Central Govt DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు గుడ్ న్యూస్ అందింది. కాస్త ఆలస్యం అయినప్పటికీ కేంద్రం 2 శాతం పెంచుతున్నట్లు ప్రకటించింది. ద్రవ్యోల్బణం, పెరుగుతున్న రేట్లను బట్టి కేంద్రం ఏటా జనవరి, జులైలో డీఏ పెంచుతుంది. ఈసారి డీఏ పెంపు ఆలస్యం కావడంతో ఉద్యోగులు, పెన్షనర్ల నుంచి ఆందోళన వ్యక్తం అయింది.
కేంద్ర మంత్రివర్గం కరువు భత్యాన్ని (DA) 2 శాతం పెంచుతున్నట్లు శనివారం ప్రకటించింది. దీంతో మొత్తం డీఏ మూల వేతనంలో 58 శాతం నుంచి 60 శాతానికి పెరగనుంది. పెంచిన డీఏ జనవరి 2026 నుంచి అమలులోకి వస్తుంది. ఉద్యోగులు, పెన్షనర్లకు ఈ పెంపు వర్తిస్తుంది. కంజ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ మార్పుల ఆధారంగా, కరువు భత్యాన్ని సంవత్సరానికి రెండుసార్లు ఒకసారి జనవరిలో, మరోసారి జులైలో కేంద్రం సవరిస్తుంది. గతంలో కంటే తాజాగా తక్కువ డీఏను పెంచారు.
డీఏ పెంపుతో కోటి మందికి పైగా ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రయోజనం చేకూరనుంది. వారి నెలవారీ ఆదాయాలు స్వల్పంగా పెరగనున్నాయి. ఉదాహరణకు, రూ. 30,000 మూల వేతనం ఉన్న ఉద్యోగికి.. డీఏ పెంపుతో నెలకు రూ. 600 జీతం పెరుగుతుంది.
కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులు, పెన్షనర్లకు డీఏ పెంపు.. వేతన సంఘం చర్చలు నేపథ్యంలో ప్రాముఖ్యత సంతరించుకుంది. జీతాల పెంపుపై ఉద్యోగ సంఘాల నుంచి డిమాండ్ వస్తున్న తరుణంలో డీఏ పెంపు కీలకంగా మారింది. ఈ డిమాండ్లు 8వ వేతన సంఘం ప్రతిపాదనలతో ముడిపడి ఉన్నాయని నిపుణులు అంటున్నారు. 8వ వేతన సంఘం ఉద్యోగుల జీతాల సవరణలు, ఇతర అంశాలను పరిశీలిస్తుంది. వీటిల్లో 3.83 శాతం ఫిట్మెంట్ ఫ్యాక్టర్ కూడా ఉంది. కేంద్రం ఈ ప్రతిపాదనలను ఆమోదిస్తే మూల వేతనం రూ. 18,000 నుంచి సుమారు రూ. 69,000కు భారీగా పెరగవచ్చు. దీంతో వేతన సవరణలలో భారీ మార్పు రానుంది.
Also Read: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. డీఏ పెంపునకు కేబినెట్ ఆమోదం