావిస్తూ, గత డబ్బై ఏళ్లుగా ప్రభుత్వాలు సామాజిక న్యాయం, సమగ్ర అభివృద్ధిని సాధించడానికి విధానాలను రూపొందించాయని స్పీకర్ పేర్కొన్నారు.
Also Read: Delhi Blast Case: ఢిల్లీ పేలుడు ఘటనలో మరొకరు అరెస్ట్.. ఉమర్తో ఎలాంటి సంబంధం ఉందంటే..!
నవంబర్ 26, 1949న భారత రాజ్యాంగ సభ రాజ్యాంగాన్ని అధికారికంగా ఆమోదించింది. ఇది జనవరి 26, 1950న అమల్లోకి వచ్చింది. ఈ కార్యక్రమంలో భారత రాజ్యాంగ ప్రవేశికను రాష్ట్రపతి ముర్ము చదివారు. భారత రాజ్యాంగంలోని కళ, కాలిగ్రఫీ అనే స్మారక బుక్లెట్ రాష్ట్రపతి విడుదల చేశారు.