బీజేపీ ఎందుకు ఇక్కడ ఎదగలేకపోతున్నదో.. ఎందుకు తను పరిధి గీసుకుని హిందుత్వ రాజకీయాలకే పరిమితమవుతున్నదో తెలియదు కానీ.. తెలంగాణలో ఈ విధానమే దానికి ప్రధాన ఆటంకంగా మారిందని చెప్పాలి.
ఇవాళ సిటీలో ఓ స్కూల్లో ఖురాన్ చదవమన్నారని, బలవంతంగా ముస్లింల మత గ్రంధాలను చదించాలని చూస్తున్నారనే విషయంలో వివాదం ఎదురైంది. దీనిపై అప్పటికే ఆ స్కూల్ యాజమాన్యం ఆ టీచర్ను టర్మినేట్ చేసేసింది. విషయమేమిటంటే… ఆ స్కూల్లో 90 శాతానికి పైగా ముస్లింలున్నారట. అందుకే మిగిలిన వారికి కూడా ఇదే విధానం అమలు చేసే క్రమంలో ఆ స్కూల్ మేనేజ్మెంట్ దొరికిపోయింది.
ఇక్కడ ఈ వర్గమా..? ఆ వర్గమా..? అని కాదు మతాలకు సంబంధించిన విషయాలను అసలు పాఠశాలల్లోకే తీసుకురాకూడదు. అవి ఏ వర్గం పిల్లలకైనా బలవంతంగా జొప్పించాలని చూడటమే పెద్ద తప్పు.. ఇక ఇలా పాఠ్యాంశాల్లో కూడా హోం వర్కు రూపంలో ఇచ్చి మరీ అతి చేయడమే వివాదమవుతోంది.
ఈ విషయంలో షరా మామూలుగా బీజేపీ దీంట్లో చొరవ తీసుకున్నది. ఆందోళన చేసింది. దీనిపై ఆ స్కూల్ యాజమాన్యం కూడా క్లారిటీ ఇచ్చుకున్నది. కానీ బండి సంజయ్ ఏకంగా ఇక పై హిందువులంతా బొట్టు పెట్టుకోవాలని నిబంధన తెస్తామనే విధంగా మట్లాడటమే మరో వివాదానికి కారణమైంది.
దీనిపై సెక్యులర్ వర్గాలు ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. ఏ వర్గమైనా ఏ మతాన్ని కించపరచమని చెప్పరు. ఎవరి మతం వారికి గొప్పే కావొచ్చు. కానీ ఇతర మతాలపై బలవంతంగా తమ ప్రతాపం చూపడం.. వారి సిద్దాంతాలను పాటించాలని ఇలా పాఠశాలల వేదికగా రుద్దే ప్రయత్నాన్ని ఎవరూ హర్షించరు. ఇది మంచి పద్దతి కాదనే అంతా అంటున్నారు.
కానీ బీజేపీ .. దీన్ని అలుసుగా తీసుకుని ఇక అంతా బొట్టు పెట్టుకునే బయటకు రావాలనే విధంగా మాట్లాడటం ఆ పార్టీకి ఏం మేలు చేస్తుందో తెలియదు కానీ.. ఓప్రధాన ప్రతిపక్షంగా ఎదిగి.. సర్కార్కు మేమే ఆల్టర్నేట్గా ఉన్నాం.. అని చెప్పుకుంటున్న ఇక్కడి బీజేపీకి మాత్రం ఏమాత్రం దోహదపడదు. పైగా నవ్వుకుంటారు. ప్రధాన ప్రతిపక్షంగా ఉండాలంటే.. జనం బాధలు తెలుసుకుని, వారికి కావాల్సిన వాటిపై ఆందోళన చేయాలి.
మతపరమైన విధానాలు ఆ పార్టీ పాలసీనే కావొచ్చు. కానీ అదే కాదు కదా.. మొత్తం ఆక్సిజన్. దాన్నే ప్రాణవాయువు అనుకుని, అదే జీవం పోస్తుందని రాజకీయం చేస్తే.. జనాలు అప్పటికప్పుడు స్పందింస్తుండొచ్చు. కానీ ఆ తరువాత ఈ పార్టీని అధికారం చెలాయించే పార్టీగా ఏం గుర్తించరు. రాష్ట్రంలో చాలా సమస్యలున్నాయి. ఈ సర్కార్ ఇచ్చిన హామీలు అమలు చేయడంలో విఫమైంది.
దీనిపై ఏనాడైనా బీజేపీ రోడ్డెక్కిందా? రైతులు, కర్షకులు, కార్మికులు, విద్యార్థులు, నిరుద్యోగులు.. అన్ని వర్గాలు సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాయి. దీనిపై ఓ స్టాండ్ లేదు. నేతల మధ్య సఖ్యత లేదు. ఇలాంటి మతపరైమన ఘటనలు సంభవించి.. ఆ పార్టీకి జాకీలు పెట్టి లేపుతాయని భావించి.. వాటి కోసం ఎదురు చూసుకుంటూ కూర్చోవడమే పెద్ద పొరపాటు. అదే బాటలో ఉంది ఇక్కడి బీజేపీ.