Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్ బైపోల్ ఫలితం బీఆర్ఎస్ అగ్ర నాయకత్వానికి మింగుడుపడని సత్యంగా మారింది. ఈ ఓటమిపై ఎట్టకేలకు అధిష్టానం దిద్దుబాటు చర్యలకు పూనుకుంది. నాయకులు, కార్యకర్తల నుంచి అభిప్రాయ సేకరణ చేయనుంది గులాబీ పార్టీ. అసలు లోపాలు ఎక్కడ ఉన్నాయి? పార్టీ ఎందుకు ప్రజల విశ్వాసాన్ని కోల్పోయింది? ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతుకుతూ సమీక్షించనున్నారు. అయితే ఈసారైనా పార్టీ పటిష్టతకు చర్యలు చేపడతారా? కేడర్ కు భరోసా కల్పించి వారిలో కొత్త ఉత్సాహాన్ని నింపుతారా? లేక గతంలో మాదిరిగానే అభిప్రాయ సేకరణ జరిపి వదిలేస్తారా?
జూబ్లీహిల్స్ బైపోల్లో బీఆర్ఎస్ ఊహించని ఓటమిని చవిచూసింది. ఈ నియోజకవర్గంలో ఉప ఎన్నికకు నోటిఫికేషన్ వచ్చిన నాటి నుంచి మొదలుపెడితే పోలింగ్ వరకు గులాబీ పార్టీ అన్ని శక్తులను ఉపయోగించింది. అయినప్పటికీ సిట్టింగ్ స్థానాన్ని కోల్పోవడంతో బీఆర్ఎస్ పార్టీ అలర్ట్ అయింది. ఎక్కడ లోటుపాట్లు జరిగాయి? ఎందుకు తాము ఆశించిన విధంగా ఫలితాన్ని రాబట్టుకోలేకపోయామనే అంశాలపై సమీక్షించబోతోంది కార్ పార్టీ.. స్టార్ క్యాంపెయినర్లను అనౌన్స్ చేసి రోడ్ షోలు, కార్నర్ మీటింగ్ లు ఏర్పాటుచేసినా కూడా ప్రజలు ఎందుకు తమను విశ్వసించలేదని ఆత్మవిమర్శలో పడింది గులాబీదళం.
ఉపఎన్నికలో విజయమే లక్ష్యంగా ముందుకు సాగి సర్వశక్తలు ఒడ్డినప్పటికీ.. పార్టీలోని సీనియర్ నేతలను, కేడర్ ను రంగంలోకి దింపి సుమారు రెండునెలలు జూబ్లీహిల్స్ నియోజకవర్గంపై దృష్టి పెట్టినప్పటికీ గెలుపు ముంగిట కారు పల్టీకొట్టింది.. దీంతో పార్టీపైన ఫోకస్ పెట్టాలని కేడర్ ను క్షేత్రస్థాయిలో బలోపేతం చేయాలని గులాబీ పార్టీ అధిష్టానం భావిస్తోంది.. అందులో భాగంగానే మంగళవారం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని పార్టీ నేతలు, కార్యకర్తలతో ప్రత్యేక భేటీ అవనున్నారు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఓటమికి గల కారణాలు, లోపాలను ఈ మీటింగ్ లో సమీక్షించనున్నారు.
ప్రభుత్వ వైఫల్యాలను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లినప్పటికీ ఆశించిన స్థాయిలో ఆదరణ పొందకపోవడంపట్ల గులాబీ అగ్రనాయకత్వం కాస్త అసంతృప్తితో ఉందట. అయితే ప్రచారంలో తప్పు జరిగిందా? లేక పార్టీ నేతలు సరిగా పనిచేయలేదా? లేదంటే ముఖ్యనాయకులకు నాయకత్వ బాధ్యత అప్పగించకపోవడమా? లేక మరేదైనా కారణాలు ఉన్నాయా?అన్న అంశాలపై లోతుగా సమీక్షించనున్నారట కేటీఆర్. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన తర్వాత కూడా ఈ రకంగానే కేడర్ తో పార్టీ ద్వితీయశ్రేణి నాయకులతో తెలంగాణ భవన్ లో ఓ సమీక్షా సమావేశం ఏర్పాటుచేశారు. అప్పుడు కూడా నాయకులు, కార్యకర్తల నుంచి అభిప్రాయ సేకరణ చేసి వదిలేశారు. అయితే ఆ సమావేశంలో డైరెక్ట్ గానే కొంతమంది వారి అభిప్రాయం చెప్పగా, మరికొంతమంది రాతపూర్వకంగా చీటీలు రాసి తమ తమ అభిప్రాయాలను వ్యక్తపరిచారు. అయితే ఆ సమావేశంలో కొంతమంది నేతలు తమకు పార్టీలో సరైన ఆదరణ లభించడంలేదని, కేవలం కొంతమంది నాయకులు మాత్రమే గుర్తింపు పొందుతున్నారని వారి మనసులోని మాటను వెల్లబుచ్చారట.
