2024లో విద్యార్థుల నిరసనల సందర్భంగా ఆమె కొనసాగించిన దమనకాండకు ప్రధాని పదవిని కోల్పోయిన షేక్ హసీనాకు బంగ్లాదేశ్ ట్రిబ్యునల్ మరణశిక్ష విధిస్తూ సంచలన తీర్పు ప్రకటించింది. అయితే, తీర్పును అమలు చేసేందుకు ఆమె ప్రస్తుతం బంగ్లాదేశ్ లో లేదు. ఏడాదికి పైగా భారత్ లో ఆశ్రయం పొందుతోంది. ఢాకా ఆమెను అప్పగించాలని పలుమార్లు డిమాండ్ చేసినా, మన దేశం వ్యూహాత్మక మౌనం పాటించింది. కానీ, ఇప్పుడు భారత్ షేక్ హసీనా విషయంలో ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మనం తీసుకునే నిర్ణయం మీద ఆమె భవితవ్యం ఆధారపడి ఉంది.
డిసెంబర్ 2024లో విద్యార్థుల చేపట్టిన నిరసనలతో ఆమె 15 ఏండ్ల పాలనకు ఫుల్ స్టాప్ పడింది. శరణు కోరుతూ న్యూఢిల్లీకి పారిపోయి వచ్చింది. హసీనాను అప్పగించాలని బంగ్లాదేశ్ భారతదేశానికి అధికారిక అభ్యర్థనను అందించింది. భారత విదేశాంగ కార్యదర్శి బంగ్లాదేశ్ను సందర్శించిన రెండు వారాల తర్వాత ఈ అభ్యర్థన వచ్చింది. ఇరు దేశాల మధ్య నెలకొన్న చిన్న చిన్న విభేదాలను తొలగించుకుని నిర్మాణాత్మక సంబంధాలను కొనసాగించాలని ఆశిస్తున్నట్లు బంగ్లాదేశ్ అభిప్రాయపడింది. ఆగస్టు 8న బాధ్యతలు స్వీకరించిన బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ అధిపతి ముహమ్మద్ యూనస్, హసీనా నేరాలను విచారించడానికి వీలుగా ఆమెను తిరిగి పంపాలని భారత్ ను కోరారు. బంగ్లాదేశ్ ప్రభుత్వం హసీనాను అప్పగించడానికి అధికారికంగా ప్రయత్నాలను కూడా ప్రారంభించింది.
జనవరి, 2013లో షేక్ హసీనా అధికారంలో ఉన్నప్పుడు భారత్, బంగ్లాదేశ్ అప్పగింత ఒప్పందంపై సంతకం చేశాయి. తీర్పు రాజకీయ ప్రేరణతో ఉంటే అప్పగింత అభ్యర్థనను తిరస్కరించవచ్చని ఒప్పందంలో స్పష్టంగా రాసుకున్నారు. హసీనా తనపై ఉన్న అన్ని ఆరోపణలను తిరస్కరించడానికి ఈ పదాన్ని ఉపయోగించుకుంటున్నారు. అదే ఒప్పందంలో నేరాల జాబితాను రాజకీయ స్వభావం కలిగిన నేరాలుగా పరిగణించరాదని కూడా ఉంది. వీటిలో హత్య, నేరపూరిత నరహత్య, హత్యకు ప్రేరేపించడం లాంటి అంశాలు ఉన్నాయి. వీటిని పరిగణలోకి తీసుకుని భారత్ హసీనాకు అండగా ఉంటుంది.
హసీనాకు న్యాయస్థానం ఉరి శిక్ష విధించిన తర్వా, కాసేపటికి బంగ్లాదేశ్ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ద్వైపాక్షిక అప్పగింత ఒప్పందం ప్రకారం న్యూఢిల్లీ హసీనాను వెంటనే అప్పగించాలని డిమాండ్ చేస్తూ బంగ్లాదేశ్ భారత్ కు లేఖ రాసింది. మాజీ ప్రధాని షేక్ హసీనాను అప్పగించాలని కోరుతూ.. యూనస్ భారత్ కు అధికారికంగా లేఖ రాస్తారని బంగ్లాదేశ్ లా వ్యవహారాల సలహాదారు ఆసిఫ్ నజ్రుల్ వెల్లడించారు. హసీనాకు వ్యతిరేకంగా ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పు తనకు సంతోషాన్ని కలిగించిందన్నారు.
హసీనాకు మరణశిక్ష విధించంపై భారత్ స్పందించింది. తమ దేశం బంగ్లాదేశ్ ప్రజల ప్రయోజనాలకు కట్టుబడి ఉందని, ఆ దేశంతో కలిసి పని చేస్తుందని తెలిపింది. “సన్నిహిత పొరుగు దేశంగా, భారత్ బంగ్లాదేశ్ ప్రజల ప్రయోజనాలకు కట్టుబడి ఉంది. ఆ దేశంలో శాంతి, ప్రజాస్వామ్యం, స్థిరత్వానికి మద్దుతు ఇస్తుంది. ఆ దేశంతో నిర్మాణాత్మకంగా వ్యవహరిస్తాము” అని విదేశాంగశాఖ ప్రకటన జారీ చేసింది.
హసీనా అప్పగింత అభ్యర్థన విషయానికొస్తే, ఈ విషయానికి సంబంధించి బంగ్లాదేశ్ నుంచి లేఖలు అందుకున్నట్లు చెప్పింది. కానీ, ఏం చేయబోతోందనే అంశానికి సంబంధించి ఎలాంటి ప్రకటన చేయలేదు. ట్రిబ్యునల్ నిర్ణయం ఇలాగే ఉంటుందని ఊహించినప్పటికీ, భారత్ ఆమెను బంగ్లాదేశ్ కు అప్పగించే అవకాశం లేదని జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీ దక్షిణాసియా అధ్యయనాల ప్రొఫెసర్ శ్రీరాధ దత్తా వెల్లడించారు. షేక్ హసీనా భవిత్యం ఇప్పుడు పూర్తిగా న్యూఢిల్లీ ప్రతిస్పందనపై ఆధారపడి ఉంటుంది.ఆమెను అప్పగించాలని బంగ్లాదేశ్ కోరినప్పటికీ, భారత్ తిరస్కరించడానికి స్పష్టమైన కారణాలున్నాయి. బంగ్లాదేశ్లో న్యాయ ప్రక్రియ ఆమోదించబడిన ప్రమాణాలకు అనుగుణంగా ఉందని సంతృప్తి చెందితే ఆమెను అప్పగించే అంశంపై ఆలోచించనుంది. మొత్తంగా ఇప్పడు హసీనా భవితవ్యం న్యూఢిల్లీ తీసుకోబోయే నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది.
Read Also: బంగ్లా కోర్టు సంచలన తీర్పు.. మాజీ ప్రధాని షేక్ హసీనాకు మరణ శిక్ష