Gujarath Elections : గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు తుది అంకానికి చేరుకున్నాయి. రెండోదశలో 93 అసెంబ్లీ స్థానాల్లో పోలింగ్ జరుగుతోంది. ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 5 గంటలకు వరకు పోలింగ్ కొనసాగుతుంది.
మధ్య, ఉత్తర గుజరాత్ ప్రాంతంలోని 14 జిల్లాల్లో రెండోదశలో పోలింగ్ జరుగుతోంది. ఎన్నికల బరిలో 833 మంది అభ్యర్థులు ఉన్నారు. బీజేపీ, ఆప్ మొత్తం 93 స్థానాల్లో పోటీ పడుతున్నాయి. కాంగ్రెస్ అభ్యర్థులు 90 చోట్ల బరిలో ఉన్నారు. కాంగ్రెస్ మిత్రపక్షం ఎన్సీపీ 3 స్థానాల్లో పోటీ చేస్తోంది. రెండో దశ ఎన్నికల్లో 255 మంది స్వతంత్ర అభ్యర్థులు బరిలో ఉన్నారు. రెండో దశలో 2.51 కోట్ల మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. మొత్తం 14,975 పోలింగ్ బూత్లు ఏర్పాటు చేశారు.
డిసెంబర్ 1న 89 స్థానాల్లో జరిగిన తొలి దశ ఎన్నికల్లో 63.30% పోలింగ్ నమోదైంది. ముఖ్యంగా పట్టణ ప్రాంతాలైన సూరత్, రాజ్కోట్, జామ్నగర్లో ఓటింగ్ తక్కువగా జరిగింది. అహ్మదాబాద్, ఆనంద్, వడోదరా, గాంధీనగర్, గోద్రా నగరాల్లో రెండో దశ పోలింగ్ జరుగుతోంది. ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఓటర్లందరూ ముందుకు రావాలని కేంద్ర ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ విజ్ఞప్తి చేశారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అహ్మదాబాద్లో ఓటు వేయనున్నారు. గుజరాత్ లో మొత్తం 182 అసెంబ్లీ స్థానాలున్నాయి. డిసెంబర్ 8న గుజరాత్ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.