Rahul Gandhi: గతేడాది పహల్గామ్లో జరిగిన అత్యంత దారుణమైన ఉగ్రదాడికి ఏడాది పూర్తయిన సందర్భంగా, కాంగ్రెస్ అగ్రనేత.. లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ అమాయక బాధితులకు నివాళులర్పించారు. ఈ పిరికిపంద దాడిలో ప్రాణాలు కోల్పోయిన పర్యాటకులను స్మరిస్తూ, వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ మేరకు ఆయన తన ఎక్స్ (X) ఖాతాలో ఒక సుదీర్ఘమైన పోస్ట్ చేశారు. ఈ దాడి భారతీయ ఆత్మను కలిచివేసిందని, ఆ అమాయకుల ప్రాణత్యాగం దేశం ఎప్పటికీ మరువదని ఆయన పేర్కొన్నారు.
ఈ ఉగ్రదాడి వల్ల ఆయా కుటుంబాలు అనుభవిస్తున్న తీరని వేదన దేశం మొత్తానిదని రాహుల్ వ్యాఖ్యానించారు. అకస్మాత్తుగా తమ ఆత్మీయులను కోల్పోయిన ఆ కుటుంబాల కన్నీరు నేటికీ ప్రజల హృదయాలను కలచివేస్తోందన్నారు. భారతదేశం తన బిడ్డల బలిదానాన్ని ఎన్నడూ విస్మరించదని అలాగే ఈ ఘాతుకానికి పాల్పడిన వారిని, అందుకు కారణమైన శక్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమించదని ఆయన ఉద్ఘాటించారు.
ఉగ్రవాదం, విద్వేషం వ్యాప్తి చేసే శక్తుల ముందు భారతదేశం ఎన్నటికీ తలవంచబోదని రాహుల్ గాంధీ అన్నారు. దేశవ్యాప్తంగా ప్రజలందరూ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఐక్యంగా ఉన్నారని, భవిష్యత్తులో కూడా ఇదే ఐక్యతతో, మరింత సంకల్పంతో అటువంటి శక్తులను ఎదుర్కొంటామని ఆయన పిలుపునిచ్చారు. హింస ద్వారా భయాన్ని నింపాలనుకునే వారి ప్రయత్నాలు ఎప్పటికీ ఫలించవని, భారతదేశం తన ఐక్యతతోనే వారిని ఓడిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఉగ్రవాదం, హింసకు వ్యతిరేకంగా భారతదేశం అప్పుడు ఎలాగైతే ఐక్యంగా నిలిచిందో, ఇప్పుడు కూడా అదే దృఢ నిశ్చయంతో ఉందన్నారు రాహుల్.