Comedy Movie on OTT : ‘దంగల్’ (2016)తో బాలీవుడ్లో అడుగుపెట్టిన హిందీ నటి సాన్యా మల్హోత్రా. బబితా కుమారి పాత్రతో గుర్తింపు పొందిన ఆమె, ‘బదాయి హో’, ‘ఫోటోగ్రాఫ్’, ‘పగైత్’, ‘లూడో’, ‘మీనాక్షి సుందరేశ్వర్’ వంటి విభిన్నమైన సినిమాలతో మంచి నటిగా పేరు తెచ్చుకుంది. ఈమె చిత్రాలు ఎక్కువగా ఫ్యామిలీ డ్రామా, కామెడీతో హృదయానికి హత్తుకునేలా ఉంటాయి. అయితే ఒక హిందీ సినిమాలో ఈమె నటనకు మంచి గుర్తింపు వచ్చింది. రాజస్థాన్లోని ఒక పల్లెటూరిలో నిరంతరం గొడవపడే ఇద్దరు అక్కాచెల్లెళ్ల చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఊర్లో ఇద్దరు మొండి ఘటాలు పంతానికి పోతే ఊరంతా ఎలా తమాషా చూస్తుందో, ఈ అక్కాచెల్లెళ్ల గొడవ కూడా అలాగే ఉంటది. అత్తా కోడళ్ల గొడవలు వినుంటాం కానీ, వీళ్లు మాత్రం జుట్లు పీక్కోవడం లాంటి సీన్లతో సినిమాను రక్తి కట్టిస్తారు. మన ఊర్లో ఉండే రచ్చబండ పంచాయితీలు, ఆ నాటు తిట్లు ఈ సినిమాలో కనిపిస్తుంది.
దర్శకుడు విశాల్ భరద్వాజ్ రూపొందించిన ఈ హిందీ కామెడీ డ్రామా పేరు ‘పటాఖా’ (Pataakha). 2018లో వచ్చిన ఈ సినిమాలో సాన్యా మల్హోత్రా, రాధికా మదన్, సునీల్ గ్రోవర్ లీడ్ రోల్స్ లో నటించారు. ఈ సినిమా కోసం హీరోయిన్లు సాన్యా మల్హోత్రా, రాధికా మదన్ పడ్డ కష్టం అంతా ఇంతా కాదు. రాజస్థానీ పల్లెటూరి అమ్మాయిల లాగా కనిపించడానికి వీరు జైపూర్ దగ్గరి ఒక గ్రామంలో ఉండి బర్రెల పాలు పితకడం, గడ్డి కోయడం, నెత్తిన నీళ్ల బిందెలు మోయడం వంటి పనులు నేర్చుకున్నారు. అంతేకాకుండా, పెళ్లయ్యాక వచ్చే మార్పుల కోసం వీరిద్దరూ సుమారు 10 కిలోల బరువు పెరిగి, ఆ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. మొదట ఈ సినిమాకు ‘చురియా’ అని పేరు పెట్టాలనుకున్నా, చివరకు ‘పటాఖా’ అని ఫిక్స్ చేశారు. దర్శకుడు విశాల్ భరద్వాజ్ దర్శకత్వంతో పాటు సంగీతాన్ని కూడా అందించగా, లెజెండరీ కవి గుల్జార్ పాటలు రాశారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా వసూళ్లు సాధించకపోయినా, విమర్శకుల ప్రశంసలు పొందింది. రాధికా మదన్కు ఉత్తమ నటిగా అవార్డును తెచ్చిపెట్టింది. prime videoలో ఈ సినిమా అందుబాటులో ఉంది.
రాజస్థాన్లోని ఒక మారుమూల పల్లెటూర్లో చంపా, గెండా అని ఇద్దరు అక్కాచెల్లెళ్లు ఉంటారు. వీళ్ళిద్దరికీ ఒకరంటే ఒకరికి అస్సలు పడదు. చిన్నప్పటి నుంచి పిల్లి-ఎలుకలా కొట్టుకుంటూనే ఉంటారు. ఒకరిని మించి మరొకరు తిట్టడం, జుట్లు పట్టుకుని వీధిలో తన్నుకోవడం వీళ్లకు నిత్యకృత్యం. ఇక వీళ్ళ మధ్య చిచ్చు పెట్టడానికి డిప్పర్ అనే ఒక నారదుడు ఎప్పుడూ రెడీగా ఉంటాడు. పాపం వీళ్ళ తండ్రి మాత్రం, తన కూతుళ్లు ఎప్పటికైనా కలిసి ఉంటారని ఆశగా ఎదురుచూస్తూ ఉంటాడు. ఇక కథలో వీళ్ళిద్దరూ వేర్వేరు కుర్రాళ్లతో ప్రేమలో పడతారు. ఎలాగైనా ఒకరి మొహం ఒకరు చూడకూడదని, అక్కకంటే ముందే పెళ్లి చేసుకోవాలని చెల్లెలు, చెల్లెలు కంటే గొప్పోడిని పెళ్లి చేసుకోవాలని అక్క ప్లాన్లు వేస్తారు. చివరికి ఒకే రోజు, ఒకే టైమ్కి తమ తమ ప్రియుళ్లతో కలిసి ఇంటి నుండి పారిపోతారు.
తీరా పెళ్లి చేసుకున్నాక చూస్తే, వీళ్లు పెళ్లి చేసుకున్నది సొంత అన్నదమ్ములని తెలిసి మైండ్ బ్లాక్ అవుతుంది. విడిపోవాలనుకున్న వాళ్ళు కాస్తా, ఒకే ఇంట్లో తోడికోడళ్లుగా అడుగుపెట్టాల్సి వస్తుంది. పగతో రగిలిపోతూ.. చివరికి తెలుసుకున్న నిజంపెళ్లయ్యాక కూడా వీళ్ళ గొడవలు తగ్గవు. ఒకరి కాపురం మరొకరు పాడు చేసుకోవడానికి స్కెచ్లు వేస్తారు. కానీ విధి ఆడిన వింత నాటకంలో, ఒకరి కష్టం వచ్చినప్పుడు మరొకరు పడే ఆవేదన చూసి వాళ్లకు ఒక విషయం అర్థమవుతుంది. తాము ఎంత కొట్టుకున్నా, ఒకరి మీద ఒకరికి ఉన్నది పగ కాదు, అది విడదీయలేని రక్త సంబంధమని తెలుసుకుంటారు. ఆఖరికి ఈ పటాఖాలు కలిసిపోయి అందరినీ ఆశ్చర్యపరుస్తారు.
Read Also : ప్రతి ఎపిసోడ్ మైండ్ బ్లోయింగ్… సైకాలజీతో నేరగాళ్లకు చుక్కలు చూపించే ఇన్వెస్టిగేటర్… ఐయండిబిలో 8.2 రేటింగ్