Kozhikode: నేటి పోటీ ప్రపంచంలో కస్టమర్లను ఆకర్షించడానికి వ్యాపారస్తులు రకరకాల వినూత్న ప్రకటనలు ఇస్తుంటారు. కేరళలోని కోజికోడ్ నగరానికి చెందిన ఒక పాదరక్షల దుకాణం యజమాని కూడా అలాగే ఆలోచించాడు. తన కొత్త బ్రాంచ్ను ప్రమోట్ చేసుకోవడంలో భాగంగా, కేవలం ఒక్క రూపాయికే ప్రీమియం క్వాలిటీ షూస్ ఇస్తానని ప్రకటించాడు. కేవలం మొదటి 100 మందికి మాత్రమే ఈ అవకాశం ఉంటుందని నిబంధన పెట్టడంతో, ఆ ప్రకటన కాస్తా సోషల్ మీడియాలో వైరల్గా వ్యాపించింది.
తెల్లవారుజాము నుంచే బారులు..
రూపాయి నోటు చూపిస్తే చాలు వేల రూపాయల విలువ చేసే బూట్లు దక్కుతాయన్న ఆశతో జనం ఎగబడ్డారు. ఆదివారం సెలవు రోజు కావడంతో, దుకాణం తెరుచుకోకముందే అంటే తెల్లవారుజామున 2 గంటల నుంచే ప్రజలు భారీగా క్యూ కట్టారు. గంటలు గడిచేకొద్దీ ఆ రద్దీ వందల నుంచి వేలకు చేరుకుంది. కోజికోడ్ ప్రధాన రహదారి అంతా జనంతో కిక్కిరిసిపోవడంతో ఆ ప్రాంతంలో సాధారణ జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది.
నియంత్రణ తప్పిన పరిస్థితి.
దుకాణం తెరిచే సమయం ఆసన్నమయ్యేసరికి పరిస్థితి అదుపు తప్పింది. ఒకరిని ఒకరు తోసుకోవడం, క్యూ లైన్లను తోసుకుని లోపలికి వెళ్లడానికి ప్రయత్నించడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలగడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని జనాన్ని నియంత్రించే ప్రయత్నం చేసినా, ఎవరూ వెనక్కి తగ్గలేదు. చివరకు గందరగోళాన్ని అదుపు చేయడానికి పోలీసులు లాఠీచార్జ్ చేయాల్సి వచ్చింది.
దుకాణ యజమానిపై చర్యలు..
ముందస్తు అనుమతి లేకుండా భారీ బహిరంగ ప్రకటన ఇవ్వడం, ట్రాఫిక్కు అంతరాయం కలిగించడం, శాంతి భద్రతలకు విఘాతం కలిగించినందుకు పోలీసులు సీరియస్ అయ్యారు. వేల సంఖ్యలో ప్రజలు వస్తారని ఊహించకుండా, ఎటువంటి భద్రతా ఏర్పాట్లు చేయని కారణంగా దుకాణ యజమానిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ ప్రాంతంలో పరిస్థితి సద్దుమణిగే వరకు దుకాణాన్ని మూసివేయాలని ఆదేశించారు.
Also Read: ఆ అదృష్టవంతుడు ఎక్కడ?.. 30 లక్షల లాటరీ విజేత కోసం నిర్వాహకుల తిప్పలు!
అతి ఆశ.. అనర్థం..
ఉచితంగా వస్తువులొస్తున్నాయంటే మనవాళ్లు అసలే వదలరు. కానీ ఈ ఘటనలో రూపాయి బూట్ల కోసం వచ్చిన వారు లాఠీ దెబ్బలను రుచి చూడాల్సి వచ్చింది. కంపెనీలు తమ వ్యాపారాల కోసం ఇచ్చే ఇలాంటి భారీ ఆఫర్ల వెనుక ఉండే ఇబ్బందులను ప్రజలు గమనించాలని పోలీసులు సూచిస్తున్నారు. అతి తక్కువ ధరకే వస్తువులొస్తున్నాయన్న ఆశ ఒక్కోసారి ఇలాంటి ప్రమాదకర పరిస్థితులకు దారితీస్తుందని ఈ కోజికోడ్ ఘటన మరోసారి నిరూపించింది.
Chaos broke out outside Trend Factory near Mananchira Square Kozhikode in #Kerala after the store announced free shoes for the first 100 people bringing an old Rs 1 note as part of its launch offer. Huge crowds gathered from as early as 2 AM, triggering scuffles and severe… pic.twitter.com/9pNVVRD5pE
— Ashish (@KP_Aashish) March 8, 2026