Passive Euthanasia: కారుణ్య మరణం విషయంలో సుప్రీం కోర్టు సంచలన తీర్పును వెలువరించింది. గత 13 ఏళ్లుగా కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న 30 ఏళ్ల హరీష్ రాణా మరణానికి సుప్రీంకోర్టు ధర్మాసనం అనుమతి మంజూరు చేసింది. రాణా కుటుంబ సభ్యులు దాఖలు చేసిన పిటిషన్ను విచారించిన న్యాయస్థానం వారి అభ్యర్థనను పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయాన్ని వెల్లడించింది.
హరీష్ రాణా జీవితం 2013లో జరిగిన ఒక ప్రమాదంతో తలకిందులైంది. ఒక భవనం నాలుగో అంతస్తు బాల్కనీ నుంచి ఆయన ప్రమాదవశాత్తు కింద పడిపోయారు. ఈ ప్రమాదంలో ఆయన మెదడుకు తీవ్ర గాయాలవ్వడంతో అప్పటి నుండి అచేతన స్థితిలోకి వెళ్లిపోయారు. 13 ఏళ్లుగా కనీసం కదలలేని మాట్లాడలేని స్థితిలో కేవలం వైద్య పరికరాల సాయంతోనే ప్రాణాలను నిలుపుకుంటూ వచ్చారు. రాణా పరిస్థితిని చూసి తట్టుకోలేని కుటుంబ సభ్యులు ఆయనకు కారుణ్య మరణం ప్రసాదించాలని కోరుతూ న్యాయపోరాటం మొదలుపెట్టారు.
వైద్య నివేదికల ప్రకారం రాణా తిరిగి కోలుకునే అవకాశాలు ఏమాత్రం లేవని స్పష్టమైంది. అచేతన స్థితిలో ఉన్న వ్యక్తిని కేవలం యంత్రాల మీద బతికించడం వల్ల అటు రోగికి ఇటు కుటుంబానికి తీరని వేదన మిగులుతుందని ధర్మాసనం అభిప్రాయపడింది. గౌరవప్రదంగా మరణించే హక్కు కూడా జీవించే హక్కులో భాగమేనని సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పులను ఈ సందర్భంగా ఉదహరించారు. కుటుంబ సభ్యుల మానసిక ఆర్థిక ఇబ్బందులను గమనించిన కోర్టు రాణాకు విముక్తి కల్పించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఈ తీర్పు దేశవ్యాప్తంగా కారుణ్య మరణాల మీద జరుగుతున్న చర్చను మరోసారి తెరపైకి తెచ్చింది. వైద్య పరిజ్ఞానం ఎంత పెరిగినా కోలుకోలేని స్థితిలో ఉన్న బాధితులకు ఇలాంటి నిర్ణయాలు ఊరటనిస్తాయని న్యాయ నిపుణులు పేర్కొంటున్నారు. సుప్రీంకోర్టు అనుమతితో ఇప్పుడు రాణాకు వైద్య పరంగా ప్రాణవాయువును లేదా ఆహారాన్ని నిలిపివేసి ప్రశాంతమైన మరణం పొందేలా ఏర్పాట్లు చేయనున్నారు. 13 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు ఈ తీర్పుతో ముగింపు పలకడంపై పలువురు సామాజిక కార్యకర్తలు స్పందిస్తున్నారు.
భారత చట్టాల ప్రకారం హరీష్ రాణా కేసులో అమలు చేస్తున్నది పాసివ్ యూథనేషియా (Passive Euthanasia). అంటే తీవ్రమైన అనారోగ్యం లేదా కోమాలో ఉన్న రోగి కోలుకునే అవకాశం లేకపోతే అతని జీవితాన్ని కృత్రిమంగా కొనసాగించడానికి ఉపయోగిస్తున్న వెంటిలేటర్ వంటి లైఫ్ సపోర్ట్ చికిత్సలను నిలిపివేస్తారు. ఇది డాక్టర్లు రోగిని చంపడం కాదు. కేవలం జీవితాన్ని కృత్రిమంగా కొనసాగించే యంత్రాలు చికిత్సలను ఆపి రోగిని సహజంగా మరణించనివ్వడమే దీని ఉద్దేశం. సుప్రీంకోర్టు 2018లో ఇచ్చిన చారిత్రాత్మక తీర్పు ప్రకారం రోగి కోలుకునే అవకాశం లేనప్పుడు కుటుంబ సభ్యుల అనుమతితో వైద్యుల కమిటీ పరిశీలన తర్వాతే దీనిని అనుమతిస్తారు. ఇంజెక్షన్ ద్వారా మరణం కలిగించే ఆక్టివ్ యూథనేషియా భారత్లో నిషిద్ధం కాగా పాసివ్ యూథనేషియాకు మాత్రం కొన్ని కఠిన షరతులతో కూడిన అనుమతులు లభిస్తాయి.
Read Also: Crime News: ఈ భారతీయుడ్ని పట్టుకుంటే 9 కోట్లు మీకే.. ఎఫ్బీఐ ప్రకటన, ఇంతకీ ఏం చేశాడు?