TN CM VIjay meets Stalin: తమిళనాడు రాజకీయ చరిత్రలో సోమవారం ఒక చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. తమిళగ వెట్రి కజగం (TVK) అధినేత సి. జోసెఫ్ విజయ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ నివాసానికి వెళ్లారు. రాష్ట్రంలో నాయకత్వ మార్పు జరిగిన నేపథ్యంలో మర్యాదపూర్వక పర్యటనలో భాగంగా స్టాలిన్తో విజయ్ భేటీ కావడం రాజకీయ వర్గాల్లో అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రభుత్వ నిర్వహణలో పరస్పర సహకారంపై వీరిద్దరి మధ్య చర్చలు జరిగినట్లు సమాచారం.
ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తొలిరోజే సంప్రదాయానికి భిన్నంగా విపక్ష నేత నివాసానికి వెళ్లడం ద్వారా విజయ్ తనదైన దౌత్య శైలిని చాటుకున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
అంతకుముందు సోమవారం ఉదయం తమిళనాడు శాసనసభలో ముఖ్యమంత్రి విజయ్ తన తొమ్మిది మంది మంత్రుల బృందంతో కలిసి ప్రమాణ స్వీకారం చేశారు. మాజీ ముఖ్యమంత్రులు ఎడప్పాడి కె. పళనిస్వామి, ఓ. పన్నీర్సెల్వం సహా మాజీ ఉపముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్, కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రొటెం స్పీకర్ ఎం.వి. కరుప్పయ్య 17వ అసెంబ్లీ మొదటి సెషన్ను ప్రారంభించి విజయ్ ఎన్నికల విజయాన్ని.. నాయకత్వ పటిమను అభినందించారు. అనంతరం సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయించారు.