కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సోనియా గాంధీ అస్వస్థతకు గురైనట్లు సమాచారం. ఊపిరి తీసుకోడానికి ఇబ్బంది పడుతోన్న ఆమెను హుటాహుటిన సర్ గంగారామ్ హాస్పిటల్లో చేర్చారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యానికి ఎలాంటి సమస్య లేదని, వైద్యుల పర్యవేక్షణంలో ఆమె కోలుకుంటున్నారని తెలిసింది. ఈ విషయాన్ని అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది.
అయితే ఢిల్లీలో విపరీతంగా పెరిగిపోయిన వాయు కాలుష్యం వల్లే సోనియా అస్వస్థతకు గురై ఉండవచ్చని తెలుస్తోంది. గత కొద్ది నెలలుగా ఢిల్లీ ప్రజలు గాలి కాలుష్యంతో అనారోగ్యానికి గురవ్వుతున్నారు. ఢిల్లీ ప్రభుత్వం చర్యలు చేపట్టినప్పటికీ.. ఎలాంటి సానుకూల ఫలితం కనిపించడం లేదు. ప్రజలు ఊపిరి పీల్చుకోవాలంటేనే భయపడే పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా పిల్లల పరిస్థితి దయనీయంగా ఉంది. ఈ నేపథ్యంలో పలు స్కూళ్లు సెలవులు కూడా ప్రకటించాయి.
సోనియా గాంధీకి అస్వస్థత సమాచారంపై ఆస్పత్రి వర్గాలు స్పందిస్తూ… ఇది రొటీన్ చెకప్ అని.. దగ్గు తీవ్రం కావడంతో సోనియాను ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నామని తెలిపారు. ఆమె ఆరోగ్యంపై ఎలాంటి ఆందోళన వద్దని పేర్కొన్నారు. ఛాతి సంబంధిత వైద్య నిపుణులు పర్యవేక్షణలో సోనియా చికిత్స పొందుతున్నట్లు వెల్లడించారు.