Mana Shankara Vara Prasad Garu OTT : అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన కామెడీ ఎంటర్టైనర్ ‘మన శంకర వర ప్రసాద్ గారు’ ప్రేక్షకులను ఆకట్టుకుంది. చిరంజీవిని మరోసారి ఈ సినిమాతో తానేంటో నిరూపించుకున్నాడు. 70 ఏళ్ల వయసులో కూడా ఆయన నటన, యాక్షన్ సన్నివేశాలు చాలా మందిని ఆశ్చర్యపరిచాయి. ఇది బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. సంక్రాంతి సెలవుల సీజన్ ముగిసినప్పటికీ, చిరంజీవి నటించిన ఈ చిత్రం తెలుగు రాష్ట్రాలలో ఘన విజయాన్ని సాధిస్తూనే ఉంది. ఇప్పటికే 300 కోట్లకు పైగా వసూలు చేసింది ఈ సినిమా. ఇంకా కలెక్షన్లు పెరిగే అవకాశాలు కనబడుతున్నాయి.
‘మన శంకర వర ప్రసాద్ గారు’ డిజిటల్ హక్కులను జీ5 సొంతం చేసుకుంది. ఈ సినిమా అద్భుతమైన రన్ చూస్తుంటే, ఓటీటీలోకి ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. ఈ చిత్రం థియేటర్లలో అనూహ్యంగా బాగా ఆడుతుండటంతో, ఓటీటీలోకి విడుదలను కనీసం పది రోజులు వాయిదా వేయాలని మేకర్స్ ఇప్పుడు Zee5 తో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా విజయానికి అనిల్ రావిపూడి కూడా ఒక కారణం. కామెడీతో కూడిన క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్లను రూపొందించడంలో ఈ దర్శకుడు దిట్ట. వెనక్కి తిరిగి చూసుకుంటే, అనిల్ రావిపూడి మునుపటి చిత్రం, సంక్రాంతికి వస్తున్నం కూడా థియేటర్లలో సెన్సేషనల్ రన్ కారణంగా ఓటీటీలోకి పది రోజులు ఆలస్యం అయింది. ఈ కారణంగా మన శంకర వర ప్రసాద్ గారి విషయంలో కూడా ఇదే ట్రెండ్ అనుసరించే అవకాశం ఉంది.
ఇక శ్రీమతి అర్చన సమర్పణలో షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మించిన ఈ సినిమాకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహించాడు. చిరంజీవి, వెంకటేష్, నయన తార ప్రధాన పాత్రల్లో నటించిన ఈ టైటిల్ను, సినిమా గ్లింప్స్ని చిరంజీవి పుట్టినరోజు సందర్బంగా 2025 ఆగష్టు 22న విడుదల చేశారు. ‘మన శంకర వరప్రసాద్గారు’ సినిమా ట్రైలర్ను జనవరి 04న విడుదల చేసి, సినిమాను జనవరి 12న విడుదల చేశారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా భారీ విజయాన్ని సాధించి, 2026 సంక్రాంతి విజేతగా నిలిచింది.
శంకర వర ప్రసాద్ (చిరంజీవి) ఒక ఉన్నత స్థాయి నేషనల్ సెక్యూరిటీ ఆఫీసర్. ఒక కీలకమైన మిషన్ కారణంగా, తన భార్య శశిరేఖ (నయనతార) పిల్లలకు దూరంగా ఉండాల్సి వస్తుంది. తన ఉద్యోగం వల్ల తన కుటుంబానికి ప్రమాదం కలగకూడదని ఆరేళ్ల పాటు వారితో సంబంధం లేకుండా గడుపుతాడు. అయితే గతంలో శంకర వర ప్రసాద్ వల్ల జైలుకు వెళ్ళిన ఒక మాజీ పోలీస్ అధికారి (విలన్), ప్రతీకారం తీర్చుకోవడానికి ప్రసాద్ కుటుంబంపై దాడి చేస్తాడు. తన కుటుంబం ప్రమాదంలో ఉందని తెలుసుకున్న ప్రసాద్, వారిని కాపాడుకోవడానికి తిరిగి వస్తాడు. ప్రసాద్ తిరిగి వచ్చినప్పుడు, తన భార్యకు తాను ఒక ఇన్సూరెన్స్ ఏజెంట్ అని అబద్ధం చెప్తాడు. ఒకవైపు శత్రువుల నుండి కుటుంబాన్ని కాపాడుతూనే, మరోవైపు భార్యకు తన అసలు వృత్తి తెలియకుండా చేసే ప్రయత్నాలు సినిమాలో మంచి కామెడీని పండిస్తాయి. ఈ క్రమంలో శంకర వర ప్రసాద్కి సహాయం చేసే స్నేహితుడిగా విక్టరీ వెంకటేష్ ఎంట్రీ ఇస్తారు. వీరిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.
Read Also : 30 గంటలు సాగే గ్యాంగ్స్టర్ డ్రామా… అడుగడుగునా ట్విస్టులు… ఊహించని మలుపులు