తమిళనాడు రాజకీయాల్లో అనూహ్య మార్పులు చోటుచేసుకుంటున్నాయి. సినీ నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (TVK) అధికార పీఠానికి చేరువలో ఉంది. రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిస్థితులు ముఖ్యమంత్రి పీఠం వైపు విజయ్ను నడిపిస్తున్నాయి. మే 9న ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఈ పరిణామాలతో చెన్నై నగరం ఒక్కసారిగా రాజకీయ వేడితో ఊగిపోతోంది.
ఆరుగురి వేటలో విజయ్..
ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి గవర్నర్ స్పష్టమైన నిబంధనలు విధించారు. 118 మంది ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన మద్దతు లేఖను సమర్పించాలని కోరారు. ప్రస్తుతం విజయ్ పార్టీ TVK వద్ద 107 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. కాంగ్రెస్కు చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు మద్దతు ఇస్తుండటంతో ఈ సంఖ్య 112కు చేరింది. మ్యాజిక్ ఫిగర్ సాధించడానికి మరో ఆరుగురు ఎమ్మెల్యేల మద్దతు అనివార్యమైంది. ఈ ఆరుగురు ఎమ్మెల్యేల వేటలో విజయ్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.
గేమ్ ఛేంజర్స్ గా ఆ పార్టీలు..
రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు సీపీఐ, సీపీఎం, వీసీకే పార్టీలు ‘గేమ్ ఛేంజర్స్’గా మారాయి. ఈ మూడు పార్టీల నిర్ణయంపైనే విజయ్ రాజకీయ భవిష్యత్తు ఆధారపడి ఉంది. అనూహ్య పరిణామం ఏమిటంటే.. డీఎంకే అధినేత స్టాలిన్ ఈ పార్టీలకు కీలక సూచన చేశారు. సొంతంగా నిర్ణయం తీసుకోవచ్చని వారికి స్వేచ్ఛనిచ్చారు. దీంతో వామపక్షాలు అలాగే వీసీకే పార్టీలు రేపు విజయ్కు మద్దతు ప్రకటించే అవకాశం ఉంది. డీఎండీకే సైతం తమ మద్దతును ఇప్పటికే సానుకూలంగా వ్యక్తం చేసింది.
టీవీకేకు కష్టాలు
మద్దతు కూడగట్టే క్రమంలో టీవీకే అష్టకష్టాలు పడుతోంది. ఒక్కో ఎమ్మెల్యే సంతకం అత్యంత విలువైనదిగా మారింది. మరో ఐదుగురు లేదా ఆరుగురు సభ్యుల బలం దొరికితే విజయ్ ముఖ్యమంత్రి కావడం ఖాయం. వామపక్షాల నిర్ణయం కోసం సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. వీరు గ్రీన్ సిగ్నల్ ఇస్తే తమిళనాడు రాజకీయ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలవుతుంది. సినిమా గ్లామర్తో వచ్చిన విజయ్ అధికారాన్ని హస్తగతం చేసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.
విజయ్ ప్రమాణ స్వీకారం చేస్తారనే వార్తలతో తమిళనాడు నలుమూలల నుండి టీవీకే కార్యకర్తలు చెన్నైకి చేరుకుంటున్నారు. భారీ సంఖ్యలో తరలివస్తున్న మద్దతుదారులతో చెన్నైలోని హోటళ్లు కిక్కిరిసిపోయాయి. నగరంలో ఎక్కడా ఖాళీ గదులు దొరకని పరిస్థితి నెలకొంది. డిమాండ్ను గమనించిన హోటల్ యాజమాన్యాలు టారీఫ్ ధరలను భారీగా పెంచేశాయి. సామాన్య కార్యకర్తలకు వసతి దొరకడం కష్టంగా మారింది. అయినా అభిమానం ముందు ఈ ఇబ్బందులేవీ వారిని ఆపలేకపోతున్నాయి.
చెన్నై వీధులన్నీ ఇప్పుడు విజయ్ కటౌట్లు, టీవీకే జెండాలతో నిండిపోయాయి. ఆ ఆరుగురు ఎమ్మెల్యేలు ఎవరు? వారు ఎప్పుడు మద్దతు లేఖపై సంతకం చేస్తారనే చర్చ ఊపందుకుంది. గవర్నర్ నిర్ణయం అలాగే కూటమి రాజకీయాలు ఇప్పడు అత్యంత కీలకంగా మారాయి. పట్టుదలతో శ్రమిస్తున్న విజయ్ టీమ్ ఎట్టకేలకు మెజారిటీ మార్కును దాటుతుందని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. తమిళనాడు గద్దెపై విజయ్ అడుగుపెడితే అది దేశ రాజకీయాల్లోనే పెద్ద సంచలనం అవుతుంది.
ALSO READ: కేటీఆర్…రైతు సంగ్రామ సదస్సు…పక్కదారి! బీఆరెస్- కాంగ్రెస్ ఫైట్.. మధ్యలో బండి సంజయ్..!