
CBI : ఒడిశాలోని బాలేశ్వర్ వద్ద జరిగిన ఘోర రైలు ప్రమాద ఘటనపై దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని రైల్వే బోర్డు సిఫారసు చేసింది. ఈ విషయాన్ని కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ప్రకటించారు. సహాయక కార్యక్రమాలు పూర్తయ్యాయని తెలిపారు. ఘటనా స్థలిలో పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయని వివరించారు. రైల్వే ట్రాక్కు సంబంధించిన పనులు పూర్తయ్యాయని చెప్పారు. ఓవర్ హెడ్ వైరింగ్ పనులు కొనసాగుతున్నాయన్నారు.
ప్రస్తుతం ఈ కేసును ప్రభుత్వ రైల్వే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సిగ్నలింగ్లో సమస్య కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ విషయాన్ని రైల్వే బోర్డు సభ్యురాలు జయవర్మ సిన్హా వెల్లడించారు. రైల్వే సేఫ్టీ కమిషనర్ నుంచి పూర్తి స్థాయి నివేదిక రావాల్సి ఉందని చెప్పారు. ప్రమాద సమయంలో కోరమాండల్ ఎక్స్ప్రెస్ వేగం దాదాపు గంటకు 128 కి.మీలుగా ఉందని తెలిపారు.గూడ్స్ రైలులో ఇనుప ఖనిజం ఉండటం వల్లే ప్రమాద తీవ్రత పెరిగిందన్నారు.
రైలు ప్రమాదానికి కారణాలపై ఇంకా స్పష్టత రాలేదు. అయితే లోకో పైలెట్ తప్పిదం లేకపోవచ్చని రైల్వేశాఖ ఉన్నతాధికారులు తెలిపారు. ఘటన సమయంలో రెండు రైళ్లు కూడా పరిమిత వేగానికి లోబడే వెళ్తున్నాయని చెప్పారు. ఎలక్ట్రానిక్ ఇంటర్లాకింగ్ వ్యవస్థ సరిగ్గానే ఉన్నా ఎవరో ట్యాంపరింగ్కు పాల్పడ్డారనే అనుమానాలు వ్యక్తం చేశారు.శుక్రవారం రాత్రి మూడు రైళ్లు ఢీకొట్టిన ఘటనలో 275మంది మృతిచెందారు. 1100మందికి పైగా గాయపడ్డారు. బాధితులకు ఆస్పత్రుల్లో చికిత్స కొనసాగుతోంది.
మరోవైపు ఈ ఘటనపై సుప్రీంకోర్టులో ప్రజాహిత వాజ్యం దాఖలైంది. రైల్వేలో రిస్క్ అండ్ సేఫ్టీ కొలమానాలను విశ్లేషించి సూచనలు జారీ చేసేలా ఓ కమిటీని ఏర్పాటు చేయాలని పిటిషనర్ కోరారు. సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి నేతృత్వంలో నిపుణులను సభ్యులుగా ఏర్పాటు చేసేలా ప్రభుత్వానికి డైరెక్షన్స్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఆ నివేదికను సుప్రీంకోర్టు అందజేసేలా చూడాలన్నారు. సుప్రీంకోర్టు న్యాయవాది విశాల్ యివారీ పిటిషన్ దాఖలు చేశారు.