India Russia Summit: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్ లో పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో భారత్-రష్యా మధ్య కీలక ఒప్పందాలు జరిగాయి. వివిధ రంగాల్లో పరస్పర సహకారానికి ఒప్పందాలపై సంతకాలు చేశారు. ఆహార భద్రత, హెల్త్, లేబర్ మైగ్రేషన్ మొబిలిటీ, పోర్టులు, నౌకాయానంపై ఇరు దేశాలు ఒప్పందాలు చేసుకున్నాయి. ఉగ్రవాదంపై పోరాటంలో సంయుక్తంగా పోరాడాలని భారత్-రష్యా నిర్ణయించాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం మధ్యాహ్నం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో కలిసి జాయింట్ ప్రెస్ మీట్ లో ప్రకటించారు. నాలుగేళ్ల తర్వాత తొలిసారిగా పుతిన్ భారత్ పర్యటనకు వచ్చిన విషయం తెలిసిందే.
ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడానికి భారత్ చేస్తున్న ప్రయత్నాలకు మాస్కో మద్దతుదారుగా నిలబడింది. పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థ జైష్-ఎ-మొహమ్మద్ కు ఏప్రిల్లో జమ్మూ కశ్మీర్ పహల్గామ్లో జరిపిన దాడితో సంబంధం ఉందని తేలిన తర్వాత రష్యా తీవ్రంగా స్పందించింది. ఈ దాడిని ఖండిస్తూ… అన్ని రూపాల్లో ఉగ్రవాదాన్ని నిర్మూలించడానికి భారత్ కు అండగా నిలుస్తామని మాస్కో తెలిపింది. పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలను, పాక్ ఆక్రమిత కశ్మీర్లోని కొన్ని ప్రాంతాలను లక్ష్యంగా చేసుకున్న ఆపరేషన్ సిందూర్ పై కూడా రష్యా భారత్ కు మద్దతుగా నిలబడింది.
“గత ఎనిమిది దశాబ్దాలుగా, ప్రపంచం అనేక సవాళ్లు మరియు సంక్షోభాలను చూసింది” అని ప్రధాని మోదీ అన్నారు. అనేక సవాళ్లను, సంక్షోభాలను ఎదురైనా భారతదేశం-రష్యా స్నేహం స్థిరంగా ఉందని, పరస్పర గౌరవం, నమ్మకంతో ముందుకు సాగుతున్నాయన్నారు.
దిల్లీలోని హైదరాబాద్ హౌస్ లో ప్రధాని మోదీ, రష్యా అధ్యక్షుడు పుతిన్ సంయుక్తంగా వాణిజ్యం, ఆర్థిక సహకారాలపై ప్రకటనలు చేశారు. షిప్పింగ్ రంగానికి సంబంధించి ఒక అవగాహన ఒప్పందం కూడా చేసుకున్నారు. రష్యా చమురు కొనుగోలును నిలిపివేయాలని అమెరికా నుంచి దిల్లీ ఒత్తిడిని ఎదుర్కొంటున్నప్పటికీ, భారత్ కు నిరంతరంగా చమురు సరఫరా కొనసాగించడానికి రష్యా సుముఖంగా ఉందని పుతిన్ స్పష్టం చేశారు.
భారతదేశం పట్ల నిబద్ధతకు పుతిన్ కు ప్రధాని మోదీ కృతజ్ఞతలు తెలిపారు. ఇంధన భద్రత భారత్-రష్యా భాగస్వామ్యానికి బలమైన బంధంగా నిలబడిందన్నారు. యూఎస్ ఒత్తిళ్ల నేపథ్యంలో చమురు గురించి ప్రత్యేకంగా ప్రస్తావించలేదు. అయితే అణు, స్వచ్ఛమైన శక్తి గురించి ఇరు నేతలు ప్రస్తావించారు.
రెండు దేశాల అధికారులు ఉద్యోగాలు, ఆరోగ్యం, షిప్పింగ్, రసాయనాలకు సంబంధించిన అనేక కీలక ఒప్పందాలు చేసుకున్నారు. ఆర్థిక సహకారం, స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం గురించి కూడా ఇరుదేశాలధినేతలు మాట్లాడారు. వార్షిక ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 100 బిలియన్ డాలర్లకు పెంచాలని ఇరు దేశాలు నిర్ణయించాయని పుతిన్ తెలిపారు. యూఎస్ డాలర్కు ప్రత్యామ్నాయాన్ని ప్రోత్సహించవచ్చనే ఊహాగానాల మధ్య పుతిన్ మాట్లాడుతూ.. భారత్, రష్యా ద్వైపాక్షిక చెల్లింపుల కోసం ఇరు దేశాల కరెన్సీలను ఉపయోగించే దిశగా చర్చలు జరుపుతున్నామన్నారు.
Also Read: Putin India Visit: రాష్ట్రపతి భవన్ లో పుతిన్కు సాదర స్వాగతం, కాసేపట్లో ప్రధాని మోడీతో కీలక చర్చలు
ఫిబ్రవరి 2022 నుంచి ఉక్రెయిన్పై రష్యా యుద్ధం కొనసాగుతోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జోక్యం చేసుకున్నప్పటికీ యుద్ధం ముగింపు కనిపించడం లేదు. యుద్ధాన్ని పరిష్కరించడానికి ప్రధాని మోదీ చేసిన ప్రయత్నాలకు పుతిన్ కృతజ్ఞతలు తెలిపారు. గురువారం సాయంత్రం దిల్లీకి చేరుకున్న పుతిన్ తో ఉపయోగరమైన చర్చలు సాగాయని మోదీ అన్నారు. యుద్ధాన్ని శాంతియుతంగా పరిష్కరించడానికి ప్రధాని మోదీతో ప్రణాళికలను పంచుకున్నామని రష్యా అధినేత పుతిన్ చెప్పారు.