Putin Guard Of Honor: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ శుక్రవారం ఉదయం రాష్ట్రపతి భవన్కు చేరుకున్నారు. భారత త్రివిధ దళాల నుంచి పుతిన్ గౌరవ వందనం స్వీకరించారు. ఆయనకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ స్వాగతం పలికారు. గౌరవ వందనం స్వీకరించడానికి పుతిన్ వచ్చినప్పుడు ఓ ఆసక్తికర ఘటన జరిగింది. పుతిన్ కారు దిగిన వెంటనే రాష్ట్రపతి ముర్ము గార్డుకు షేక్ హ్యాండ్ ఇచ్చారు. అనంతరం ప్రధాని మోదీ, రాష్ట్రపతి ముర్ముతో షేక్ హ్యాండ్ ఇచ్చారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గార్డ్ ఆఫ్ హానర్ అంటే ఇదే అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. గార్డును మొదటిగా పలకరించడంతో పుతిన్ మంచి మనసును చాటుకున్నారని అంటున్నారు.
భారత్ రక్షణ దళాలు రష్యా అధ్యక్షుడు పుతిన్ కు గౌరవ వందనం అందిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. పుతిన్ కు ప్రధాని మోదీ, రాష్ట్రపతి సాదరస్వాగతం పలికారు. ఆ తర్వాత పుతిన్ రెడ్ కార్పెట్పై నడిచి సైనిక గౌరవ వందనం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీతో పాటు, విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్ పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
President of Russia Vladimir Putin receives a Guard of Honour at the Rashtrapati Bhawan in New Delhi
Watch:@rashtrapatibhvn pic.twitter.com/j20wz7hYRd
— PIB India (@PIB_India) December 5, 2025
గౌరవ వందనం స్వీకరించిన అనంతరం పుతిన్ హైదరాబాద్ హౌస్లో జరిగే 23వ భారత్-రష్యా శిఖరాగ్ర సమావేశంలో ప్రధాని మోదీని కలిసారు. ద్వైపాక్షి సమావేశం అనంతరం రాష్ట్రపతి ముర్మును కలవడానికి పుతిన్ రాష్ట్రపతి భవన్కు వచ్చారు. పుతిన్ శుక్రవారం రాత్రి మాస్కోకు తిరిగి బయలుదేరారు. 24 గంటల్లో పుతిన్ తన భారత పర్యటనను ముగించారు. శుక్రవారం రాత్రి రాష్ట్రపతి ముర్ము అధికారిక విందు అనంతరం పుతిన్ మాస్కోకు బయల్దేరి వెళ్లారు.
గురువారం న్యూదిల్లీలోని పాలం విమానాశ్రయంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కౌగిలింతతో స్వాగతించారు. కళాకారుల బృందం సాంప్రదాయ నృత్యాలు ప్రదర్శించారు. విమానాశ్రయం నుంచి ఇద్దరు నాయకులు ఒకే కారులో ప్రధాని మోదీ అధికారిక నివాసానికి బయలుదేరి వెళ్లారు. అనంతరం ఓ ప్రైవేట్ విందులో ఇరువురు పాల్గొన్నారు.
భారత్- రష్యా మధ్య రక్షణ సంబంధాలను బలోపేతం చేయడం, వాణిజ్యంపై ఒత్తిడిని తగ్గించడం, చిన్న మాడ్యులర్ రియాక్టర్లలో సహకారాన్ని అందించడం వంటి కీలక విషయాలపై శిఖరాగ్ర సమావేశంలో చర్చించారు. భారత్-అమెరికా సంబంధాలు క్షీణిస్తున్న నేపథ్యంలో పుతిన్ న్యూదిల్లీ పర్యటన ప్రాముఖ్యతను సంతరించుకుంది.