E-Paper
Advertisement

Stubble Burning : పంట వ్యర్థాల దగ్ధం.. చిచ్చు రేపిన కాలుష్యం

Stubble Burning  : పంట వ్యర్థాల దగ్ధం.. చిచ్చు రేపిన కాలుష్యం
Advertisement

Stubble Burning : వదల బొమ్మాళీ అన్నట్టు ఢిల్లీ-ఎన్‌సీఆర్ రీజియన్‌ను కాలుష్యమేఘాలు వీడటం లేదు. మంగళవారం కూడా ‘సివియర్’ కేటగిరీలో కొనసాగుతోంది. పొరుగునే ఉన్న హరియాణా, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లోనూ గాలి నాణ్యత క్షీణించింది. ఘజియాబాద్‌లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్(ఏక్యూఐ) 338 ఉండగా, గురుగ్రామ్ 364, నోయిడా 348, గ్రేటర్ నోయిడా 439, ఫరీదాబాద్ 382గా నమోదైంది.

వాయు కాలుష్యం ఇప్పుడు రాష్ట్రాల మధ్య చిచ్చు రేపింది. పంట వ్యర్థాలను కాల్చడం వల్ల కాలుష్యాన్ని పెంచేస్తున్నారంటూ హరియాణా, యూపీలపై ఢిల్లీ విరుచుకుపడింది. పంజాబ్ వల్ల తమకు అంతగా కాలుష్యం బెడద లేకున్నా.. హరియాణా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో వరి దుబ్బును తగలబెట్టడం వల్ల ముప్పు అధికంగా ఉందని ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వం ఇప్పటికే దుమ్మెత్తి పోసింది. కేంద్రం లెక్కల మేరకు కోతల అనంతరం వరిగడ్డిని తగులబెడుతున్న సంఘటనలు పంజాబ్ లో బాగా తగ్గాయని తెలిపింది.

Advertisement

బీజేపీ పాలిత రాష్ట్రాలైన యూపీ, హరియాణాల్లో పంట వ్యర్థాల దహనం విచ్చలవిడిగా కొనసాగుతోందని, అయితే ఆ రాష్ట్రాలు ఆ వివరాలు ఏవీ వెల్లడించడం లేదని పంజాబ్ ఆప్ ప్రభుత్వం ఆరోపించింది. తాము మాత్రం కేంద్రానికి ఎప్పటికప్పుడు గణాంకాలను అందిస్తున్నామని తెలిపింది. వరి సాగు దాదాపు పూర్తి కావొచ్చిన నేపథ్యంలో వ్యర్థాలను తగులబెట్టడం ముమ్మరమైంది.

పంజాబ్‌లో 5వ తేదీన ఒక్కరోజే 3,230 చోట్ల వరిగడ్డిని తగులబెట్టారు. అంతకు ముందు రోజు ఇలాంటి ఘటనలు 1,360 మాత్రమే నమోదయ్యాయి. నిరుడు నవంబర్ 5వ తేదీతో పోలిస్తే ఈ ఏడాది ఆ ఘటనలు మరిన్ని పెరిగాయి. గత ఏడాది ఇదే సమయానికి 2,817 చోట్ల పంట వ్యర్థాలను కాల్చేసినట్టు రికార్డులు చెబుతున్నాయి.

Advertisement

పంజాబ్ రైతులు 7.5 మిలియన్ల ఎకరాల్లో వరి సాగు చేస్తున్నారు. ఫలితంగా ఏటా 22 మిలియన్ టన్నుల మేర పంట వ్యర్థాలు మిగులుతాయి. ఇందులో 60 శాతాన్ని ఎరువుగా అక్కడికక్కడే వినియోగించుకున్నా.. 10 మిలియన్ టన్నుల వరిగడ్డిని ఏటా దగ్ధం చేస్తారని అంచనా. ఇది పర్యావరణానికి తీవ్రంగా చేటు కలగజేస్తోంది.

