UP Voters Deleted: ఉత్తరప్రదేశ్లో ఎన్నికల సంఘం ఓటర్ల జాబితా సవరణలో భాగంగా భారీ ప్రక్షాళన చేపట్టింది. రాష్ట్రవ్యాప్తంగా ఏకంగా 2.89 కోట్ల మంది ఓటర్ల పేర్లను జాబితా నుంచి తొలగించినట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. లక్నోలో తాజాగా విడుదల చేసిన ముసాయిదా జాబితా ప్రకారం.. తొలగించిన వారిలో 46 లక్షల మంది మరణించిన ఓటర్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. గతేడాది అక్టోబర్లో ఓటర్ల సవరణ ప్రక్రియ ప్రారంభమైనప్పుడు యూపీలో 15.44 కోట్ల మంది ఓటర్లు ఉండగా, ప్రస్తుతం ఆ సంఖ్య 12.56 కోట్లకు తగ్గింది. నకిలీ ఓట్లు, చనిపోయిన వారి పేర్లు, స్థల మార్పులు వంటి కారణాలతో ఈ భారీ తొలగింపు చేపట్టినట్లు సమాచారం.
ఎన్నికల సంఘం SSR (ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ) ప్రక్రియను ఇటీవలే వెస్ట్ బెంగాల్, తమిళనాడు సహ పలు రాష్ట్రాల్లో నిర్వహించింది. తమిళనాడు వ్యాప్తంగా 97 లక్షల ఓటర్లను తొలగించింది. ఇందులో 26.94 లక్షల మంది మృతి చెందగా, 66.44 లక్షల ఓటర్లు స్థలం మారినట్లు పేర్కొంది. మరో 3.39 లక్షల ఓటర్లతో కలిపి దాదాపు కోటి ఓటర్లను జాబితా నుంచి తొలగించింది ఎన్నికల సంఘం.
పశ్చిమ బెంగాల్లో 58 లక్షల ఓటర్ల పేర్లు జాబితా నుంచి తొలగించారు. రాజస్థాన్లో 44 లక్షలు, గోవాలో 1.01 లక్షలు, పుదుచ్చేరిలో 1.03 లక్షలు, లక్షద్వీప్లో 1,616 మంది పేర్లు ఓటర్ల జాబితా నుంచి ఏఎస్డీ (ASD – Absent, Shifted, Dead) జాబితాలోకి చేరాయి. బిహార్లో కూడా ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలకు ముందు జరిపిన సవరణలో ఏకంగా 68 లక్షల ఓట్లు తొలగింపుకు గురవడం తెలిసిందే. దేశవ్యాప్తంగా జరిగిన ఈ సవరణ ప్రక్రియలో బోగస్ ఓట్ల ఏరివేతకు ఎన్నికల సంఘం అధిక ప్రాధాన్యతనిచ్చింది. తుది జాబితాలు జనవరి నెలలో అధికారికంగా విడుదల కానున్నాయి.
Read Also: YSRCP : భోగాపురం ఎయిర్పోర్ట్.. వైసీపీ నేతలు ఓర్వలేకపోతున్నారా?