పదేళ్ల పాలన లోపాలు, అవినీతిపై కవిత ఎన్నో వేదికలపై ఎన్నో సందర్బాల్లో నిలదీశారు. ప్రశ్నించారు. ఆరోపించారు. ఆ పార్టీ వైఖరి, కేసీఆర్ విధానాలపై కూడా నిలదీస్తూనే ఉన్నారు. ఆమె పార్టీ పెట్టిన తరువాత తొలిసారిగా పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టు సాధన పేరుతో పెట్టిన బహిరంగ సభలో.. సాగునీటి రంగంపై బీఆరెస్ చేసిన చారిత్రక తప్పిదం పై కూడా మాట్లాడారు. జూరాల సోర్స్ను వదిలి శ్రీశైలం ప్రాజెక్టును ఎంచుకోవడం… కాంట్రాక్టర్లతో కుమ్మక్కై ఎత్తు పెంచే విషయంలో చేసిన తప్పిదం.. రంగారెడ్డి, మహబూబ్నగర్ జిల్లా వాసులకు తీరని సాగునీటి నష్టాన్ని, కష్టాన్ని తెచ్చిపెట్టిందని ఆమె తీవ్రంగా విమర్శించారు. అయినా ఎవరూ నోరు మెదలపలేదు.
కవిత పార్టీ పెట్టకముందు కొందరు నేతలు కేటీఆర్, కేసీఆర్ అనుమతితో మాటల దాడి చేశారు. లిక్కర్ రాణి అంటూ తీవ్ర వ్యాఖ్యలు కూడా చేశారు. కానీ పార్టీ పెట్టిన నాటి నుంచి ఆమె చేసే కామెంట్లకు ఆ పార్టీ నుంచి ఎలాంటి స్పందన రావడం లేదు. బీఆరెస్ సోషల్ మీడియా మాత్రం పిచ్చోడి చేతిలో రాయిలా.. ఏదో ఒకటి రాస్తూనే ఉంది. అంటూనే ఉంది. టీఆరెస్ పార్టీ వేదకగా చేసిన కామెంట్లకు మాత్రం.. పార్టీ నుంచి ఎక్కడా కౌంటర్ రాలేదు. ఓ ప్రకటన కూడా విడుదల చేయలేదు. నిత్యం తెలంగాణ భవన్లో చోటామోటా లీడర్లు పదుల సంఖ్యలో వచ్చి ఎవరికి వారే ప్రెస్మీట్లు పెట్టి వెళ్తుంటారు. కానీ కవిత ఆరోపించిన సాగునీటి రంగ అవినీతి ఆరోపణలపై మాత్రం ఎవరూ స్పందించలేదు.
కేసీయారే.. కవిత కామెంట్లకు మౌనంగా ఉండాలనే ఆదేశం ఆ పార్టీ నేతలకు ఇవ్వడం వల్లే ఎవరూ మాట్లాడలేదని తెలుస్తోంది. కీలకమైన సాగునీటి రంగంపై .. అవినీతి ఆరోపణలు, పదేళ్లలో మొత్తం తెలంగాణకు సాగునీటి విషయంలో బీఆరెస్ చేసిందేమీ లేదని ఆమె లెక్కలు వేసి మరీ చెబుతున్న నేపథ్యమూ.. మెదక్ జిల్లా తప్ప.. తెలంగాణలో కాళేశ్వరం నీరు ఏ జిల్లాకూ రాలేదని కుండబద్దలు కొట్టినట్టు నిగ్గుతేల్చినా స్పందన లేని నాయకులు.. ఇవాళ కవితపై పార్టీ ద్వారా తొలిసారిగా దాడికి దిగారు. వాస్తవానికి, బండి సంజయ్ కొడుకు కేసు విషయంలో బీఆరెస్ ఆది నుంచి అతే చేస్తున్నది. దీనిపై పోస్టర్లు వేయడం.. ఆ బాలిక ఫోటోలను విచ్చలవిడిగా సోషల్ మీడియాలో వాడటం, బండి సంజయ్ను వ్యక్తిగతంగా టార్గెట్ చేసే క్రమంలో అది మైనర్ బాలికకు సంబంధించిన సున్నితమైన అంశమనే విషయాన్ని గాలికొదిలాయి.
ఇక వేరే పనేమీ లేనట్టుగా, రాష్ట్రంలో జనాలకు సమస్యలేమీ లేనట్టుగా.. కేటీఆర్ దీని చుట్టే.. ఆయన టీము.. సోషల్ మీడియా అంతా దీని చుట్టే గింగిరాలు తిరుగుతూ ఉంది. కేసీఆర్.. గాడి తప్పిన బీఆరెస్ టీమును కంట్రోల్లో పెట్టేందుకు ఫామ్హౌజ్లో దాదాపు ఏడు గంటల పాటు కేటీఆర్ను కూర్చోబెట్టుకుని మీటింగు కూడా పెట్టుకున్నాడు. కానీ కేసీఆర్ చెప్పిన పార్టీ లైన్ వదిలి.. బండి సంజయ్ పనిలో పడి దిగజారిపోయిన రాజకీయాలు చేసేందుకూ వెనకాడలేదు కేటీఆర్.. అతని టీమ్. ఇదే విషయాన్ని కవిత ప్రెస్మీట్లో చెప్పారు. ఆ బాలిక ఫోటోలను వెల్లడి చేసి.. బతుకు ఆగం చేయాలను చూస్తున్న బీఆరెస్పై మండిపడ్డారు. ఆ సోషల్ మీడియా అకౌంట్లను బ్లాక్ చేసి, వారిని అరెస్టు చేయాలన్నారు.
బండి సంజయ్.. మోడీ సభకు ఎలా వెళ్లారని, దీని ద్వారా పెద్దల పిల్లలు ఏమి చేసినా చెల్లుబాటవుతుందనే సంకేతం వెళ్తుందని కూడా ఆమె అన్నారు. అయితే, దేనికీ స్పందించని బీఆరెస్…. ఈ విషయంలో మాత్రం కవితను టార్గెట్ చేసి విమర్శలు చేసింది. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ఆర్.ఎస్. ప్రవీణ్కుమార్ చేత ప్రెస్మీట్ పెట్టించి మరీ విమర్శించేలా కేటీఆర్ వెనుకుండి డైరెక్షన్ ఇచ్చినట్టు తెలుస్తోంది. అమ్మలా ఉంటానని .. అమ్మాయి విషయంలో ఇలాగేనా స్పందించేది..? అంటూ తమనే ప్రశ్నిస్తావా? నిలదీస్తావా? అనే విధంగా ప్రవీణ్కుమార్ మాట్లాడటం చర్చకు తెర తీసింది.
పాలన పరమైన ఇష్యూలపై నిలదీస్తే… నో కామెంట్! మారిన పార్టీ లైన్ పై ప్రశ్నిస్తే.. నో కామెంట్! సాగునీటి రంగానికి చేసిన అన్యాయాన్ని అడిగితే..నో కామెంట్! కానీ, ఓ సున్నితమైన అంశం.. అదీ విచారణలో ఉండగా.. బాలిక వ్యక్తిగత స్వేచ్చ, సమాచారాన్ని బజారులో పెట్టిన వైనాన్ని నిలదీస్తే.. అది తప్పయింది బీఆరెస్కు. ఇదంతా ఫామ్హౌజ్లో కూర్చున్న కేసీఆర్కు తెలిసే జరుగుతున్నదా? కేటీఆర్ చేతిలోని స్టీరింగ్ ఎటు పడితే అటు దారి, గమ్యం లేకుండా కారు రాంగ్ రూటులో పోతున్నదా? అనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.