Kalvakuntla Kavitha: సింగరేణి సంస్థలో డిపెండెంట్ ఉద్యోగాల విషయంలో.. కాంగ్రెస్ ప్రభుత్వం కార్మికులకు ద్రోహం చేస్తోందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్రంగా విమర్శించారు. కార్మికుల భవిష్యత్తుతో చెలగాటమాడుతూ, వారి పిల్లలకు రావాల్సిన ఉద్యోగాలను అడ్డుకునే ప్రయత్నం ప్రభుత్వం చేస్తోందని ఆమె ఆరోపించారు. సింగరేణిలో పనిచేస్తూ జీవితాలు గడిపిన కార్మికుల కుటుంబాలకు భరోసా కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం మరిచిపోయిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
సింగరేణిలో చాలా కాలంగా డిపెండెంట్ ఉద్యోగాల వ్యవస్థ కొనసాగుతుందని, కార్మికులు శ్రమించి అండర్ గ్రౌండ్లో పనిచేస్తూ ఆరోగ్యం పూర్తిగా దెబ్బతిన్న తర్వాత తమ పిల్లలకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే ఆశతో.. రిటైర్ కావాలని కోరుకుంటారని కవిత తెలిపారు. ఈ నేపథ్యంలో 129 మంది కార్మికులు తాము ఉద్యోగానికి అన్ఫిట్గా గుర్తించాలని కోరుతూ దరఖాస్తు పెట్టుకున్నారని ఆమె వెల్లడించారు. అయితే, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన మెడికల్ బోర్డు కేవలం 23 మందిని మాత్రమే అన్ఫిట్గా ప్రకటించి, మిగిలిన వారిని సర్ఫేస్ పనులకు పంపించిందని ఆమె తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
అసలు తాము ఇక పనిచేసే శక్తి లేదని కార్మికులు ఎందరో మొరపెట్టుకుంటున్నా, వారిని వినిపించుకోవడం లేదని కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. అండర్ గ్రౌండ్లో పని చేసి నడుములు విరిగిపోయిన కార్మికుల పరిస్థితి కనికరం కలిగించాల్సింది పోయి, ప్రభుత్వ నిర్ణయాలు వారిని మరింత ఇబ్బందులకు గురి చేస్తున్నాయని ఆమె అన్నారు. గతంలో తమ ప్రభుత్వం ఉన్న సమయంలో అధికారులు మాట్లాడి, కార్మికులకు న్యాయం జరిగేలా ఎక్కువ శాతం మందిని అన్ఫిట్గా గుర్తించేలా చర్యలు తీసుకున్నామని కవిత గుర్తు చేశారు.
డిపెండెంట్ ఉద్యోగాల వ్యవస్థ సింగరేణి సంస్థకు వెన్నుముకగా నిలుస్తుందని, యువ రక్తంతో సంస్థ బలోపేతం అవుతుందని ఆమె స్పష్టం చేశారు. కానీ ప్రస్తుతం ఆ వ్యవస్థను నిర్వీర్యం చేయాలనే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం అడుగులు వేస్తోందని తీవ్ర స్థాయిలో విమర్శించారు. కేవలం 18 శాతానికి మాత్రమే అన్ఫిట్గా గుర్తించడం ఘోర అన్యాయమని, దీన్నిబట్టి ప్రభుత్వం కార్మికుల పట్ల ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందో అర్థమవుతోందని ఆమె అన్నారు.
ఇంతకుముందు కూడా సింగరేణిలో 54 మందితో మెడికల్ బోర్డు ఏర్పాటు చేసిన విషయం గుర్తు చేస్తూ, అప్పట్లో కేవలం నలుగురినే అన్ఫిట్గా గుర్తించారని, మిగతా 50 మందికి తీవ్ర అన్యాయం జరిగిందని కవిత విమర్శించారు. ప్రస్తుతం సర్ఫేస్కు మార్చిన 84 మంది కార్మికులంతా కూడా తాము అన్ఫిట్గా ప్రకటించాలని కోరుకుంటున్నారని ఆమె తెలిపారు. వారి కోరికలను పట్టించుకోకుండా ప్రభుత్వం కావాలనే అన్యాయం చేస్తోందని ఆరోపించారు.
కార్మికులకు రావాల్సిన హక్కుల కోసం రోడ్ల మీదకు వచ్చి పోరాటం చేస్తేనే అధికారులు స్పందిస్తున్నారని, పోరాటం ద్వారానే మెడికల్ బోర్డు ఏర్పాటు చేయాల్సి వచ్చిందని కవిత విమర్శించారు. అయినా కూడా బోర్డు నిర్ణయాల్లో పారదర్శకత లేదని, దొడ్డి దారిన నిర్ణయాలు తీసుకుంటూ కార్మికుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని ఆమె మండిపడ్డారు.
సింగరేణిలో పని చేసి జీవితాంతం సంస్థకు సేవలందించిన కార్మికుడి బిడ్డకు ఉద్యోగం ఇవ్వడం ప్రభుత్వ బాధ్యతని కవిత స్పష్టం చేశారు. కానీ ఆ బాధ్యతను విస్మరించి ఉద్యోగాలను అడ్డుకునే దిశగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆమె అన్నారు. ఈ విధానాన్ని తెలంగాణ జాగృతి తీవ్రంగా ఖండిస్తుందని, ప్రభుత్వం తన వైఖరి మార్చుకోకపోతే పెద్ద ఎత్తున ప్రజా పోరాటాలకు దిగుతామని హెచ్చరించారు.
Also Read: అచ్చంపేట ఆర్డీవో మాధవి బదిలీ.. సంబరాలు చేసుకున్న స్థానికులు
కార్మికుల పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వటం ప్రధాన లక్ష్యంగా పని చేయాల్సిన ప్రభుత్వం, ఆ ఉద్యోగాలను ఆపేందుకు కుట్రలు చేస్తోందని కవిత ఆరోపించారు. ఈ అన్యాయాన్ని సహించేది లేదని, న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. “ఎట్టి పరిస్థితుల్లోనూ కార్మికుల హక్కుల కోసం వెనక్కి తగ్గం. ప్రభుత్వం వెంటనే తన నిర్ణయాన్ని పునఃసమీక్షించి, అందరికీ సముచిత న్యాయం చేయాలి అని కవిత డిమాండ్ చేశారు.