PCC President Mahesh Kumar Goud: కాళేశ్వరం ప్రాజెక్టుపై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై బీఆర్ఎస్ నేతలు అప్పుడే సంబరాలు చేసుకోవద్దని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సూచించారు. హైకోర్టు ఎక్కడా బీఆర్ఎస్ నేతలకు క్లీన్ చిట్ ఇవ్వలేదని, కేవలం నోటీసుల జారీ వంటి కొన్ని విధానపరమైన అంశాల్లో లోపాలు ఉన్నాయని మాత్రమే పేర్కొందని స్పష్టం చేశారు. లక్ష కోట్ల ప్రజా ధనాన్ని వెచ్చించి కట్టిన ప్రాజెక్టు కళ్ల ముందే కుంగిపోతే, దోషులు సంబరాలు చేసుకోవడం హాస్యాస్పదమని ఆయన మండిపడ్డారు.
హైకోర్టు తీర్పును బీఆర్ఎస్ నేతలు తమకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేస్తున్నారని, కానీ కోర్టు ఎక్కడా అవినీతి జరగలేదని లేదా నిర్మాణ లోపాలు లేవని చెప్పలేదని మహేష్ కుమార్ గౌడ్ గుర్తు చేశారు. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇప్పటికే ప్రభుత్వానికి సమగ్ర నివేదిక అందించిందని, అలాగే కేంద్ర ప్రభుత్వ పరిధిలోని NDSA (National Dam Safety Authority) కూడా ప్రాజెక్టులో తీవ్రమైన నిర్మాణ లోపాలు ఉన్నాయని తేల్చి చెప్పిందని ఆయన పేర్కొన్నారు. కేసీఆర్ అన్ని తానై ఉండి కట్టిన ఈ ప్రాజెక్టు, కాంట్రాక్టుల జేబులు నింపడానికే ఉపయోగపడిందని ఆయన ఆరోపించారు.
ఈ సందర్భంగా బీజేపీ వైఖరిని కూడా ఆయన తప్పుబట్టారు. కాళేశ్వరం ప్రాజెక్టు బీఆర్ఎస్ పార్టీకి ఏటీఎం (ATM) గా మారిందని గతంలో అమిత్ షా, జేపీ నడ్డా చేసిన వ్యాఖ్యలు వాస్తవం కాదా అని ప్రశ్నించారు. ఈ విషయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎందుకు మౌనంగా ఉన్నారని, బండి సంజయ్ ఎందుకు మాట్లాడటం లేదని ఆయన నిలదీశారు. కాళేశ్వరం కేసును సీబీఐకి అప్పగించినా కేంద్రం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. హైకోర్టు తీర్పు సీబీఐ విచారణకు ఎలాంటి అడ్డంకి కాదని ఆయన స్పష్టం చేశారు.
కాళేశ్వరం దోషులు జైలుకు వెళ్లడం ఖాయమని, కేవలం కాలయాపన మాత్రమే జరుగుతోందని మహేష్ కుమార్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. విజిలెన్స్ కమిషన్ నివేదికను కూడా హైకోర్టు తప్పుపట్టలేదని, కాబట్టి తదుపరి చర్యలను రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా తీసుకుంటుందని వెల్లడించారు. ప్రాజెక్టు కోసం చేసిన లక్ష కోట్ల అప్పు రాష్ట్రానికి భారంగా మారిందని, ఇంతటి భారీ అవినీతికి పాల్పడిన వారు చట్టం నుండి తప్పించుకోలేరని ఆయన హెచ్చరించారు.
Read Also: రేపు తెలంగాణ కేబినెట్ భేటీ.. హైకోర్టు తీర్పుపై కేబినెట్లో చర్చ