OTT Movie : కుటుంబ కథలతో వచ్చే సినిమాలు ఫ్యామిలీ ఆడియన్స్ ను బాగా ఆకట్టుకుంటాయి. రీసెంట్ గా మలయాళం నుంచి వచ్చిన ఒక మూవీని ఫ్యామిలీ ఆడియన్స్ ఆదరించారు. ఈ సినిమా మధ్యతరగతి కుటుంబంలో ఉండే, అన్ని సన్నివేశాలను కలిపి చూపిస్తుంది. సినిమా చూస్తున్నంత సేపు కుటుంబాలలో జరిగే చిన్నపాటి గొడవలు, ఆదిపత్యం వంటివి కళ్ళకు కనపడుతూ ఉంటాయి. ఈ మూవీలో తల్లి రెండు రోజుల్లో చనిపోతుందని డాక్టర్లు చెప్పడంతో, అన్నదమ్ములు అక్కడికి వస్తారు. అప్పుడే అసలు స్టోరీ మొదలవుతుంది. విమర్శకులు సైతం ప్రసంశించిన ఈ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…
అమెజాన్ ప్రైమ్ వీడియొ (Amazon Prime Video) లో
ఈ మలయాళ మూవీ పేరు ‘నారాయణీంటే మూన్నాన్మక్కల్’ (Narayaneente Moonnaanmakkal). 2025 లో విడుదలైన ఈ సినిమాకు శరణ్ వేణుగోపాల్ దర్శకత్వం వహించారు. ఇందులో జోజు జార్జ్, సురాజ్ వెంజరమూడు, అలెన్సియర్ లే లోపెజ్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ కథ కేరళలోని కొయిలాండి అనే గ్రామంలోని, ఒక సాంప్రదాయ కుటుంబం నేపథ్యంగా సాగుతుంది. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియొ (Amazon Prime Video) లో స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీలోకి వెళితే
ఈ సినిమా నారాయణి అనే వృద్ధ మహిళ చుట్టూ తిరుగుతుంది. ఆమె తన జీవితంలో చివరి దశలో ఉంటుంది. ఆమె ముగ్గురు కొడుకులు విశ్వనాథన్ , సేతు, భాస్కరన్ ఆమెను చూసేందుకు దశాబ్దాల తర్వాత వారి ఇంటికి తిరిగి వస్తారు. ఈ ముగ్గురు సోదరుల మధ్య సంబంధాలు ఎప్పుడో విడిపోయి ఉంటాయి. తల్లి మాత్రం చివరిరోజుల్లో ఉంటుంది.వైద్యులు కూడా ఆమె రెండురోజులకంటే ఎక్కువ బ్రతకదని చెప్తారు. ఆ సమయంలో అన్నదమ్ములు ఒకచోట చేరడం వల్ల పాత గాయాలు, విభేదాలు మళ్లీ రగులుతుంటాయి. పెద్ద కొడుకు విశ్వనాథన్ సాంప్రదాయ విలువలను గట్టిగా పట్టుకునే వ్యక్తి. అతను కుటుంబ వారసత్వాన్ని కాపాడాలని భావిస్తాడు. తన తమ్ముళ్లపై ఆధిపత్యాన్ని కలిగి ఉంటాడు. మధ్య కొడుకు సేతు తల్లి వద్దే ఉంటూ ఆమె సంరక్షణ చూసే వ్యక్తి. అతను ఒక లెర్నింగ్ డిజార్డర్తో బాధపడుతూ, శాంతమైన జీవితాన్ని గడుపుతుంటాడు. సోదరులు అతన్ని తక్కువగా చూస్తుంటారు. చిన్న కొడుకు, భాస్కరన్ వేరే మతానికి చెందిన స్త్రీని వివాహం చేసుకుని, కుటుంబం నుండి దూరమైన ఉంటాడు.
అతను అలా పెళ్లి చేసుకోవడం వల్ల, విశ్వనాథన్తో అతనికి తీవ్ర విభేదాలు ఏర్పడతాయి. తల్లి చనిపోయే సమయంలో సోదరులు ఒకచోట చేరినప్పుడు, వారి మధ్య ఉన్న పాత గొడవలు, ఆస్తి విషయాలు, వ్యక్తిగత విభేదాలు బయటపడతాయి. అదే సమయంలో, భాస్కరన్ కొడుకు నిఖిల్, విశ్వనాథన్ కూతురు అతిర మధ్య ఒక రహస్య ప్రేమకథ నడుస్తూ ఉంటుంది. చివరికి అన్నదమ్ములు గొడవలకు ముగింపు పలుకుతారా ? అన్నా,చెల్లెళ్ల ప్రేమ ఎంతవరకు వెళ్తుంది ? ఈ విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే ఈ మూవీని చూడాల్సిందే. ఈ మూవీ ఒక కుటుంబ డ్రామా కంటే ఎక్కువగా, వాస్తవిక సన్నివేశాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఈ సినిమా నెమ్మదిగా సాగినప్పటికీ, నటుల నటనా నైపుణ్యం వీక్షకులను కట్టిపడేస్తాయి.