Pune Civic Polls: ఇటీవల జరిగిన పూణే మున్సిపల్ ఎన్నికల్లో అతి చిన్న వయస్సులో ఓ విద్యార్థిని కార్పొరేటర్ గా విజయం సాధించింది. పూణే స్థానిక ఎన్నికలలో బీజేపీ నుంచి పోటీ చేసి సింబయాసిస్ విద్యార్థి 22 ఏళ్ల సాయి తోప్టే.. వార్డు మెంబర్ గా విజయం సాధించారు. పూణే ఎన్నికల్లో ఒక ముఖ్యమైన మైలురాయిగా ఈ విజయం నిలుస్తుందని స్థానిక నేతలు అంటున్నారు.
పూణే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ నుంచి సాయి తోప్టే కార్పొరేటర్ గా పోటీ చేసి విజయం సాధించారు. సాయి తోప్టే ప్రస్తుతం పూణేలోని సింబయాసిస్ కాలేజీలో బీబీఏ చివరి ఏడాది చదువుతోంది. విద్యార్థిగా ఉన్న తోప్టేను బీజేపీ తమ అభ్యర్థిగా ప్రకటించింది. విద్యార్థి వయస్సులోనే ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించడం ఆమె రాజకీయ ప్రయాణంలో ఒక మైలురాయిగా నిలుస్తుంది.
తోప్టే ఏబీవీపీలో యాక్టివ్ గా ఉండేవారు. దీంతో ఆమె పూణేలోని వివిధ సమస్యలపై ఉద్యమాలు చేశారు. కాలేజీలో విద్యార్థుల సమస్యలపై పోరాటం చేశారు. క్రియాశీల రాజకీయాలలో ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తున్న సాయి తోప్టే.. రాజకీయ నేపథ్యం నుంచే వచ్చారు. ఆమె తండ్రి ప్రశాంత్ తోప్టే చాలా ఏళ్లుగా బీజేపీలో ఉన్నారు. పార్వతి అసెంబ్లీ నియోజకవర్గంలో పార్టీ ఉపాధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి, అసెంబ్లీ ఎన్నికల సమన్వయకర్త వంటి కీలక బాధ్యతలను నిర్వహించారు.
Also Read: టీవీకే పొత్తు ఎవరితో? విజయ్ చుట్టూ తమిళ రాజకీయం..
పార్వతి, సహకార్నగర్, ధంకావడి వంటి ప్రాంతాలలో బీజేపీని బలోపేతం చేయడంలో ప్రశాంత్ తోప్టే కీల పాత్ర పోషించారు. పార్వతి ఎమ్మెల్యే మాధురి మిసల్ మద్దతుతో సాయి తోప్టేను వార్డు మెంబర్ అభ్యర్థిగా నామినేట్ చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ఈ విజయంతో.. పూణేలో అతి చిన్న వయస్సులో కార్పొరేటర్లలో ఒకరిగా సాయి గుర్తింపు పొందారు. సాయి తోప్టేతో పాటు సహకార్నగర్–పద్మావతి నుంచి నలుగురు బీజేపీ అభ్యర్థులు విజయాలు నమోదు చేశారు.