Sonia Gandhi: ఇరాన్లో పెరుగుతున్న ఉద్రిక్తతలు , మారుతున్న అంతర్జాతీయ పరిస్థితుల నేపథ్యంలో భారతదేశం అనుసరిస్తున్న వైఖరిని సోనియా గాంధీ ప్రశ్నించారు. 2001లో అటల్ బిహారీ వాజ్పేయి టెహ్రాన్ పర్యటన ద్వారా ఇరాన్తో ఉన్న చారిత్రక , నాగరిక సంబంధాలను బలపరిచారని గుర్తు చేస్తూ.. ప్రస్తుత ప్రభుత్వం ఆ వారసత్వాన్ని విస్మరించడం సరికాదని ఆమె పేర్కొన్నారు. ఇజ్రాయెల్తో రక్షణ, సాంకేతిక రంగాలలో సంబంధాలు పెరిగినప్పటికీ అటు టెహ్రాన్ , ఇటు టెల్ అవీవ్ రెండింటితో సమతుల్యత పాటించాల్సిన అవసరం ఉందని ఆమె అభిప్రాయపడ్డారు.
భారతదేశ విదేశాంగ విధానం కేవలం నైతికతపై మాత్రమే కాకుండా, వ్యూహాత్మక అవసరాలపై ఆధారపడి ఉండాలి. గల్ఫ్ దేశాలలో దాదాపు 10 మిలియన్ల మంది భారతీయులు నివసిస్తున్నారని, గతంలో గల్ఫ్ యుద్ధం లేదా యెమెన్ సంక్షోభం సమయంలో వారిని రక్షించగలిగామంటే దానికి కారణం భారతదేశంపై ఉన్న అంతర్జాతీయ నమ్మకమేనని ఆమె గుర్తు చేశారు. ప్రస్తుత కాలంలో శక్తివంతమైన దేశాల ఏకపక్ష సైనిక చర్యలపై భారత్ మౌనం వహించడం, మన సంప్రదాయ ‘అలీన విధానం’ నుండి వెనక్కి తగ్గడమేనని ఆమె విమర్శించారు.
గ్లోబల్ సౌత్కు నాయకత్వం వహించాలని ఆకాంక్షించే దేశంగా, అంతర్జాతీయ నియమాలను ఉల్లంఘిస్తున్నప్పుడు భారత్ మౌనంగా ఉంటే దాని విశ్వసనీయత దెబ్బతింటుందని ఆమె హెచ్చరించారు. విదేశీ నేతలను లక్ష్యంగా చేసుకుని హత్యలు చేయడం , పశ్చిమాసియాలో అస్థిరత వంటి అంశాలు మన జాతీయ ప్రయోజనాలను నేరుగా ప్రభావితం చేస్తాయి. కావున, పార్లమెంటు సమావేశమైనప్పుడు ఈ అంతర్జాతీయ పరిణామాలపై లోతైన చర్చ జరగాలని, ప్రభుత్వం తన వ్యూహాత్మక స్పష్టతను , ప్రజాస్వామ్య జవాబుదారీతనాన్ని చాటుకోవాలని సోనియా గాంధీ గారు డిమాండ్ చేశారు.
Also Read: సొంత పార్టీలోనే ఏకాకిని చేశారా? కవిత ఆవేదన వెనుక అసలు రాజకీయం ఇదే!