Messi Event Issue: అర్జెంటీనా సాకర్ స్టార్ మెస్సీ కార్యక్రమంలో జరిగిన గందరగోళంపై చర్యలు చేపట్టింది మమత సర్కార్. బెంగాల్ క్రీడాశాఖా మంత్రి అరూప్ బిస్వాస్ రాజీనామా చేశారు. ఈ రాజీనామాను ఆమోదించారు సీఎం మమతాబెనర్జీ. ఈ నెల 13న బెంగాల్ కి మెస్సీ రాక సందర్భంగా చోటు చేసుకున్న ఘటన నేపథ్యంలో చర్యలు తీసుకున్నారు సీఎం మమత. ఇప్పటికే ఈ ఘటనపై కమిటీ వేసింది బెంగాల్ సర్కార్.
రెండు రోజుల క్రితం, మెస్సీ రాక సందర్భంగా ఈవెంట్ ఏర్పాటు చేశారు ఆర్గనైజర్లు. అయితే ఈ ఈవెంట్ లో మెస్సీ ఎక్కువ సేపు లేకపోవడంతో.. ప్రేక్షకులు స్టేడియంలో విధ్వంసం సృష్టించారు. పలువురు ప్రేక్షకులను బెంగాల్ పోలీసులు అరెస్టు చేశారు. మెస్సీ కార్యక్రమంలో గందరగోళం, విధ్వంసంపై మమత ప్రభుత్వం డీజీపీ, నగర సీపీకి నోటీసులు జారీ చేసింది. కార్యక్రమం జరిగిన రోజున విధుల నిర్వహణలో వైఫల్యం కారణంగా డీసీపీ అనీష్ సర్కార్ పై శాఖాపరమైన చర్యలు చేపట్టింది మమత సర్కార్. ఈ ఘటనపై మెస్సీ అభిమానులకు మమత బెనర్జీ క్షమాపణలు చెప్పారు.
“డిసెంబర్ 13, 2025న ఫుట్బాల్ క్రీడాకారుడు మెస్సీ కోల్ కతాకు వచ్చారు. అయితే అనుకోని సంఘటన జరిగింది. ప్రభుత్వం ఇప్పటికే దర్యాప్తు కమిటీని ఏర్పాటు చేసింది. నిష్పాక్షిక దర్యాప్తు కోసం, పశ్చిమ బెంగాల్ క్రీడా మంత్రి పదవికి నేను రాజీనామా చేస్తున్నాను. దయచేసి నా రాజీనామాను ఆమోదించాలని కోరుతున్నాను” అని బిశ్వాస్ సీఎంకు రాసిన లేఖలో పేర్కొన్నారు. ప్రస్తుతానికి సీఎం మమతా బెనర్జీ క్రీడా శాఖ బాధ్యతలు చేపట్టారు.
ఈ మేరకు మమతా బెనర్జీ కార్యాలయం నుండి ఒక ప్రకటన వెలువడింది. క్రీడా మంత్రి ఉద్దేశాన్ని అర్ధం చేసుకుంటామని పేర్కొంది. నిష్పాక్షిక విచారణ ముగిసే వరకు, క్రీడా శాఖను సీఎం చూస్తారని ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది.
G.O.A.T ఇండియా పర్యటనలో భాగంగా శనివారం కోల్కతా సాల్ట్ లేక్ స్టేడియంలో జరిగిన గందరగోళాన్ని దర్యాప్తు చేయడానికి ముగ్గురు ఐపీఎస్ అధికారులతో ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. డీజీపీ రాజీవ్ కుమార్, బిధన్ నగర్ పోలీస్ కమిషనర్ ముఖేష్ కుమార్, డిప్యూటీ కమిషనర్ అన్నేష్ సర్కార్, క్రీడా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రాజేష్ సిన్హాతో సహా ముగ్గురు ఉన్నతాధికారులు ఈ కమిటీలో ఉన్నారు. సాల్ట్ లేక్ స్టేడియం సీఈవో దేబ్ కుమార్ నందన్ను ప్రభుత్వం ఆ పదవి నుండి తొలగించింది.
Also Read: Rahul Gandhi: ఉపాధి హామీ పథకంపై మోదీ సర్కార్ కుట్ర: రాహుల్ గాంధీ