Raghuram Rajan : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఉత్సాహంగా సాగుతోంది. ప్రస్తుతం రాహుల్ రాజస్థాన్ లో పాదయాత్ర కొనసాగిస్తున్నారు. అయితే ఈ యాత్రలో మరో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ భారత్ జోడో యాత్రలో పాల్గొన్నారు. బుధవారం రాజస్థాన్ లో సవాయ్ మాధోపూర్ నుంచి రాహుల్ పాదయాత్ర ప్రారంభమైంది. ఈ యాత్రలో పాల్గొన్న రఘురామ్ రాజన్.. రాహుల్ తో పలు అంశాలను చర్చిస్తూ నడిచారు.
గతంలో నోట్ల రద్దును వ్యతిరేకించినప్పుడు కాంగ్రెస్ కు రఘురామ్ రాజన్ మద్దతిచ్చారు. నోట్ల రద్దుపై బహిరంగంగానే ఆయన అనేక విమర్శలు చేశారు. ఇలాంటి నిర్ణయాల వల్ల దీర్ఘకాల ప్రయోజనాలకు ఇబ్బంది కలుగుతుందని స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని తాను రాసిన పుస్తకంలోనూ వివరించారు. భారత ఆర్థిక వృద్ధి, ద్రవ్యలోటుపైనా ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ ఏడాది కాంగ్రెస్ ఏర్పాటు చేసిన ఓ సదస్సులోనూ రఘురామ్ రాజన్ పాల్గొన్నారు. ఆ సదస్సులోనూ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయ నాయకులు మైనారిటీలను లక్ష్యంగా చేసుకొని ఉద్యోగ సంక్షోభాన్ని కప్పిపుచ్చుకోవాలనుకుంటే శ్రీలంక తరహా పరిస్థితులు తలెత్తుతాయని సంచలన కామెంట్స్ చేశారు.
మరోవైపు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర సెప్టెంబర్ 7న తమిళనాడులో కన్యాకుమారిలో మొదలైంది. కేరళ, కర్నాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ లో యాత్ర పూర్తైంది. ప్రస్తుతం రాజస్థాన్ లో కొనసాగుతోంది. ఇప్పటి వరకు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేసిన రాష్ట్రాల్లో రాజస్థాన్ లో మాత్రమే కాంగ్రెస్ అధికారంలో ఉంది. రాహుల్ పాదయాత్ర వచ్చే ఏడాది జనవరి చివరి నాటికి కశ్మీర్ చేరుకుంటుంది. భారత్ జోడో యాత్రలో పలువురు సినిమా సెలబ్రిటీలు, మాజీ అధికారులు, సామాజిక హక్కుల కార్యకర్తలు పాల్గొంటున్నారు. ప్రజల సమస్యలు తెలుసుకుంటూ రాహుల్ గాంధీ ముందుకు సాగుతున్నారు. కేంద్రంలో మళ్లీ కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా భారత్ జోడో యాత్ర చేస్తున్నారు.