Sonia Gandhi: కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ అస్వస్థతకు గురయ్యారు. మంగళవారం సాయంత్రం ఆమెని ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆసుపత్రిలో చేరారు. ఆమెతోపాటు కుమారుడు రాహుల్, ప్రియాంక గాంధీ ఆసుపత్రిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఢిల్లీలో వాతావరణ మార్పుల వల్ల ఆమె శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందులు ఏర్పడినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ఆసుపత్రిలో సోనియాగాంధీ.. వైద్యుల ట్రీట్మెంట్
ఢిల్లీలో శీతాకాలం, వాయు కాలుష్యం రెండింటి ప్రభావం వల్ల ఆమె ఆస్తమాతో ఇబ్బంది పడుతున్నట్లు వైద్యులు నిర్ధారించారు. ఆమె ఛాతికి సంబంధించిన కొన్ని సమస్యలు తలెత్తినట్లు తెలుస్తోంది. పరిస్థితిని గమనించిన కుటుంబసభ్యులు వెంటనే అధినేత్రిని ఆసుపత్రికి తరలించినట్లు తెలుస్తోంది.
వైద్యుల పర్యవేక్షణలో సోనియాగాంధీకి చికిత్స కొనసాగిస్తున్నారు. శ్వాసకోశ సంబంధిత సమస్యలను దృష్టిలో పెట్టుకుని అవసరమైన పరీక్షలు నిర్వహిస్తున్నట్లు హాస్పటల్ వర్గాలు చెబుతున్నాయి. ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నాయి. కొన్నిరోజులు పరిశీలనలో ఉంచాలని వైద్యులు అన్నట్లు తెలుస్తోంది. ఆమె ఆరోగానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.
వాతావరణలో మార్పుల వల్ల.. అధినేత్రి కోలుకోవాలంటూ కార్యకర్తల పూజలు
అధినేత్రి అనారోగ్యం విషయం తెలియగానే పార్టీ నేతలు, కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆమె త్వరగా కోలుకోవాలని నేతలు, కార్యకర్తలు ఆకాంక్షిస్తున్నారు. గతేడాది కూడా వివిధ సమస్యల వల్ల సోనియాగాంధీ ఆసుపత్రిలో మూడుసార్లు చేరారు. 2025 జూన్లో కడుపు సంబంధిత సమస్య కారణంగా సర్ గంగారామ్ ఆసుపత్రిలో చేరారు .
అదే నెల ప్రారంభంలో స్వల్ప ఆరోగ్య సమస్యల కారణంగా పరీక్షల నిమిత్తం సిమ్లాలోని ఓ ఆసుపత్రిలో చేరారు. రీసెంట్గా సోనియాగాంధీ డిసెంబర్లో 79వ ఏటలోకి అడుగుపెట్టారు.ప్రస్తుతం ఆమె రాజస్థాన్ నుండి రాజ్యసభ సభ్యురాలిగా ఉన్నారు. రాజ్యసభలో తన పదవీ కాలానికి ముందు ఐదు పర్యాయాలు లోక్సభ ఎంపీగా ఆమె పని చేశారు. కాంగ్రెస్ పార్టీకి రెండు పర్యాయాలు అధ్యక్షురాలుగా పని చేశారు.
ALSO READ: దావూద్ బతికే ఉన్నాడా? అతడికి నిజంగానే స్లో పాయిజన్ ఇచ్చారా?