OTT Movie : భక్తి సినిమాలు ఈ మధ్య తక్కువగానే వస్తున్నాయి. అయితే వచ్చిన సినిమాలను ప్రజలు బాగానే అదరిస్తున్నారు. రీసెంట్ గా 13వ శతాబ్దానికి చెందిన సాధ్వీమణి ముక్తాబాయి జీవితం ఆధారంగా ఒక మరాఠీ బయోపిక్ వచ్చింది. సంత్ జ్ఞానేశ్వర్ సోదరి అయిన ముక్తాబాయి ఆధ్యాత్మిక ప్రయాణాన్ని, ఆమె జ్ఞానాన్ని ఈ చిత్రం అద్భుతంగా చూపించింది. భక్తులు మాత్రమే కాకుండా, ప్రజలు అందరూ చూడాల్సిన సినిమా ఇది. ఈ సినిమాకి ఐయండిబిలో రేటింగ్ 9/10 ఉండటం విశేషం.
2025లో వచ్చిన ఈ మరాఠీ బయోగ్రాఫికల్ హిస్టారికల్ సినిమా పేరు ‘సంత్ జ్ఞానేశ్వరాంచి ముక్తాయి’ (Sant Dnyaneshwaranchi Muktaai). ఇది 2025 ఏప్రిల్ 18న థియేటర్లలో రిలీజ్ అయింది. ఈ చిత్రానికి దిగ్పాల్ లంజేకర్ దర్శకత్వం వహించారు. AA ఫిల్మ్స్ పంపిణీ చేసిన డిథర్ ప్రొడక్షన్పై రేష్మా కుందన్ తడాని ఈ సినిమాను నిర్మించారు. ఇందులో ఇష్మితా జోషి (ముక్తాయ్), మానస్ బేడేకర్ (జ్ఞానేశ్వర్) ప్రధాన పాత్రల్లో నటించారు. ప్రస్తుతం ఈ సినిమా Amazon Prime Videoలో అందుబాటులో ఉంది.
ఈ సినిమా 13వ శతాబ్దానికి చెందిన ప్రసిద్ధ సాధ్వీమణి ముక్తాబాయి, ఆమె సోదరులైన నివృత్తినాథ్, జ్ఞానేశ్వర్, సోపాన్ల ఆధ్యాత్మిక ప్రయాణాన్ని చూపిస్తుంది. తల్లిదండ్రులు చిన్నప్పుడే చనిపోతారు. సమాజం కూడా వాళ్ళని వెలివేస్తుంది. ఆ చిన్న వయసులోనే వాళ్ళు ఎదుర్కొన్న కష్టాలను, అవమానాలను తట్టుకుని ఎలా నిలబడ్డారో ఇందులో చూపించారు. ముఖ్యంగా జ్ఞానేశ్వరుడు తన గది తలుపులు వేసుకుని బాధపడుతున్నప్పుడు, ముక్తాబాయి తన మాటలతో ఆయనను ఓదార్చి, లోకానికి జ్ఞానాన్ని పంచమని ప్రోత్సహించే సంఘటన సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది.
కేవలం ఒక కుటుంబ గాథగానే కాకుండా, ఈ చిత్రం అప్పటి పరిస్థితులను, సంప్రదాయం గొప్పతనాన్ని వివరిస్తుంది. ముక్తాబాయి జ్ఞానాన్ని, ఆమె రాసిన అభంగాలను, ఆమెకు తన సోదరులపై ఉన్న మమకారాన్ని దర్శకుడు దిగ్పాల్ లంజేకర్ ఎమోషనల్ గా తెరకెక్కించారు. ఒక అనాథ బాలికగా మొదలై, అద్భుతమైన జ్ఞాన సంపదతో కోట్లాది మందికి ఆదర్శంగా నిలిచిన ముక్తాబాయి జీవిత చరిత్రను ఈ చిత్రం కళ్ళకు కట్టినట్లు చూపిస్తుంది.
ముక్తాబాయి, నివృత్తినాథ్, జ్ఞానేశ్వర్, సోపన్ అనే నలుగురు విఠలపంత్, రుక్మిణీబాయి దంపతులకు జన్మించారు. జ్ఞానేశ్వరుడు మరాఠీ సాహిత్యంలో జ్ఞానేశ్వరి, అమృతానుభవం వంటి గొప్ప గ్రంథాలను రచించారు. 21 ఏళ్ళ వయసులోనే ఆయన ఆలందిలో సంజీవ సమాధి అయ్యారు. ఆ తరువాత ముక్తాబాయి జ్ఞానేశ్వరుని సోదరి మాత్రమే కాకుండా, అతని ఆధ్యాత్మిక ప్రయాణంలో కీలక పాత్ర పోషించింది. ఆమె సుమారు 41 అభంగాలు రచించింది. ఇప్పటికీ వీళ్ళనీ విష్ణు, శివ, బ్రహ్మ, ఆదిశక్తి అవతారాలుగా భక్తులు కొలుస్తారు.
Read Also : ఓటీటీ డేట్ లాక్ చేసుకున్న ‘సంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’… స్ట్రీమింగ్ ఎప్పుడంటే ?