పదేండ్లు పాలించిన పార్టీపై ప్రధాన ఆరోపణలు, అవినీతిని అస్త్రాలుగా వాడుకుని.. బెదిరిస్తూ వస్తోంది అధికార పార్టీ. ఏ ఒక్క ఆరోపణపై కూడా ఇంత వరకు అది చర్య తీసుకున్నది లేదు. సిట్ల పేరుతో విచారణ పేరుతో సగం కాలం కరిగిపోయింది. బహిరంగ మీటింగులలో మాత్రం సీఎంకు ఈ అవినీతి ఆరోపణలు, బీఆరెస్ పదేండ్ల చర్యలు వివరించి.. తిట్టి.. విమర్శించి.. జనం నుంచి మెప్పుపొంది.. దాన్ని ఇంకా దోషిగా నిలబెట్టాలనే తపనే కొనసాగుతూ వస్తోంది.
మొదట్లో అంతా బాగానే విన్నారు. అవునా.. ఇంత ఘోరమా..? అట్ల జరిగిందా? ఇంత ఘోరాలకు పాల్పడ్డారా?? అంటూ జనాలు కూడా ముక్కున వేలేసుకున్నారు. కానీ ఆ రొటీన్ రొడ్డకొట్టుడు స్పీచ్ జనాలకు కూడా రోత పుట్టించింది. అవి వినీ వినీ చెవులు తుప్పుపట్టి పోయాయి. పెద్దగా స్పందించడం లేదు ఇప్పుడు. కానీ బీఆరెస్ స్పందిస్తోంది. బీఆరెస్ను నైతికంగా దెబ్బకొట్టేందుకు కాంగ్రెస్ సర్కార్ వాడుకుంటూ వస్తున్న ఏకైక అస్త్రం.. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం.
ఇది కేటీఆర్ మెడకు చుట్టాడు రేవంత్. వాస్తవానికి ఇది చేసింది కేసీఆర్. ఆయనకు ఇతరుల మీద నమ్మకం లేదు. బయటకు గంభీరంగా కనిపించినా.. పిరికి మనస్తత్వం.. అందుకే ఎప్పుడు, ఎవరు, ఎక్కడ ఏం చేస్తున్నారనే విషయాలు నిరంతరం తెలుసుకోవడం ద్వారా కొంత స్వాంతన పడుతూ వచ్చాడు. హమ్మయ్యా.. నా సీటుకు ఢోకాలేదు.. అని ఆ రోజుకు తనకు తాను నచ్చ జెప్పుకుంటే గానీ నిద్రపోడు.. అనే విధంగా తయారయ్యింది ఆయన అనుమానం.
అందుకే గతంలో ఎప్పుడూ లేని విధంగా ఫోన్ ట్యాపింగులు జరిగాయి. ఎంతలా అంటే.. చివరకు కేసీఆర్ మానస పుత్రిక నమస్తే తెలంగాణలో పనిచేసే జర్నలిస్టులవి కూడా. అవును.. వారిపైనా కేసీఆర్కు నమ్మకం లేదు. కేసీఆర్ చేస్తున్న చర్యలు.. చాలా మంది అధికారులకు అలుసుగా మారాయి. పోలీసులకు ఇది ఊతంగా మారింది. బెదింపులకు వాడుకున్నారు. రెచ్చిపోయారు.
మొత్తంగా విధానం సజావు పరిపాలన కోసం మొదలై.. బలవంతపు వసూళ్లు, బెదిరింపులు, కక్షసాధింపులు దాకా పోయింది. అయితే దీన్ని కేటీఆర్ కూడా వాడుకుని ఉంటాడు. కానీ సినీ తారల ఫోన్లు ట్యాపింగ్ చేశాడనే ఆరోపణ.. ఆరోపణగానే చూడాలి. దీనిపై ప్రభుత్వం వేసిన ఏ సిట్టు కూడా అవును.. ఇది నిజమని తేల్చలేదు. అందుకే మొన్నటి వరకు దీనిపై సైలెంట్గా ఉన్న కేటీఆర్.. ఇక నోరు విప్పక తప్పలేదు. ఏమయ్యా..! సినీ తారల ఫోన్లు ట్యాప్ చేసినా అన్నావు కదా..? ఎక్కడా ఏదీ నిరూపించు.. వారే అన్నారు కదా.. అలాంటివేమీ జరగలేదని అంటూ ఉల్టా ధమ్కీ ఇచ్చుడు మొదలుపెట్టిండు.
అంతేగా మరి.. పిల్లిని ఇంట్లో బంధించి రోజూ కొడతా ఉంటే.. ఏదో ఒకరోజు అది ఎదురు తిరుగుతుంది. ఇక్కడ సర్కార్ కూడా నిత్యం అవే ఆరోపణలు.. ఆలుమగల ఫోన్లు ఎవరన్నా వింటారా? అని బహిరంగ వేదికల మీద పదే పదే సీఎం మాట్లాడటం .. మరీ దిగజారి కామెంట్ చేయడమే. ఇందులో వందశాతం పార్టీ మైలేజీ చూసుకుంటున్నారు గానీ.. ఆ వ్యాఖ్యలు సీఎం నోటి వెంట వస్తున్నాయి.. వీటికి ఎంతటి నిజాయితీ ఉంది..? అనే విషయాలను పట్టించుకోలేదు. అందుకే జనం కూడా వీటిని పట్టించుకోవడం మానేశారు. ఇవన్నీ బెదిరింపు ఆరోపణలు.. ఆ పార్టీల బలం కోసం .. ఇంకొకరు మీద బురద జల్లుకునేందుకే తప్ప.. జనానికి ఏం ఉపయోగపడేటివి కాదనే విధంగా వీటిని ఇప్పుడు లైట్ తీసుకుంటున్నారు.