Triple-Ticket Candidate of Dahod: గుజరాత్లోని దాహోద్ జిల్లాలో వింత రాజకీయ పరిణామం చోటుచేసుకుంది. ఒకే అభ్యర్థి మూడు ప్రధాన ప్రత్యర్థి పార్టీల తరపున నామినేషన్ దాఖలు చేయడం ఓటర్లను, ఎన్నికల అధికారులను విస్మయానికి గురిచేస్తోంది. దాహోద్ జిల్లా పంచాయతీ పరిధిలోని పిపేరో సీటు కోసం భారత్ సింగ్ వఖాలా అనే నేత.. అటు బీజేపీ.. ఇటు కాంగ్రెస్.. మరోవైపు ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) తరపున అధికారిక అభ్యర్థిగా నామినేషన్ పత్రాలను సమర్పించారు. రాష్ట్ర చరిత్రలో ఇలా జరగడం ఇదే తొలిసారి కావడంతో ఈ సీటు ఇప్పుడు ఒక ‘పొలిటికల్ థ్రిల్లర్’గా మారింది.
సీనియర్ నేత బచుభాయ్ ఖాబద్కు బలమైన పట్టున్న పిపేరో స్థానంలో భారత్ సింగ్ వఖాలా ఒక కీలక వ్యక్తి. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ తరపున పోటీ చేసి బీజేపీకి గట్టి పోటీ ఇచ్చిన వఖాలాకు పార్టీలు మారడం కొత్తేమీ కాదు. గతంలో కాంగ్రెస్లో ఉన్న ఆయన ఆ తర్వాత ఆప్ లోకి.. ఇటీవలే బీజేపీ గూటికి చేరినట్లు వార్తలు వచ్చాయి. అయితే పిపేరో సీటు కోసం దాఖలైన 11 నామినేషన్ పత్రాలను పరిశీలిస్తే వింత అంశాలు వెలుగులోకి వచ్చాయి. అందులో బీజేపీ తరపున 5 ఫారాలు.. కాంగ్రెస్ నుండి 2.. ఆప్ నుండి ఒకటి వఖాలా పేరిట ఉన్నాయి. ఇవి కాకుండా ఇద్దరు స్వతంత్రులు.. బీఆర్పీ పార్టీ నుండి ఒకరు పోటీలో ఉన్నారు.
భారత్ సింగ్ వఖాలా మూడు పార్టీల తరపున నామినేషన్లు వేసినప్పటికీ.. చట్టబద్ధంగా ఆయన ఏ పార్టీ అభ్యర్థి అనేది పార్టీ మేండ్యాట్ (బి-ఫారం) మీద ఆధారపడి ఉంటుంది. ఎన్నికల నిబంధనల ప్రకారం.. గడువు ముగిసేలోపు ఏ పార్టీ అయితే అధికారికంగా అతడిని తమ అభ్యర్థిగా గుర్తిస్తూ లెటర్ జారీ చేస్తుందో ఆ పార్టీ గుర్తుపైనే ఆయన పోటీ చేయగలరు. ఒకవేళ ఏ పార్టీ కూడా మేండ్యాట్ ఇవ్వకపోతే ఆయన స్వతంత్ర అభ్యర్థిగా మిగిలిపోయే అవకాశం ఉంటుంది.
ప్రస్తుతం దాహోద్ రాజకీయాల్లో ఈ వ్యవహారం తీవ్ర చర్చకు దారితీసింది. “ఏప్రిల్ 15వ తేదీ నామినేషన్ల ఉపసంహరణకు ఆఖరి రోజు. ఆ రోజే వఖాలా ఏ పార్టీ బి-ఫారం సమర్పిస్తారో.. ఏ నామినేషన్లను ఉపసంహరించుకుంటారో స్పష్టత వస్తుంది.” అని స్థానిక ఎన్నికల అధికారి ఒకరు తెలిపారు. ఏది ఏమైనా ఒకే అభ్యర్థి మూడు పార్టీల ప్రతినిధిగా ఫారాలు నింపడం భారత ఎన్నికల చరిత్రలో వింత ఘటనగా నిలిచిపోయింది.
Read Also: అదుపుతప్పిన ట్రక్కు కింద ఆటో నుజ్జు నుజ్జు.. నవదంపతులతో సహా నలుగురు మృతి