సొంతింటి కల నెరవేరడం.. అదీ హైదరాబాద్ సిటీలో! అంతకు మించిన భాగ్యముంటుందా పేద, మధ్యతరగతి వర్గాలకు. ఇంటి కోసం పడే పాట్లు అంతా ఇంత కాదు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల ఆశలు పెట్టి పదేండ్లు పాలించిన సర్కార్ సిటీ జనాలను తీవ్రంగా నిరాశకు గురి చేసింది. కొన్ని ఎక్కడో కట్టారు. అవి ఎవరికి కేటాయించారో తెలియదు. ఎవరికి ఇచ్చారో తెలియదు. కేటాయించిన లబ్దిదారులు అక్కడికి వెళ్లారో లేదో కూడా తెలియదు. అలాంటి తీవ్ర గందరగోళం.. నిరాశకు గురి చేసిన పథకం కేసీఆర్.. డుబల్ బెడ్ రూం ఇండ్ల పథకం. అది రాష్ట్ర మంతటా ఫెయిల్ అయ్యింది. ఒక్క హైదరాబాద్లోనే లక్ష ఇండ్లు కట్టామని బీఆరెస్ ప్రభుత్వం చెప్పింది.
మొన్న దీనిపై చర్చలు, సవాళ్లు కూడా విసురుకున్నారు కేటీఆర్, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి. మేం లక్ష డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టించాం.. మీరు ఇంటి కోసం ఒక్క ఇటుకైనా పేర్చారా? ఒక్క ఇళ్లైనా కట్టారా? అని నిలదీశాడు కేటీఆర్. మీరు లక్ష ఇడ్లు కట్టిచ్చామన్నారు కదా! మేము లక్షకు ఒకటి ఎక్కువే కట్టి చూపుతాం..అలా చేయలేదంటే.. నేను రాజకీయాలకు దూరమవుతా.. దీనికి నువ్వు కూడా సిద్దంగా ఉండాలి.. అని సవాల్ విసిరాడు పొంగులేటి. కానీ కేటీఆర్ మాట మార్చాడు. ఒక్క డబుల్ బెడ్ రూం ఇల్లు ఏడు ఇందిరమ్మ ఇండ్లతో సమానమని మాటమార్చి సవాల్ విషయాన్ని పట్టించుకోలేదు కేటీఆర్. తాజాగా ఈ లక్ష ఇండ్లు కట్టిచూపిస్తామని సీఎం రేవంత్ రెడ్డి కూడా హామీ ఇవ్వడం ఇప్పుడు ఇండ్లపై మళ్లీ చర్చ మొదలైంది. సిటీ జనానికి మళ్లీ ఆశలు పెరిగాయి.
వాస్తవానికి, ఇప్పటి వరకు ఒక్క ఇందిరమ్మ ఇల్లు కూడా హైదరాబాద్ సిటీలో నిర్మించలేదు కాంగ్రెస్ సర్కార్. ఇప్పుడు త్వరలో జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో దీన్ని ప్రయార్టీ ఇష్యూగా తీసుకున్నది ప్రభుత్వం. మూడు మున్సిపల్ కమిషనరేట్లను ఏర్పాటు చేయడం ద్వారా తనదైన మార్కును క్రియేట్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు సీఎం. కానీ వీటి పరిధుల్లో కాంగ్రెస్ సర్కార్ డెవలప్మెంట్ మార్క్ లేదు. అందుకే ఆయన మూడు కమిషనరేట్లలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంఖుస్థాపనలు చేస్తూ పోతున్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికలకు వెళ్లినప్పుడు ప్రభుత్వం తామేమీ చేశామో చెప్పుకోవడానికి కొన్ని గురుతులైనా ఉండాలని సర్కార్ భావిస్తోంది.
దీంతో పాటు పలు పథకాలను కూడా ఈ సందర్భంగా ప్రస్తావిస్తారు. అది కామన్. కొత్త రేషన్కార్డులు. సన్నబియ్యం. మహిళలకు ఫ్రీ బస్సు.. పథకాలన్నీ ప్రచారం చేస్తారు. కానీ, ఇవన్నీ ఒకెత్తు… ఇందిరమ్మ ఇండ్లు ఒకెత్తు. అవును. కాంగ్రెస్ కూడా దీనిపై భారీ ఆశలు పెట్టుకున్నది. జనాలు ఎంతగా ఆశగా, ఆసక్తితో ఎదురుచూస్తున్నారో.. అదే స్థాయిలో దీన్ని ఓట్లు రాల్చే పథకంగా కాంగ్రెస్ సర్కార్ చూస్తున్నది. ఒక్కో ఇంటికి ఐదు లక్షల రూపాయల ఆర్థిక సాయం చేస్తున్నది సర్కార్. నాలుగు దఫాలుగా వీటిని అందిస్తున్నారు.
అయితే ఇవి సరిపోవడం లేదు. సర్కార్ ఇచ్చే సాయానికి తోడు మరో మూడు, నాలుగు లక్షల వరకు అప్పులు చేయాల్సి వస్తోంది జనానికి. ఈ ఖర్చు సిటీ పరిధిలో ఇంకా ఎక్కువే అవుతుంది. అంటే సర్కార్ ఇచ్చే సొమ్ము ఐదు లక్షలైతే.. మరో ఐదు లక్షల వరకు ఆ లబ్డిదారుడు అప్పు చేయాల్సిందే. తప్పదు. కానీ, ఈ జీహెచ్ఎంసీ ఎన్నికల వేళ సిటీ పరిధిలో ఈ సొమ్మును కొంచెం పెంచి ఇవ్వడం చేస్తే సర్కార్కు మరింత మేలు జరిగే అవకాశాలున్నాయి. వాస్తవానికి, సిటీలో కాంగ్రెస్ గెలవడం అంత సులువైన విషయమేమీ కాదు. ఇక్కడ బీఆరెస్ బలంగా ఉంది. బీజేపీకీ ఆశలున్నాయి. దీనికి తోడు సర్కార్కు సగం టర్మ్ అయిపోయింది.
దీన్ని కూడా ప్రధాన ప్రతిపక్షం బీఆరెస్ బలంగా ప్రచారం చేయనుంది. వచ్చేది మన ప్రభుత్వమే.. అనే నినాదం బలంగా తీసుకుపోగలిగితే.. సర్కార్పై ఆశలు సన్నగిల్లే ప్రచారం ఎక్కువైతే.. కాంగ్రెస్ గెలుపు తీరాలకు చేరడం మరింత కష్టమవుతుంది. పథకాలు అన్నీ ఒకెత్తయితే.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను వడివడిగా మొదలు పెట్టడం ద్వారా దీన్ని ప్రజలే విస్తృతంగా ప్రచారం చేస్తారు. అదే ఎక్కువ మేలు చేయనుంది కాంగ్రెస్కు.