ఏపీలోని విజయనగరం జిల్లాలో నిర్మాణ దశలో ఉన్న భోగాపురం ఎయిర్ పోర్టులో ఇటీవల టెస్టు ఫ్లయిట్ను విజయవంతంగా పరీక్షించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఇదే విషయం రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తున్నది. మొన్నటివరకు ఈ ఘనత తమదేనని డప్పులు కొట్టుకున్న వైసీపీ నేతలు ఇప్పుడు మరో కొత్త వివాదానికి తెరలేపారు. సీఎం చంద్రబాబు ప్రాంతాల వారీగా తేడా చూపిస్తున్నారని.. ఉత్తరాంధ్రకు అధిక ప్రాధాన్యం ఇస్తూ రాయలసీమను పట్టించుకోవడం లేదని విమర్శలు మొదలెట్టారు. భోగాపురం ఎయిర్ పోర్టు నిర్మాణం ప్రస్తుతం తుది దశకు చేరుకుంది. మరో నాలుగు నెలల్లో అందులో విమానాల రాకపోకలు ప్రారంభం అవుతాయని కేంద్ర పౌర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు ఇటీవల ప్రకటించారు.
సాధారణంగా రాష్ట్రానికి రాజధాని కీలకం. ఎందుకంటే అక్కడే ఉత్పత్తి కేంద్రీకృతమై ఉంటుంది. ఉద్యోగాలు, ఉత్పత్తులు, రాబడి అక్కడే వస్తున్నా..సమకూరిన ఆదాయాన్ని ప్రభుత్వం అన్ని జిల్లాలకు సమానంగా కేటాయించి అభివృద్ధి పనులను చేయిస్తుంటుంది. వైసీపీ నేతలకు ఈ మాత్రం తెలీదు కాబోలు అందుకే ప్రాంతాల వారీగా వైషమ్యాలు రెచ్చగొట్టాలని చూస్తున్నట్టు చర్చ జరుగుతున్నది. వైఎస్ జగన్ పాలనలో మూడు రాజధానుల పేరిట ఐదేండ్లు గడిపారు. అటు రాజధాని పూర్తి చేయలేదు కదా.. రాయలసీమలోని కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామనని.. న్యాయ రాజధానిగా రాయలసీమను తీర్చిదిద్దుతానని ప్రకటించారు. కానీ ఏమీ చేయలేదు. ఇక వైఎస్ హయాంలోనూ కేవలం కడప జిల్లాను మాత్రమే అభివృద్ధి చేశారు. అక్కడే పరిశ్రమలు నెలకొల్పారు.మిగతా జిల్లాలను విస్మరించారు.నేటికి అనంతపురం, కర్నూలులోని కొన్ని ప్రాంతాలు కరువును ఎదుర్కొంటున్నాయి.
ప్రస్తుతం భోగాపురం ఎయిర్ పోర్టు పూర్తయితే ఉత్తరాంధ్ర రూపురేఖలు మారిపోనున్నాయి. అక్కడ వాణిజ్యంగా అభివృద్ధి పరుగులు పెట్టనుంది. అక్కడి రైతుల ఉత్పత్తులకు మార్కెటింగ్ సదుపాయం ఉంటుంది.ఉద్యోగాలు వస్తాయి. ఆదాయం సైతం పెరుగుతుంది. అభివృద్ధి ఉత్తరాంధ్ర, దక్షిణాంధ్ర అని చూడకుండా.. రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని చూడాలి.కానీ, వైసీపీ నేతలు తమ స్వార్థరాజకీయాల కోసం ఉత్తరాంధ్ర,రాయలసీమ అని విడగొట్టి చూస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్ర ఆదాయం పెరగాలి. అప్పుడే వెనుకబడి ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వాలు చొరవచూపుతాయి. గత పాలనలో సీఎం జగన్ అడ్డగోలు అప్పులు చేశారు. ఇప్పుడు రాష్ట్రానికి సమకూరే ఆదాయం సగం ఉద్యోగుల జీతాలు, అప్పులకు వడ్డీలు కట్టడానికే సరిపోతున్నది. కేంద్రం నిధుల సాయంతో పోలవరం, భోగాపురం ఎయిర్ పోర్టు, మిగతా పెండింగ్ రహదారులు, నేషనల్ హైవేస్, గ్రీన్ ఫీల్డ్ హైవేల నిర్మాణం జరుగుతోంది.విశాఖ మెట్రోను నిధుల కొరత వేధిస్తున్నది.
KCR : పదేండ్లు ఆయన చెప్పిందే వేదం.. ఇప్పుడు జీరో అయ్యారా?
తాజాగా నగరి మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నాయకురాలు మాట్లాడుతూ.. చంద్రబాబుకు ఉత్తరాంధ్ర మీద ఉన్న ప్రేమ రాయలసీమ మీద లేదని వ్యాఖ్యానించారు. అలాగైతే ఏపీ ప్రభుత్వం తెలంగాణతో పంచాయితీ పెట్టుకుని మరీ రాయలసీమ లిఫ్ట్ కోసం ఎందుకు అంతగా కష్టపడుతున్నది. రాయలసీమకు నీళ్లు అందిస్తే అక్కడి రైతుల కష్టాలు తీరుతాయని, పంటలు పండితే వలసలు తగ్గుతాయని ప్రభుత్వం ఆలోచన చేసింది.అందుకే సుప్రీంకోర్టులో నల్లమల లింక్ సాగర్, గోదావరి జలాల తరలింపునకు వ్యతిరేకంగా తెలంగాణ వేసిన పిటిషన్పై కొట్లాడుతున్నది.ఈ విషయం వైసీపీ నేతలకు తెలీదా? రాయలసీమలో గతంలో ఏర్పాటైన కియా కార్ల షోరూం ఎవరి హయాంలో వచ్చింది గుర్తుందా? ఇప్పటికే ఉమ్మడి ఏపీ విడిపోవడంతో రాష్ట్రం చాలా వెనక్కిపోయింది. ఇప్పుడు ప్రాంతాల వారీగా విభజన రాజకీయాలు చేయడం వైసీపీ నాయకులు ఇకనైనా మానుకోవాలని, రాష్ట్ర అభివృద్ధికి సలహాలు సూచనలు ఇవ్వాలని కూటమి నేతలు, తెలుగు తమ్ముళ్లు కోరుతున్నారు.