Kalvakuntla Kavitha: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీకి ఘాటైన లేఖ రాశారు. ఖమ్మం జిల్లా వెలుగుమట్ల ప్రాంతంలో పేదలు నివసిస్తున్న భూదాన భూముల్లో ఇళ్లను ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా కూల్చివేయడంపై ఆమె తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ కూల్చివేత ప్రాంతంలోనే ఆమె ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ తన అంతరాత్మను మేల్కొల్పాలని లేఖలో కోరారు. దేశంలోని ఇతర ప్రాంతాల్లో బుల్డోజర్ రాజకీయాలను వ్యతిరేకించే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో మాత్రం పేదల ఇళ్లను కూల్చివేయడం ద్వంద్వ నీతికి నిదర్శనమని ఆమె మండిపడ్డారు.
వెలుగుమట్ల కూల్చివేత ఘటన కేవలం పరిపాలనాపరమైన చర్య కాదని వందలాది పేద కుటుంబాల జీవితాలను నాశనం చేయడమేనని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు 600 ఇళ్లను నేలమట్టం చేయడం వల్ల 2,000 మంది రాత్రికి రాత్రే నిరాశ్రయులయ్యారని పేర్కొన్నారు. వీరిలో అత్యధికంగా సమాజంలోని బలహీన వర్గాలకు చెందిన వారే ఉన్నారని చెప్పారు. గతంలో ఆంధ్రప్రదేశ్ భూదాన బోర్డు జారీ చేసిన పట్టాలు ఉన్నప్పటికీ అధికారులు వాటిని బేఖాతరు చేస్తూ ఇళ్లను ధ్వంసం చేశారని ఆరోపించారు. కనీసం ముందస్తు నోటీసులు ఇవ్వకుండా నిరుపేదల జీవితకాల కష్టాన్ని మట్టిలో కలిపేశారని ధ్వజమెత్తారు.
ప్రస్తుతం ఆ ప్రాంతంలో మహిళలు వృద్ధులు చిన్న పిల్లలు ఆకలితో అలమటిస్తూ గడ్డకట్టే చలిలో ఆకాశం కింద జీవిస్తున్నారని కవిత లేఖలో వివరించారు. పాఠశాలలకు వెళ్లాల్సిన పిల్లలు తిండికి గూడుకు మొహం వాచి దాతృత్వంపై ఆధారపడటం అత్యంత బాధాకరమని పేర్కొన్నారు. పేదల హక్కులను కాపాడుతామని చెప్పి అధికారం చేపట్టిన కాంగ్రెస్ ఇప్పుడు వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తోందని విమర్శించారు. ఒకవైపు జాతీయ స్థాయిలో రాహుల్ గాంధీ పేదల పక్షపాతిగా మాట్లాడుతుంటే తెలంగాణలో ఆయన పార్టీ ప్రభుత్వం పేదలను వీధుల పాలు చేస్తోందని ఎద్దేవా చేశారు.
నిర్వాసితులకు అదే ప్రాంతంలో ప్లాట్లు కేటాయించి ఇళ్లు మంజూరు చేసే వరకు తన పోరాటం ఆగదని కవిత స్పష్టం చేశారు. బాధితులకు తక్షణమే న్యాయం జరిగేలా రాహుల్ గాంధీ జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు. పేదలకు గూడు కల్పించి వారి గౌరవాన్ని పునరుద్ధరించే వరకు నిరాహార దీక్ష కొనసాగుతుందని తెలిపారు. జై హింద్ జై తెలంగాణ అంటూ తన లేఖను ముగించారు.
Read Also: GHMC: రెండు కార్పొరేషన్లు ఏర్పాటై నేటికి నెల.. ఇంకా సమకూరని మౌలిక వసతులు