జూబ్లీహిల్స్లో ఓటమి ఎదురైన నేపథ్యంలో గులాబీ పార్టీ మీద తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. కేటీఆర్ నాయకత్వం పై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జూబ్లీహిల్స్ బైపోల్ బాధ్యతలు మొత్తం కేటీఆర్ మీద పెట్టారు. కేటీఆర్ కూడా మీడియా సంస్థలకు విరివిగా ఇంటర్వ్యూలు ఇచ్చారు. సోషల్ మీడియాను బలంగా వాడుకున్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఒకానొక సందర్భంలో తానే అభ్యర్థి నేమో అన్నట్టుగా ఓటర్లకు అనిపించేలా చేశారు. ఇన్ని చేసినప్పటికీ.. పోల్ మేనేజ్మెంట్ లో సరికొత్త విధంగా దూకుడు కొనసాగించినప్పటికీ గులాబీ పార్టీ విజయం సాధించలేకపోయింది. 2023 అసెంబ్లీ ఎన్నికల నుంచి మొదలుపెడితే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల వరకు గులాబీ పార్టీ వరుసగా కూటములు ఎదుర్కొంటూనే ఉంది. ఒకవేళ కేసీఆర్ గనక ప్రచారానికి వచ్చి ఉంటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఫలితం మరో విధంగా ఉండేదని గులాబీ పార్టీ కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో గులాబీ దళపతి రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది. అందువల్లే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఇబ్బంది ఎదురు కాకముందే.. పార్టీ పూర్తిగా మునగక ముందే.. సమూలంగా ప్రక్షాళన చేయాలని కేసిఆర్ నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఇప్పటివరకు అడ్ హక్ కమిటీలతో పార్టీని నడిపించిన కేసీఆర్.. రాష్ట్ర స్థాయి వరకు కొత్త నాయకత్వాన్ని నియమిస్తారని తెలుస్తోంది. ఇప్పటికే క్షేత్రస్థాయిలో పార్టీకి ఆదరణ అంతంతమాత్రంగానే ఉంది. అలాంటప్పుడు పరిస్థితి ఇలానే కొనసాగితే పార్టీ మనుగడ కష్టం అవుతుంది అని భావించిన కెసిఆర్.. ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
బీఆర్ఎస్ పార్టీకి కమిటీలు లేకపోవడం, గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు ప్రత్యేక కమిటీలు ఏర్పాటుచేయకపోవడం అలాగే పార్టీకి అనుబంధ సంస్థలు లేకపోవడం BRSకి ఒక మైనస్. ఎన్నో ఏళ్లుగా పార్టీని నమ్ముకుని పనిచేస్తున్నవారికి గుర్తింపు లేదని, కమిటీల్లో అవకాశం వస్తుందని ఎదురుచూసినవాళ్లు నిరాశకు గురై ఉన్నారని పార్టీలో అంతర్గతంగా చర్చలు జరుగుతున్నాయి. ఈ సమీక్ష తర్వాతైన తమ తప్పులను తెలుసుకుని పార్టీ ప్రక్షాళనకు పాటుపడితేనే వచ్చే ఎన్నికల్లో గులాబీ పార్టీ గెలుపు దిశగా ముందుకు వెళ్తుందని లేకుంటే మరింత అధ్వాన్నంగా తయారవుతుందని అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి.
Story by Venkatesh, Big Tv