Supreme Court: దేశ సర్వోన్నత న్యాయస్థానం మంగళవారం సంచలన తీర్పు వెలువరించింది. హిందూ, సిక్కు, బౌద్ద మతాలు మినహా ఏ ఇతర మతంలోకి మారినా.. ఆ వ్యక్తి షెడ్యూల్ కులానికి చెందిన వాడిగా కొనసాగలేరని స్పష్టం చేసింది. వారికి షెడ్యూల్ కులాలు (SC), షెడ్యూల్ తెగల (ST) రక్షణకు తీసుకొచ్చిన అట్రాసిటీ చట్టం వర్తించదని తేల్చి చెప్పింది. ఈ మేరకు ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును.. సుప్రీంకోర్టు సమర్థించింది.
ఆంధ్రప్రదేశ్కు చెందిన చింతాడ ఆనంద్ అనే పాస్టర్ తనపై కొందరు దాడి చేశారని, కులం పేరుతో దూషించారని ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు పెట్టారు. అయితే ఆయన అప్పటికే క్రైస్తవ మతంలోకి మారి.. పాస్టర్గా కొనసాగుతున్నందున ఆయనకు ఎస్సీ హోదా వర్తించదని నిందితులు 2025లో హైకోర్టును ఆశ్రయించారు. దీంతో పిటిషనర్ల వాదనలతో ఏపీ హైకోర్టు ఏకీభవించింది. క్రైస్తవ మతంలో చేరిన వారికి అట్రాసిటీ కేసు పెట్టే అర్హత ఉండదని చెబుతూ.. పాస్టర్ పెట్టిన కేసును కొట్టివేసింది.
అయితే ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ.. పాస్టర్ చింతాడ ఆనంద్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై మంగళవారం విచారణ చేపట్టిన జస్టిస్ ప్రశాంత్ మిశ్రా, ఎన్.వి. అంజారియాలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం.. ఏపీ హైకోర్టు తీర్పును సమర్థించింది. ఒక వ్యక్తి క్రైస్తవ లేదా ఇస్లాం వంటి ఇతర మతాల్లోకి మారిన వెంటనే వారి ఎస్సీ హోదా ‘తక్షణమే లేదా పూర్తిగా రద్దు’ అవుతుందని స్పష్టం చేసింది. ఒక వ్యక్తి ఒకే సమయంలో క్రైస్తవ మతాన్ని పాటిస్తూ మరోవైపు ఎస్సీ హోదాను క్లెయిమ్ చేయడం కుదరదని తేల్చి చెప్పింది. ఒకవేళ ఆ వ్యక్తి వద్ద కుల ధ్రువీకరణ పత్రం ఉన్నప్పటికీ.. మతం మారినట్లు ఆధారాలు ఉంటే అది చెల్లుబాటు కాదని పేర్కొంది. ఒకవేళ సదరు వ్యక్తి తిరిగి తన మాతృధర్మం (హిందూ మతం)లోకి వచ్చి సమాజం అతడిని అంగీకరిస్తే అప్పుడు హోదా పునరుద్ధరణపై ఆలోచించవచ్చని ధర్మాసనం అభిప్రాయపడింది.
Also Read: LPG Weight: సిలిండర్ బరువు 14.2 కేజీలే ఎందుకు? ఎప్పుడైనా ఆలోచించారా? మ్యాటర్ తెలిస్తే అవాక్కవుతారు!
అంతకుముందు హైకోర్టు తన తీర్పులో కీలక విషయాలను ప్రస్తావించింది. రాజ్యాంగంలోని (Scheduled Castes)ఆర్డర్, 1950 ప్రకారం.. కేవలం హిందూ, సిక్కు, బౌద్ధ మతాలకు చెందిన వారు మాత్రమే ఎస్సీలుగా పరిగణించబడతారని హైకోర్టు తేల్చి చెప్పింది. ఎస్సీ హోదా లేని వ్యక్తి.. ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద ఇతరులపై కేసులు పెట్టడానికి ఏమాత్రం అర్హుడు కాదని స్పష్టం చేసింది. క్రైస్తవ మతంలో కుల వివక్షకు తావులేదని కాబట్టి ఆ మతంలోకి మారిన వారికి ఈ చట్టం వర్తించదని పేర్కొంది. ఇతర మతాల్లోకి మారిన వ్యక్తి పట్ల ఎస్సీ కుల ధృవీకరణ పత్రం ఉన్నప్పటికీ అతను వేరే మతాన్ని పాటిస్తున్నట్లు తేలితే.. దానిని ఏమాత్రం పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని ఏపీ హైకోర్టు కూడా గతంలో చెప్పుకొచ్చింది.
Also Read: Dishwasher Tips: డిష్ వాషర్ ఖర్చు వేధిస్తోందా? టెన్షన్ వద్దు మామ.. ఈ పంచసూత్రాలు ఫాలో అయిపోండి!