⦿ అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమానికి వీడ్కోలు
⦿ 45 రోజులు వేడుకలు… 66 కోట్ల పుణ్యస్నానాలు
⦿ భక్తజనంతో కిక్కిరిసిన ప్రయాగ్రాజ్ పరిసరాలు
⦿ చివరి రోజే 1.5 కోట్ల పుణ్యస్నానాలు
⦿ కట్టుదిట్టమైన భద్రతతో సమర్థవంతంగా నిర్వహణ
⦿ ముగింపు వేడుకలో ఆకట్టుకున్న ప్రత్యేక ఎయిర్ షో
భారత ఆధ్యాత్మిక ప్రగతికి నిదర్శనమైన కుంభమేళకు దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి కోట్ల మంది భక్తులు పోటెత్తారు. ప్రయాగ్రాజ్లోని గంగా, యమునా, సరస్వతి నదుల పవిత్ర త్రివేణి సంగమంలో 45 రోజుల పాటు సాగిన వేడుకలు.. ఆద్యంతం ఆధ్యాత్మికత, భక్తిపారవశ్యంతో నిండిపోయాయి. కనీవిని ఎరుగని రీతిలో నిర్వహించిన ‘మహా కుంభమేళా’ బుధవారంతో పరిసమాప్తం అయ్యింది. 144 ఏళ్లకోసారి వచ్చే ఈ విశిష్ఠ కుంభమేళా జనవరి 13న ఆరంభమైంది. ప్రపంచంలోనే అతిపెద్ద జన జాతరగా భావిస్తున్న ఈ మహా స్నానఘట్టం మహా శివరాత్రితో (ఫిబ్రవరి 26) ముగిసిపోయింది. చివరి రోజున అమృత స్నానం ఆచరించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో పోటెత్తారు. ఉదయం 5.30 గంటల నుంచే స్నాన ఘాట్టాలు భక్తులతో కిక్కిరిసిపోయారు. చివరి రోజున సుమారు 1.5 కోట్లకు పైగా భక్తులు అమృతస్నానం ఆచరించారని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తెలిపింది. దీంతో, మహా కుంభమేళా స్నానాలు ఆచరించిన మొత్తం భక్తుల సంఖ్య 66 కోట్లు దాటినట్లు ప్రభుత్వం ప్రకటించింది.
భక్తుల సంఖ్యలో అనుకున్న స్థాయికి మించి పెరుగుదల నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. చైనా, భారత్ మినహా ఇతర అన్ని దేశాల జనాభా కంటే ఎక్కువ సంఖ్యలో భక్తులు స్నానమాచరించారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు చెందిన భక్తులతో పాటు ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలకు చెందిన వారు కూడా ఈ మహా క్రతువులో పాల్గొన్నారు. ముగింపు సందర్భంగా ఇండియన్ ఎయిర్ఫోర్స్ ‘ఎయిర్షో’ నిర్వహించింది. మహా కుంభమేళా క్షేత్ర గగనతలంలో ఈ ప్రత్యేక ఎయిర్షో ఆకట్టుకుంది. చివరి రోజున ఎలాంటి అవాంఛనీయమైన ఘటనలు చోటుచేసుకోకుండా అధికారులు అత్యంత కట్టుదిట్టమైన భద్రతా చర్యలు ఏర్పాటు చేశారు. అదనపు బలగాలను మోహరించారు. ఈ వేడుకల్లో ఆకట్టుకున్న అంశాలివే..
మోదీ నుంచి అంబానీ వరకు..
