BJP Candidate Panihati: పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ఒక సంచలనాత్మక పరిణామం చోటుచేసుకుంది. దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన ఆర్.జి. కార్ మెడికల్ కాలేజ్ హత్యాచార బాధితురాలి తల్లికి భారతీయ జనతా పార్టీ (BJP) అసెంబ్లీ ఎన్నికల టికెట్ కేటాయించింది. ఆమెను పానిహటి నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలోకి దించుతున్నట్లు బీజేపీ అధికారికంగా ప్రకటించింది. ఈ నిర్ణయం బెంగాల్ రాజకీయాల్లో పెను మార్పులకు సంకేతంగా కనిపిస్తోంది.
2024 ఆగస్టులో కోల్కతాలోని ఆర్.జి. కార్ మెడికల్ కాలేజీలో విధుల్లో ఉన్న 31 ఏళ్ల జూనియర్ డాక్టర్పై జరిగిన హత్యాచార ఘటన యావత్ దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. వైద్యుల రక్షణ, మహిళా భద్రతపై పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి. నాటి నుంచి బాధితురాలి కుటుంబం న్యాయం కోసం సుదీర్ఘ పోరాటం చేస్తోంది. ఈ క్రమంలోనే బాధితురాలి తల్లి నేరుగా రాజకీయాల్లోకి రావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
నామినేషన్ దాఖలు చేసిన సందర్భంగా బాధితురాలి తల్లి పశ్చిమ బెంగాల్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ ప్రభుత్వం ప్రజల నుండి విద్య, ఆరోగ్యం, ప్రాథమిక హక్కులను లాక్కుందని ఆమె విమర్శించారు. ముఖ్యంగా రాష్ట్రంలో మహిళలకు రక్షణ కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆవేదన వ్యక్తం చేశారు. “ముఖ్యమంత్రి ఆదేశాల మేరకే నా కుమార్తె మరణానికి సంబంధించిన అన్ని కీలక ఆధారాలను ధ్వంసం చేశారు.” అని ఆమె సంచలన ఆరోపణలు చేశారు.
ఈ ఎన్నికల్లో బీజేపీకి అవకాశం ఇవ్వాలని ఆమె ప్రజలను కోరారు. కేవలం బీజేపీ అధికారంలోకి వస్తేనే తన కుమార్తె మరణానికి పూర్తిస్థాయిలో న్యాయం జరుగుతుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. తన కూతురికి జరిగిన అన్యాయం మరే బిడ్డకూ జరగకూడదన్న ఉద్దేశ్యంతోనే తాను ఈ ఎన్నికల బరిలోకి దిగుతున్నట్లు స్పష్టం చేశారు. బాధితురాలి తల్లి స్వయంగా పోటీ చేస్తుండటంతో పానిహటి నియోజకవర్గంపై ఇప్పుడు దేశవ్యాప్తంగా అందరి దృష్టి నెలకొంది.
కోల్కతాలోని ఆర్.జి. కార్ మెడికల్ కాలేజ్ హత్యాచార ఘటన భారత వైద్య చరిత్రలో ఒక చీకటి అధ్యాయంగా మిగిలిపోయింది. 2024 ఆగస్టు 9వ తేదీ తెల్లవారుజామున, ఆర్.జి. కార్ ఆసుపత్రిలోని సెమినార్ హాల్లో 31 ఏళ్ల పోస్ట్ గ్రాడ్యుయేట్ ట్రైనీ డాక్టర్ మృతదేహం లభ్యమైంది. ఆమె రాత్రంతా విధుల్లో ఉండి, కాసేపు విశ్రాంతి తీసుకోవడానికి అక్కడికి వెళ్లిన సమయంలో ఈ ఘోరం జరిగింది. నిందితుడు ఆమెపై అత్యంత క్రూరంగా అత్యాచారం చేసి, ఆపై గొంతు నులిమి హత్య చేసినట్లు పోస్ట్మార్టం నివేదికలో తేలింది. పోలీసులు ప్రాథమిక విచారణలో భాగంగా సంజయ్ రాయ్ అనే సివిక్ వాలంటీర్ను ప్రధాన నిందితుడిగా అరెస్ట్ చేశారు. అయితే, ఆసుపత్రి యాజమాన్యం ఈ ఘటనను తొలుత ‘ఆత్మహత్య’గా చిత్రీకరించే ప్రయత్నం చేయడంపై తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. కలకత్తా హైకోర్టు జోక్యంతో ఈ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించారు.