Education Budget 2026: కేంద్ర బడ్జెట్ – 2026లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ విద్యారంగానికి సంబంధించి పలు కీలక ప్రకటనలు చేశారు. దేశంలోని విద్యా వ్యవస్థను ఉద్యోగాలు, సేవల రంగంతో అనుసంధానం చేయడం, విద్యార్థుల నైపుణ్యాలపై దృష్టి సారించడం వంటి అంశాలు ఉన్నాయి. అలాగే దేశంలో 5 కొత్త యూనివర్సిటీ టౌన్ షిప్ లు, ప్రతీ జిల్లాలో బాలికల హాస్టళ్లు, డిజిటల్ తరగతులు వంటి అంశాలను ఆర్థిక మంత్రి తన బడ్జెట్ ప్రసంగంలో ప్రస్తావించారు. అంతేకాకుండా గతేడాదితో పోలిస్తే 6.22 శాతం మేర విద్యారంగానికి నిధుల పెంచి.. రూ.1,28,650 కోట్లు బడ్జెట్ లో కేటాయించారు.
విద్యారంగానికి సంబంధించిన బడ్జెట్ లో ఎక్కువ భాగం పాఠశాల విద్యకే ఆర్థికమంత్రి మంత్రి నిర్మలా సీతారామన్ కేటాయించారు. పాఠశాల విద్య, అక్షరాస్యత శాఖకు ఏకంగా రూ. 78,572 కోట్లు కేటాయించారు. ఈ స్థాయిలో నిధులు కేటాయించడం ఇదే తొలిసారి. గత ఏడాదితో పోలిస్తే పాఠశాల విద్యాకు 7 శాతం మేర అంటే రూ.5,074 కోట్లు అదనంగా కేంద్రం నిధులు కేటాయించింది. ఈ నిధులు ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి దోహదం చేస్తాయని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ధీమా వ్యక్తం చేశారు.
విద్యకు సంబంధించిన పథకాలకు గతంతో పోలిస్తే ఈ బడ్జెట్ లో అధిక నిధులు కేటాయించారు. సమగ్ర శిక్షా అభియాన్ కు అదనంగా రూ.3,750 కోట్లు కేటాయించారు. మధ్యాహ్న భోజనం అందించే పీఎం పోషన్ పథకానికి రూ.32 కోట్లు అదనంగా ఇవ్వగా.. పీఎం శ్రీ పాఠశాలలకు అనదంగా రూ.1,450 కోట్లు కేటాయించారు. పాఠశాల విద్యకు కేటాయించిన మొత్తం రూ.78,572 కోట్లలో రూ.63,089 కోట్లు వివిధ ప్రభుత్వ పథకాలకు ఖర్చు చేయనున్నారు. మిగిలిన రూ.15,483 కోట్లు జీతాలు, పరిపాలనా ఖర్చులు వంటి పథకంయేతర ఖర్చుల కోసం వెచ్చించనున్నారు.
రాబోయే ఐదు సంవత్సరాలలో ప్రభుత్వ పాఠశాలల్లో 50,000 అటల్ టింకరింగ్ ల్యాబ్లు ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. ఈ ల్యాబ్లు విద్యార్థుల్లో ఆసక్తిని రేకెత్తించడంతో పాటు శాస్త్రీయ ఆలోచన, సమస్య పరిష్కార నైపుణ్యాలను అభివృద్ధి చేయడంలో సహాయపడతాయని పేర్కొన్నారు.
మరోవైపు గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్ యాక్సెస్ను మెరుగుపరచడానికి ‘భారత్నెట్ ప్రాజెక్ట్’ కింద అన్ని ప్రభుత్వ పాఠశాలలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు ఇంటర్నెట్ కనెక్టివిటీని అందించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.
Also Read: Union Budget 2026: గ్రీన్ ఎనర్జీకి బడ్జెట్ బూస్ట్.. 4000 ఈ-బస్సులు, పర్యాటకానికి పెద్దపీట!
ప్రతీ జిల్లాలో బాలిక హాస్టల్ ను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థినులకు వీటి ద్వారా మేలు కలగనున్నట్లు ఆర్థిక మంత్రి తెలిపారు. మరోవైపు స్కూళ్లల్లో కంటెంట్ క్రియేటర్ ల్యాబ్స్ ఏర్పాటుకు కేంద్రం అంగీకారం తెలిపింది. దేశవ్యాప్తంగా 1500 స్కూళ్లు, 500 కాలేజీల్లో కంటెంట్ క్రియేటర్ ల్యాబ్స్ ఏర్పాటు కానున్నాయి.
Also Read: Union Budget 2026: కేంద్ర బడ్జెట్ – 2026 ఎఫెక్ట్.. ధరలు పెరిగేవి, తగ్గేవి ఇవే.. ఫుల్ లిస్ట్ మీకోసం