మహా కుంభమేళా-2025లో పేద వర్గాల నుంచి రాజకీయ, సినీ, వ్యాపార, ఇతర రంగాలకు చెందిన ఎంతోమంది ప్రముఖులు పాల్గొన్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కట్టుదిట్టమైన భద్రత నడుమ మహా కుంభమేళా స్నానం ఆచరించారు. క్షణం తీరిక లేకుండా గడిపే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫిబ్రవరి 5న ప్రయాగ్రాజ్ వెళ్లి త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం చేశారు. కోట్లాది మంది భక్తుల మాదిరిగానే తాను కూడా దైవాశ్వీరాదం పొందానని మోదీ వ్యాఖ్యానించారు. ప్రపంచ కుభేరుల్లో ఒకరైన రిలయన్స్ అధినేత ముకేష్ అంబానీ, తన కుటుంబ సభ్యులతో కలిసి మహా కుంభమేళాలో స్నానమాచరించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్, పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ పాలి రాష్ట్రాల సీఎంలు, బీజేపీతో పాటు ఇతర రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు పెద్ద సంఖ్యలో మహా కుంభమేళాలో పాల్గొన్నారు.
తెలుగు రాష్ట్రాల నుంచి..
మాజీ రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, రామ్మోహన్ నాయుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్, డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు, మాజీ మంత్రి ఆర్కే రోజా, కేశినాని నానితో పాటు పలువురు స్నానమాచరించారు. ఇక తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు పలువురు ప్రయాగ్రాజ్లో పుణ్యస్నానాలు చేశారు.
సినీ సెలబ్రిటీలు
మహాకుంభమేళాలో పెద్ద సంఖ్యలో బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు చాలా మంది సెలబ్రిటీలు పవిత్రస్నానాలు చేశారు. బాలీవుడ్ అగ్రనటి కత్రీనా కైఫ్ తన అత్తయ్యను తీసుకొని చివరిరోజైన బుధవారం ప్రయాగ్రాజ్ వచ్చి పుణ్యస్నానం చేశారు. ‘చావా’ మూవీతో సూపర్ డూపర్ హిట్ అందుకున్న విక్కీ కౌశల్, అక్షయ్ కుమార్, ప్రీతిజింటా, ఉదిత్ నారాయణ, టాలీవుడ్ నుంచి హీరో విజయ్ దేవరకొండ, త్రివిక్రమ్, తమన్నా భాటియాతో పాటు పలువురు పాల్గొన్నారు. సినీ ప్రముఖులు స్నానాలు ఆచరించి సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు.
పవిత్ర సంగమంలో ఫేమస్ అయిన వాళ్లు వీళ్లే..
మహా కుంభమేళా-2025లో ఎంతో మంది సామాన్య వ్యక్తులు సెలబ్రిటీలుగా మారారు. వారిలో ప్రముఖులైన వారిలో మధ్యప్రదేశ్కు చెందిన 16 ఏళ్ల మోనాలీసా మొదటి స్థానంలో ఉంటారు. ఈమె పూసలు విక్రయించే ఆవిడ కాగా.. రాత్రికి రాత్రే సెలబ్రిటీగా మారిపోయింది. సోషల్ మీడియాలో ఆమె వీడియోలు ఇంకా వైరల్ అవుతూనే ఉన్నాయంటే ఆమెకు ఎంత క్రేజ్ వచ్చిందో అర్థం చేసుకోవచ్చు. కుంభమేళా ప్రాంగణంలో జనాలంతా ఆమెతో ఫోటోలు తీసుకునేందుకు పోటీ పడ్డారు. అదృష్టం కొద్దీ మోనాలీసాను సినిమా ఛాన్స్ వరించింది. ఆ తర్వాత.. ‘ఐఐటీ బాబా’ గుర్తింపు తెచ్చుకున్న అభయ్ సింగ్ అనే బాబా కూడా ఫేమస్ అయ్యాడు. ఆయన ఐఐటీ బాంబే ఏరోస్పేస్ ఇంజనీరింగ్ చదివారు. ఆ తర్వాత బాబాగా మారిపోయారు. అందుకే, ఆయనకు ఐఐటీ బాబా అని పిలిచారు.
అమ్మ పుణ్యస్నానం కోసం..
ఉత్తరప్రదేశ్లోని ముజఫర్నగర్కు చెందిన శ్రావణ్ కుమార్ అనే 65 ఏళ్ల వ్యక్తి, తన కన్నతల్లిని మహా కుంభమేళా స్నానానికి తీసుకెళ్లేందుకు ఎంచుకున్న మార్గం కోట్లాది హృదయాలను కదిలించింది. 92 ఏళ్ల తన తల్లిని ఎద్దుల బండిపై కూర్చొబెట్టుకొని తన భుజాలతో బండి లాక్కొని ప్రయాగ్రాజ్ చేరుకున్నాడు. ప్రయాణక్రమంలో శ్రావణ్ కుమార్కు తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఎదురైనప్పటికీ అమ్మ కోసం వెనుకడుగు వేయలేదు. త్రివేణి సంగమం చేరే వరకు తన ప్రయాణాన్ని ఆపలేదు. దగ్గరుండి కన్నతల్లితో కుంభమేళా స్నానం చేయించాడు.
వర్చువల్ పుణ్యసాన్నాలు
కాస్త నవ్వు తెప్పించినా.. ఈ మహా కుంభమేళాలో డిజిటల్ పుణ్యస్నానాలు పుట్టుకొచ్చాయి. తనతో పాటు ప్రయాగ్రాజ్ రాని తన భర్తకు ఎలాగైనా కుంభమేళా స్నానం చేయించాలని భావించిన ఓ మహిళా తన పంతం నెగ్గించుకుంది. భర్తకు వీడియో కాల్ చేసి, అతడు లైన్లో ఉండగానే ఫోన్ను త్రివేణి సంగమంలో ముంచింది. మొత్తంగా వర్చువల్గా తన భర్తకు పుణ్యస్నానం చేయించింది. ప్రయాగ్రాజ్కు చెందిన ఓ ఔత్సాహికుడైతే ‘డిజిటల్ స్కాన్ సర్వీస్’ మొదలుపెట్టాడు. నిర్దేశించిన ఫీజు చెల్లించినవారి పాస్పోర్టు సైజు ఫొటోలు తీయించి నీటిలో ముంచాడు.
తొక్కిసలాట విషాదాలు
మహా కుంభమేళాలో అమృత స్నానమైన ‘మౌని అమావాస్య’ సందర్భంగా జనవరి 29న ఘోర విషాదం చోటుచేసుకొంది. ఎముకలు కొరికే చలిని సైతం లెక్కచేయండా రాత్రి సమయంలో భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. రద్దీ నియంత్రణలో వైఫల్యం కారణంగా తొక్కిసలాట జరిగి ఏకంగా 30 మంది భక్తులు ప్రాణాలు కోల్పోయారు. రాత్రి 1.30గంటల సమయంలో ఈ విషాదం చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనపై ప్రధాని మోదీ, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ తొక్కిసలాట ఘటన తీవ్ర విషాదాన్ని నింపినప్పటికీ ప్రయాగ్రాజ్కు భక్తుల సంఖ్య ఏమాత్రం తగ్గలేదు. మరోవైపు, మహా కుంభమేళాకు తరలి వెళ్లే భక్తుల రద్దీ కారణంగా ఢిల్లీ రైల్వే స్టేషన్లో కూడా తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఏకంగా 18 మంది చనిపోయారు.
మూడు సార్లు అగ్నిప్రమాదాలు
మహా కుంభమేళాలో మొత్తం మూడు సార్లు అగ్నిప్రమాదాలు సంభవించాయి. జనవరి 19న ఓ గుడారంలో రెండు గ్యాస్ సిలిండర్లు పేలడంతో భారీ అగ్నిప్రమాదం జరిగింది. 18 టెంట్లు తగలబడ్డాయి.మహా కుంభమేళా ప్రాంగణంలోని సెక్టార్ 19లో ఈ ప్రమాదం జరిగింది. అయితే, ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. జనవరి 30న సెక్టార్-22లో మరో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మంటల ధాటికి కొన్ని టెంట్లు కాలిబూడిదయ్యాయి. ఫిబ్రవరి 17న మూడోసారి అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. సెక్టార్ 18, 19 మధ్య షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగింది.
Also Read : Hindi vs Tamil : హిందీపై తమిళ తంబీల గోలేంటి? తెలుగు రాష్ట్రాలు సైలెంట్ ఎందుకు?