ఇలా వరిగడ్డిని పొలంలోనే తగులబెట్టే చర్యలను నిలువరించేందుకు పంజాబ్ పలు చర్యలు చేపట్టింది. రైతులను చైతన్యం చేయడంతో పాటు సరికొత్త సాంకేతికతను అందుబాటులోకి తీసుకొచ్చింది. క్రాప్ రెసిడ్యూ మేనేజ్‌మెంట్(CRM) మెషిన్లను ప్రవేశపెట్టింది. అయినా రైతులు తమ భూముల్లో ఎక్కడికక్కడే ఆ వ్యర్థాలను తగులబెట్టడం మాత్రం ఆగలేదు.

1.37 లక్షల యంత్రాలను అందుబాటులోకి తెచ్చామని పంజాబ్ ప్రభుత్వం చెబుతోంది. అయితే ఆ టెక్నాలజీని అనుసరించడంలో రైతులకు ఇబ్బందులు ఎదురవుతున్నట్టు తెలుస్తోంది. దీంతో CRM యంత్రాల సామర్థ్యంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. యంత్రాల వల్ల పూర్తి ఫలితం కనిపించడం లేదని, పొలం గట్ల మూలల్లో వ్యర్థాలను ఆ మెషిన్ తొలగించలేకపోతోందని రైతులు చెబుతున్నారు. దాంతో విధిలేని పరిస్థితుల్లోనే పంట వ్యర్థాలను కాల్చేస్తున్నామని తెలిపారు.

లక్షకు పైగా యంత్రాలు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయని ప్రభుత్వం చెబుతున్నా.. డిమాండ్ అంతకన్నా ఎక్కువగానే ఉంది. ఈ కారణంగానే CRM మెషిన్ టెక్నాలజీ రైతులందరికీ అందుబాటులోకి రాలేదు. అధిక డీజిల్ వినియోగంతో పాటు అధిక సమయం తీసుకుంటున్న కారణంగా CRM మెషిన్లపై రైతులు ఆసక్తి చూపడం లేదని, దాదాపు 90% మెషిన్లు నిరుపయోగంగా ఉన్నాయని తెలుస్తోంది.

పంట వ్యర్థాల దహనంతో పెరుగుతున్న వాయు కాలుష్యానికి చెక్ చెప్పడానికి CRM మెషిన్లను అందజేస్తే సరిపోదు. బయోడీకంపోజర్ వంటి ప్రత్యామ్నాయాలపై ప్రజలను చైతన్యవంతం చేయాలి. బయో డీకంపోజర్లు చౌక. అంతే కాదు.. చక్కటి సేంద్రియ ఎరువు లభిస్తుంది. దిగుబడులూ పెరుగుతాయి.

Related News

ప్రియుడిని చంపి, మృతదేహాన్ని కట్ చేసి సంచిలో పెట్టి, ఇంటి యజమానికి వాయిస్ ద్వారా

ఉక్రెయిన్‌లో ఘోరం.. కార్గో నౌకపై దాడి.. నలుగురు భారతీయుల మృతి

మహారాష్ట్రలో ఘోర ప్రమాదం.. ఇథనాల్ కంటైనర్, కారు ఢీ.. ఆరుగురు సజీవదహనం!

ఎంపీలను కలవనిస్తేనే దీక్ష విరమణ.. లేఖ విడుదల చేసిన సోనమ్ వాంగ్‌చుక్!

సీజేపీ ర్యాలీతో రంగంలోకి దిగిన కేంద్రం.. కేంద్ర మంత్రి నడ్డా ముందు 3 కీలక డిమాండ్లు!

పార్లమెంట్‌లో తొలిరోజే హైడ్రామా.. నీట్ రచ్చ.. సభలు వాయిదా వేసినా తగ్గని విపక్షాలు!

పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో గన్‌తో కాల్చుకుని.. డీజీపీ అనురాగ్‌ ఆత్మహత్య, అసలు ఏం జరిగింది?

రేషన్‌కార్డు దారులకు తీపి కబురు.. ఒకేసారి మూడునెలల కోటా, ఇంకెందుకు ఆలస్యం

Big Stories

Advertisement
×