Rahul Gandhi: రాహుల్ గాంధీ ఢిల్లీలో జరిగిన నిరసన ఘటనా పరిణామాలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. విద్యార్థుల భవిష్యత్తు, హక్కుల కోసం పోరాడుతున్న వారిపై ప్రభుత్వం క్రూరంగా ప్రవర్తిస్తోందని ఆరోపిస్తూ, సోషల్ మీడియా వేదికగా ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
బాధితుడు.. సాహిల్
ఢిల్లీ విశ్వవిద్యాలయంలో చదువుకుంటున్న 19 ఏళ్ల సాహిల్ అనే యువకుడు, తన కుటుంబాన్ని పోషించుకోవడానికి పార్ట్టైమ్గా డ్రైవింగ్ చేస్తుంటాడు. అతను 2025 SSC ఢిల్లీ కానిస్టేబుల్ పేపర్ లీక్ వల్ల తీవ్రంగా నష్టపోయిన అభ్యర్థుల్లో ఒకరు. మళ్లీ అదే ఏజెన్సీకి కాంట్రాక్టు ఇవ్వడం వల్ల పేపర్ లీక్ అవుతుందేమోననే భయంతో, న్యాయం కోసం జూలై 20న నిర్వహించిన శాంతియుత నిరసనలో పాల్గొన్నాడు.
పోలీసుల చర్య..
శాంతియుతంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులపై ఢిల్లీ పోలీసులు పెల్లెట్ గన్ ప్రయోగించారని, ఈ క్రమంలో సాహిల్ ముఖానికి తీవ్ర గాయాలయ్యాయని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. పోలీసుల చర్య కారణంగా ఆ యువకుడు ఒక కంటి చూపును శాశ్వతంగా కోల్పోయే ప్రమాదకర పరిస్థితిలో ఉన్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రశ్నించినందుకు విద్యార్థులకు ప్రభుత్వం ఇస్తున్న శిక్ష ఇదేనా అని నిలదీశారు.
ప్రభుత్వ వైఖరిపై విమర్శలు
దేశంలో పేపర్ లీక్లు, అవకతవకలతో యువత భవిష్యత్తు నాశనమవుతోందని, న్యాయం అడిగిన వారిపై లాఠీలు, పెల్లెట్ గన్లతో విరుచుకుపడటం సరికాదని రాహుల్ గాంధీ విమర్శించారు. బాధితుడు సాహిల్కు, ఆందోళన చేస్తున్న విద్యార్థులందరికీ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. ఈ దారుణానికి ప్రధాని నరేంద్ర మోదీ దేశంలోని విద్యార్థులకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలన్నారు. అలాగే దాడికి బాధ్యులైన అధికారులపై తక్షణమే కఠిక చర్యలు తీసుకోవాలన్నారు. అదే విధంగా విద్యాశాఖ మంత్రి దర్మేంద్ర ప్రధాన్ను వెంటనే ఆయన పదవి నుంచి తొలగించాలని కీలక డిమాండ్లు చేశారు.
Also Read: నిరసనకారులకు బిగ్ రిలీఫ్.. కోటి పరిహారం, కేసుల ఎత్తివేతకు కేంద్రం సై- అశుతోష్ రాంకా