దేశాభివృద్ధికి సంబంధించి కేంద్ర కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ వివరాలను వెల్లడించారు. ప్రధానంగా జల్ జీవన్ మిషన్ గడువును 2028 డిసెంబర్ వరకు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 2019 నుంచి 2024 వరకు ప్రాథమికంగా నిర్ణయించిన ఈ పథకం ద్వారా మరిన్ని సేవలు అందించాలని కేంద్రం భావిస్తోంది. ఇప్పటివరకు 12.6 కోట్ల గ్రామీణ కుటుంబాలకు ఇంటి వద్దకే ట్యాప్ కనెక్షన్లు అందాయి. ఇకపై కేవలం మౌలిక సదుపాయాల కల్పనకే పరిమితం కాకుండా నాణ్యమైన సేవల పంపిణీపై యంత్రాంగం దృష్టి సారించనుంది.
ఈ బృహత్తర ప్రాజెక్టు మొత్తం వ్యయాన్ని ప్రభుత్వం రూ. 8.7 లక్షల కోట్లకు పెంచింది. పథకం సమర్థవంతమైన అమలు కోసం రాబోయే మూడు నెలల్లో రాష్ట్రాలతో ప్రత్యేక ఒప్పందాలు (MoUs) కుదుర్చుకోవాలని కేబినెట్ నిర్ణయించింది. దీనివల్ల నిధుల వినియోగం.. పనుల పర్యవేక్షణ సులభతరం అవుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి నివాసానికి స్వచ్ఛమైన తాగునీరు అందించాలనే లక్ష్యాన్ని చేరుకోవడంలో ఈ గడువు పెంపు కీలకంగా మారనుంది.
రవాణా రంగానికి సంబంధించి ప్రభుత్వం భారీ కేటాయింపులు చేపట్టింది. తమిళనాడులోని మధురై విమానాశ్రయాన్ని అంతర్జాతీయ విమానాశ్రయంగా ప్రకటిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. దీనివల్ల ఆ ప్రాంతంలో పర్యాటకం.. వాణిజ్యం గణనీయంగా మెరుగుపడే అవకాశం ఉంది. రహదారుల విస్తరణలో భాగంగా పశ్చిమ బెంగాల్లోని సంత్రాగచ్చి-ఖరగ్పూర్ మధ్య నాలుగు వరుసల రహదారి నిర్మాణానికి రూ. 2,905 కోట్లు కేటాయించారు. అలాగే సైంథియా-పాకూర్ మధ్య మరో నాలుగు వరుసల రహదారిని రూ. 1,569 కోట్లతో నిర్మించనున్నారు.
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని బద్నావర్-థాండియా-తిమర్వాని (NH 752) ఐదు వరుసల రహదారి నిర్మాణానికి రూ. 3,839 కోట్లు కేటాయిస్తూ ఆమోదముద్ర వేశారు. ఉత్తరప్రదేశ్ వాసులకు ఊరటనిస్తూ జెవార్ విమానాశ్రయం నుంచి ఫరీదాబాద్ సెక్షన్ను కలిపే ఆరు వరుసల ఎలివేటెడ్ రోడ్డు నిర్మాణానికి రూ. 3,631 కోట్లు మంజూరు చేశారు. ఈ మౌలిక సదుపాయాల కల్పన ద్వారా ప్రయాణ సమయం తగ్గడమే కాకుండా ఆర్థిక కార్యకలాపాలు పుంజుకుంటాయని కేంద్ర ప్రభుత్వం ఆశిస్తోంది.
ALSO READ: Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసు.. సుప్రీంలో ప్రభాకర్ రావుకు ఊరట, బెయిల్ మంజూరు చేసిన కోర్టు