Crime Drama OTT : సినిమాల వల్ల చెడిపోతారని చాలా మంది అంటుంటారు. కొన్ని సందర్భాలలో అది నిజమే అనిపిస్తుంది కూడా. అయితే ఇప్పుడు చెప్పుకోబోయే సినిమా పూర్తిగా ఒక సంచలనం. ప్రపంచ సినీ చరిత్రలోనే ఒక సినిమా, సమాజంలో పెద్ద మార్పు తీసుకురావడం అరుదైన విషయం. ఈ సినిమా 2000వ సంవత్సరంలో దక్షిణ కొరియాలోని గ్వాంగ్జూ ఇన్హా స్కూల్లో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందింది. ఇందులో చెవిటి, మూగ పిల్లలపై కామాంధులు చేసే దారుణాలను చూస్తే రక్తం మరిగిపోయేలా, గుండె భారమైపోయేలా ఉంటుంది. ఈ సినిమా రిలీజ్ అయ్యాక కొరియన్ ప్రభుత్వం, పిల్లల కోసం కొత్త చట్టాలను కూడా తీసుకొచ్చింది. నిజానికి రియల్ గా జరిగిన దారుణాలు సినిమాలో చూపించిన దానికంటే చాలా రెట్లు భయంకరంగా ఉంటాయని, ఈ కేసును విచారించిన వాళ్ళు చెబుతుంటారు.
ఈ కొరియన్ క్రైమ్ డ్రామా మూవీ పేరు ‘సైలెన్స్డ్’ (Silenced). ‘స్క్విడ్ గేమ్’ (Squid Game) ఫేమ్ హ్వాంగ్ డాంగ్-హ్యుక్ దీనికి దర్శకత్వం వహించారు. 2011లో వచ్చిన ఈ సినిమాలో ప్రముఖ నటుడు గాంగ్ యూ ఇందులో ప్రధాన పాత్ర పోషించారు. ఈ సినిమా వెనుక ఉన్న ప్రధాన వ్యక్తి హీరో గాంగ్ యూ. ఆయన మిలిటరీలో ఉన్నప్పుడు ఈ కథకు మూలమైన నవలను చదివారు. పిల్లలపై జరిగిన దారుణాల గురించి చలించిపోయిన ఆయన, ప్రపంచానికి తెలియాలని పట్టుబట్టి మరీ ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించారు. షూటింగ్ సమయంలో పిల్లల భద్రత కోసం వేధింపుల దృశ్యాలను చాలా జాగ్రత్తగా, ఎడిటింగ్ టెక్నిక్స్ ఉపయోగించి చిత్రీకరించారు. ఈ సినిమా విడుదలైన తర్వాత దక్షిణ కొరియాలో ఒక విప్లవమే వచ్చింది. ప్రజల ఆగ్రహం చూసి ప్రభుత్వం ‘డోగానీ చట్టాన్ని’ తీసుకువచ్చి, వికలాంగులపై, పిల్లలపై జరిగే అకృత్యాలకు కఠిన శిక్షలు పడేలా మార్పులు చేసింది. దీని ఫలితంగానే ఆనాటి నేరస్తులకు 12 ఏళ్ల జైలు శిక్ష పడటంతో పాటు, ఆ స్కూల్ను కూడా ప్రభుత్వం శాశ్వతంగా మూసివేసింది. ప్రస్తుతం ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ (Netflix)లో అందుబాటులో ఉంది.
దక్షిణ కొరియాలో ఉండే ఒక ఊరిలో చెవుడు, మూగ పిల్లల స్కూల్ ఉంటుంది. అక్కడికి ఒక కొత్త మాస్టారు ఉద్యోగంలో చేరుతాడు. అయితే అక్కడ ఉండే పిల్లల మొహాల్లో ఏదో తెలియని భయం, బాధ కనిపిస్తాయి. ఏంటా అని ఆరా తీస్తే, ఆ స్కూల్ నడిపే పెద్ద మనుషులు, టీచర్లు కలిసి ఆ అమాయక పిల్లలను పశువుల కంటే హీనంగా హింసిస్తూ, లైంగికంగా వేధిస్తున్నారని అతనికి అర్థమవుతుంది. ఆ పిల్లల ఆర్తనాదాలు ఎవరికీ వినిపించకుండా ఆ స్కూల్ గోడల మధ్యే నలిగిపోతుంటాయి.
ఈ అన్యాయాన్ని ఎలాగైనా బయట పెట్టాలని ఆ మాస్టారు ఒక సోషల్ వర్కర్తో కలిసి కోర్టుకి వెళ్తాడు. కానీ అక్కడ అసలైన దౌర్భాగ్యం మొదలవుతుంది. ఆ స్కూల్ నడిపించే వాళ్లకు పైస్థాయిలో ఉన్న రాజకీయ నాయకులు, పోలీసులు, లాయర్లతో గట్టి పలుకుబడి ఉంటుంది. డబ్బిచ్చి సాక్షులను కొనేయడం, బెదిరించడం లాంటివి చేసి తప్పు చేసినోళ్లు దర్జాగా తిరుగుతుంటే.. న్యాయం కోసం పోరాడే వాళ్లకు అడుగడుగునా అవమానాలే ఎదురవుతాయి.
చివరికి కోర్టులో తీర్పు కూడా ఆ నేరస్తులకే అనుకూలంగా వస్తుంది. వాళ్లకు చాలా తక్కువ శిక్ష పడటంతో, ఆ మాస్టారు, పిల్లలు కుమిలిపోతారు. అయితే ఈ సినిమా విడుదలయ్యాక ప్రజలందరిలో వచ్చిన ఆగ్రహం వల్ల ప్రభుత్వం దిగొచ్చి, చట్టాలను మార్చి ఆ నీచులకు కఠిన శిక్షలు పడేలా చేసింది. అమాయక పిల్లల గోడును ప్రపంచానికి చాటి చెప్పిన గుండెను పిండేసే కథ ఇది.
Read Also : పెయింటింగ్లో బయటపడ్డ భయంకరమైన ఆత్మ… వణుకు పుట్టించే క్లైమాక్స్