Warangal Municipal Elections: పంచాయతీ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటిన హస్తం పార్టీ కీలకమైన వరంగల్ మేయర్ పీఠం దక్కించుకునేందుకు వ్యూహాత్మక అడుగులు వేస్తోందా? వరంగల్ అభివృద్ధిలో కీలకమైన అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ప్రాజెక్ట్ నిధుల విడుదల.. నగరపాలక సంస్థ ఎన్నికల్లో కీ ఫ్యాక్టర్గా మారబోతోందా? ఒక వైపు ఓరుగల్లులో అభివృద్ధి పనులు పరుగులు పెట్టిస్తూ, మరోవైపు పార్టీ పరంగా ఓరుగల్లుకు ప్రత్యేక స్థానం ఇస్తుండటం ఆ వ్యూహంలో భాగమేనా?
గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పాలకవర్గం పదవీ కాలం ఈ ఏడాది మే నెల మొదటి వారంతో ముగుస్తోంది. పదవీ కాలం ముగిసిన రెండు నెలల్లో జీడబ్ల్యూఎంసీ ఎన్నికల నగారా మోగబోతున్నట్లుగా తెలుస్తోంది. అందుకే బీజేపీ, బీఆర్ఎస్లు అధినాయకత్వం ఆదేశాలతో ప్రజల్లోకి వెళ్లేందుకు వ్యూహాలు రచిస్తున్నాయట. కేంద్ర ప్రభుత్వ నిధులతోనే కార్పొరేషన్ అభివృద్ధి చెందుతుందని బిజెపి నేతలు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్ రెండేళ్ల పదవీ కాలంలో జిల్లాకు ఒరిగిందేమీ లేదని, కార్పొరేషన్ ఎన్నికల్లో కారు పార్టీని గెలిపించాలని గులాబీ నేతలు ప్రచారాలు కొనసాగిస్తున్నారట.
ప్రతిపక్షాల ప్రచార నినాదాలు ఏంటనేది పక్కన పెడితే… తమకు మాత్రం చేసిన అభివృద్ధి మాత్రమే కొలమానం అని అధికార కాంగ్రెస్ నాయకులు చెప్పే ప్రయత్నం చేస్తున్నారట. అందుకే దశాబ్దాల కాలంగా పెండింగ్ లో ఉన్న వరంగల్ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులకు రేవంత్ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని చెప్తూ… ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు కోసం రూ.5,257 కోట్ల నిధులకు రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన అనుమతులు సైతం ఇచ్చిందని గుర్తు చేస్తున్నారు. దీంతో UGD ప్రాజెక్ట్ హస్తం పార్టీకి ట్రంప్ కార్డ్ వంటిదనే చర్చలు జరుగుతున్నాయి. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పథకం పక్కన పెడితే గ్రేటర్ వరంగల్ పరిధిలో రోడ్ల వెడల్పు, కమ్యూనిటీ భవనాలు, మంచినీళ్ళ వసతి, జాబ్ మేళాల కారణంగా ఓటర్లు కాంగ్రెస్ పార్టీ వైపే మొగ్గు చూపుతారన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 66 డివిజన్ లు ఉండగా, 24 డివిజన్ లు వరంగల్ తూర్పు నియోజకవర్గంలో, 26 డివిజన్లు వరంగల్ పశ్చిమ నియోజకవర్గ పరిధిలో, వర్ధన్నపేట పరిధిలో 12 డివిజన్ లు, పరకాల నియోజకవర్గ పరిధిలో మూడు డివిజన్లు, స్టేషన్ఘన్పూర్ నియోజకవర్గ పరిధిలో ఒక డివిజన్ ఉన్నాయి. 2016 కార్పొరేషన్ ఎన్నికలలో 4 డివిజన్లలో, 2021 కార్పొరేషన్ ఎన్నికలలో 4 డివిజన్లలో మాత్రమే హస్తం పార్టీ అభ్యర్థులు గెలుపొందారు. 2021 కార్పొరేషన్ ఎన్నికలలో కాంగ్రెస్ 4 స్థానాలు గెలిస్తే బిజెపి 10 స్థానాలు గెలిచింది. ఎటు చూసినా తెలంగాణ ఆవిర్భావం తర్వాత వరంగల్ కార్పొరేషన్ లో హస్తం పార్టీకి సింగిల్ డిజిట్ దాటలేదు.
దీంతో ఈ సారి మేయర్ పదవి దక్కించుకోవాలంటే ఆషామాషీ విషయం కాదని కాంగ్రెస్ వర్గాల్లో చర్చ వరంగల్ నగర అభివృద్ధిలో అత్యంత కీలకమైన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ప్రాజెక్టుకు నిధుల కేటాయింపు అంశంతో పాటు, గతంలో వరంగల్ మేయర్ గా పని చేసిన ఎర్రబెల్లి స్వర్ణను రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా నియమించడం కాంగ్రెస్కు మరింత కలిసి వస్తుందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇప్పటికే పశ్చిమ నియోజకవర్గంలోని 26 డివిజన్లలో పాదయాత్ర నిర్వహిస్తూ సమస్యల పరిష్కారంతోపాటు అభివృద్ధి పనులను పరుగులు పెట్టిస్తున్నారు ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి. తూర్పు నియోజకవర్గంలో అభివృద్ధి పనులను ప్రారంభిస్తూ మంత్రి కొండా సురేఖ ప్రజల మధ్యే ఉంటున్నారు. మరోవైపు కొండా అనుచరులు ఇతర పార్టీల నేతలను హస్తం పార్టీలోకి చేరుస్తూ జోష్ మీదున్నారు. అసెంబ్లీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ వర్ధన్నపేట నియోజకవర్గంలోని డివిజన్లలో ఎమ్మెల్యే నాగరాజు సైతం చురుగ్గా తిరుగుతున్నారు. దీంతో ఈ సారి హస్తం హవా తప్పదనే టాక్ వినిపిస్తోంది. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ప్రాజెక్ట్ పరిపాలన అనుమతులు రావడంతో పూర్తిగా వార్ వన్ సైడ్ అనే గుసగుసలు ఓరుగల్లు పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తున్నాయి.
Also Read: Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసు.. సుప్రీంలో ప్రభాకర్ రావుకు ఊరట, బెయిల్ మంజూరు చేసిన కోర్టు