న్యూఢిల్లీ వేదికగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో దేశాభివృద్ధికి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రవాణా, మౌలిక సదుపాయాల కల్పనతో పాటు ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ భారీగా నిధులను కేటాయించారు. దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ సమావేశంలో పలు ప్రతిపాదనలకు ఆమోదం లభించింది.
ఏపీ ప్రజలకు భారీ గుడ్ న్యూస్..
రైల్వే నెట్వర్క్ బలోపేతం దిశగా కేంద్రం కీలక అడుగు వేసింది. ఆంధ్రప్రదేశ్లోని రాజమండ్రి – విశాఖపట్నం మధ్య మూడవ, నాలుగవ రైల్వే లైన్ల విస్తరణకు రూ.9,889 కోట్ల రూపాయలను కేటాయించింది. ఈ నిర్ణయం వల్ల తెలుగు రాష్ట్రాల్లో రవాణా సౌకర్యాలు మెరుగుపడటమే కాకుండా ప్రయాణ సమయం కూడా గణనీయంగా తగ్గుతుంది. అదేవిధంగా ఘజియాబాద్ – సీతాపూర్ మధ్య మూడవ, నాలుగవ రైల్వే లైన్ల విస్తరణ కోసం 14,926 కోట్ల రూపాయలను మంజూరు చేశారు. ఈ విస్తరణ పనులు పూర్తయితే సరుకు రవాణా సామర్థ్యం పెరిగి ఆర్థిక కార్యకలాపాలు వేగవంతం అవుతాయి.
గ్రామీణ ప్రాంతాల్లో కనెక్టివిటీని పెంపొందించేందుకు ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన పథకాన్ని మరింత కాలం పొడిగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం ఏకంగా 83,977 కోట్ల రూపాయల భారీ నిధులను కేటాయించారు. ప్రతి గ్రామాన్ని ప్రధాన రహదారులతో అనుసంధానించడమే ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశ్యం. సముద్రయాన రంగంలో భద్రతను పెంపొందించేందుకు ‘భారత్ మారిటైమ్ ఇన్సూరెన్స్ పూల్’ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ ప్రాజెక్టు కోసం 12,980 కోట్లు వెచ్చించనున్నారు.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. పెరిగిన ధరలకు అనుగుణంగా డియర్నెస్ అలవెన్స్ (DA), డియర్నెస్ రిలీఫ్ (DR) పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ పెంపుదల వల్ల ప్రభుత్వ ఖజానాపై 6,791 కోట్ల రూపాయల అదనపు భారం పడనుంది. లక్షలాది మంది ఉద్యోగులకు ఈ నిర్ణయం వల్ల లబ్ధి చేకూరుతుంది. దేశ ప్రగతిలో ఈ నిర్ణయాలన్నీ మైలురాళ్లుగా నిలుస్తాయని నిపుణులు భావిస్తున్నారు.
ALSO READ: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు డీఏ పెంపు.. జీతం ఎంత పెరుగుతుందంటే?