Byelection : గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల రెండో దశ పోలింగ్ జరుగుతున్న సమయంలోనే ఐదు రాష్ట్రాల్లోనూ ఉపఎన్నికలు జరుగుతున్నాయి. రాజస్థాన్ లో సర్దార్షాహర్ స్థానం, ఛత్తీస్గఢ్ లోని భానుప్రతాప్పూర్ నియోజకవర్గం, ఒడిశాలోని పదంపూర్ స్థానానికి ఉపఎన్నికలు జరుగుతున్నాయి. ఈ మూడు స్థానాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేల మరణంతో ఉప ఎన్నికలు జరుగుతున్నాయి.
బీహార్లో ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ పై అనర్హత వేటు పడటంతో ఎమ్మెల్యే పదవిని కోల్పోయారు. దీంతో ఆయన ప్రాతినిధ్యం వహించిన ఖుర్హని స్థానానికి ఉపఎన్నిక జరుగుతోంది. ఎన్డీయే కూటమి నుంచి సీఎం నితీశ్కుమార్ బయటకు వచ్చిన తర్వాత జరుగుతున్న.. మొదటి ఎన్నిక ఇదే కావడంతో ఈ ఫలితంపై ఆసక్తి నెలకొంది.
ఉత్తర ప్రదేశ్ లో రెండు అసెంబ్లీ స్థానాలకు, ఒక లోక్ సభ స్థానానికి ఉపఎన్నిక జరుగుతోంది. సమాజ్వాదీ చీఫ్ ములాయం సింగ్ యాదవ్ మరణంతో ఆయన ప్రాతినిధ్యం వహించిన మెయిన్పురి లోక్సభ స్థానానికి ఉపఎన్నిక జరుగుతోంది. ములాయం కంచుకోట అయినప్పటికీ.. గత ఎన్నికలో తక్కువ మెజార్టీతోనే గెలుపొందారు. దీంతో ఇప్పుడు ఎస్పీ గెలుపు అంత ఈజీ కాదనే చర్చ నడుస్తోంది.
ఎస్పీ తరపున అఖిలేష్ యాదవ్ భార్య డింపుల్ యాదవ్ పోటీలో ఉన్నారు. బీజేపీ నుంచి మాజీ ఎంపీ రఘురాజ్ సింగ్ బరిలోకి దిగారు. యూపీలోనే రాంపూర్ సదర్, ఖతౌలీ అసెంబ్లీ స్థానాలకు ఉపఎన్నికలు జరుగుతున్నాయి. డిసెంబర్ 8న గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతోపాటు ఈ ఉపఎన్నికల ఫలితాలు వెలువడతాయి.