Mohan Bhagwat: ఉత్తరప్రదేశ్లో ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్ ప్రయాణిస్తున్న వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలుపై రాళ్ల దాడి జరిగింది. హర్దోయ్ జిల్లా కౌడా గ్రామం సమీపంలో గురువారం మధ్యాహ్నం ఈ ఘటన చోటుచేసుకుంది. రైలు ఢిల్లీ వైపు వెళ్తున్న సమయంలో మధ్యాహ్నం 3.20 గంటలకు గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లు విసిరారు. ఈ దాడిలో ఒక కిటికీ అద్దం పూర్తిగా పగిలింది. అయితే అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదని రైల్వే వర్గాలు ధృవీకరించాయి.
ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే విచారణ ప్రారంభించారు. ప్రాథమిక సమాచారం మేరకు రైల్వే ట్రాక్ పక్కన క్రికెట్ ఆడుకుంటున్న 8 నుంచి 13 ఏళ్ల లోపు బాలలు సరదాగా రాళ్లు విసిరి ఉండవచ్చని సర్కిల్ ఆఫీసర్ అంకిత్ మిశ్రా వెల్లడించారు. ఈ దిశగా దర్యాప్తు కొనసాగుతోందని.. బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. ఆర్ఎస్ఎస్ చీఫ్ భద్రత దృష్ట్యా ఈ ఘటనను అధికారులు అత్యంత సీరియస్గా తీసుకున్నారు.
మరోవైపు మోహన్ భగవత్ యూపీ పర్యటన రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేపుతోంది. ఆయన పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఇప్పటికే భగవత్ను కలిశారు. ఈ క్రమంలోనే గురువారం ఉదయం రాష్ట్రంలోని ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు కేశవ్ ప్రసాద్ మౌర్య.. బ్రజేష్ పాఠక్ కూడా ఆయన్ను ప్రత్యేకంగా కలిశారు. నిరాలా నగర్లోని ఆర్ఎస్ఎస్ కేంద్రంలో జరిగిన ఈ భేటీలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి.
వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ సమావేశాలకు ఎంతో ప్రాధాన్యత ఏర్పడింది. రాష్ట్ర అగ్ర నాయకత్వానికి సమాన ప్రాధాన్యత ఇస్తున్నట్లు సందేశం పంపేందుకే ఈ వరుస భేటీలు జరుగుతున్నాయని ప్రచారం సాగుతోంది. ఎన్నికల వేళ ఆర్ఎస్ఎస్ అధినేత పర్యటన.. ఆ వెంటనే జరిగిన ఈ రాళ్ల దాడి ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి.