పాలాభిషేకాలు నిషేధమన్నారు మీనాక్షి నటరాజన్. మంచి నిర్ణయమే. ఆమె నిర్ణయంపై మొదట ఓ పాలాభిషేకం ప్రోగ్రం అర్జెంటుగా పెట్టాలె. పదేండ్ల పాలనలో ఊ అంటే పాలాభిషేకం.. ఆ అంటే పాలాభిషేకం.. ఇది ఎంత వరకు వచ్చిందంటే.. జేబులో పాల ప్యాకెట్లు పెట్టుకుని తిరిగే బ్యాచురా అది.. అని వెక్కిరించేంతగా. అంతగా అలవాటు పడ్డారు.
మరి యథారాజా తధా ప్రజా కదా..! కేసీఆర్ కీర్తి ఖండూతి అలాంటిది. ఆయన ఎప్పడూ వేనోళ్ల పొగిడించుకుంటాడు. అందరూ ఆయనను కీర్తించాలె. శ్లాఘించాలె. వేలెత్తిచూపొద్దు. ప్రశ్నించొద్దు. మనమే నెంబర్ వన్ అనాలే. ఇది బంగారు పరిపాలన అనాలే.. ఇక బంగారు తెలంగాణ అయినట్టేనని కితాబునియ్యాలే.. ఇగో ఇవన్నీ చేశారు.
పొద్దున్నే చౌరస్తాలో కేసీఆర్ ఫోటో.. బిందెలు బిందెలు పాలు.. గుమ్మరించి.. ఫోటోలు.. నినాదాలు.. బానిసత్వం నుంచి బయటపడ్డామని భ్రమించి మళ్లీ అదే భ్రమలో పరిభ్రమిస్తున్నామా అనే అనుమానం వచ్చేలా. ఇప్పుడా గోల లేదు. ఇకపై రేపటి నుంచి.. ఎవరూ తెలంగాణలో పాలాభిషేకాలు చేయొద్దు. ఇది గాంధీ భవన్ నుంచి నేరుగా వెళ్లిన ఆదేశాలు.
ఇక్కడే ఓ అనుమానం వచ్చింది. ఇప్పటి వరకు అంటే.. రెండున్నరేండ్లలో ఏనాడైనా పోలోమని పాలాభిషేకాలు జరిగాయంటారా? నాకైతే పెద్దగా కనిపించలేదే.. మీకేమైనా కనిపించాయా? కళ్లద్దాలు కూడా ఉన్నాయి లెండి.. మరీ దెప్పిపొడుపులు వద్దు గానీ. నిజంగా ఈ సర్కార్కు పాలాభిషేకాలు చేసేంతగా ఏమంత మంచి పనులు చేసిందబ్బా..?
రైతు రుణమాఫీ .. బాగానే రిస్కు తీసుకుని చేసినా.. నాకు కాలేదు.. మాకు కాలేదు.. ఇదో లొల్లి. ఇక రైతు బంధు..అదే రైతు భరోసా కోసం కళ్లు కాయలు కాచేలా చూశారే తప్ప.. జేబులో పాల ప్యాకెట్లు పెట్టుకుని తిరగాలనే ఆలోచన ఏ ఒక్కరీకీ రాలేదంటే నమ్మండి. ఇక హామీలన్నీ అమలు కాలేదు. కనీసం ఫ్రీ బస్సు రోజైనా మహిళలు చిటికెడు పాలు చిలకరించారా? ఏమో నేనైతే చూడలేదు. అరే బై.. కళ్లద్దాలున్నాయి. చెప్పిన కదా?
మరి ఎప్పుడు చేసేదుండె పాలాభిషేకం…? మూసీ పేరెత్తగానే తిట్లు, హైడ్రా బుల్డోజర్ లేవగానే శాపనార్దాలు, ఏదీ జాబ్ క్యాలెండర్ అని చౌరస్తాల వద్ద ఆందోళనలు.. నీళ్ల కోసం, పింఛన్ల కోసం.. స్కూటీల కోసం.. తులం బంగారం కోసం.. ఇలా అన్నీ ఎదురుచూపులే గానీ పాలు పోసి ఆశీర్వదించాలనే ఆలోచన ఏ ఒక్కరికీ వచ్చినట్టు లేదు.
అవన్నీ ఇకపై చేస్తాడనే నమ్మకం ఉండనే ఉంది. చేస్తే గీస్తే .. పాలాభిషేకాలు మాత్రం చేయొద్దు. అవును.. అందుకే ఇప్పుడు మీనాక్షమ్మ ఆదేశాలు ఇచ్చి ఉంటుందా? ఇకపై అన్నీ హామీల అమలు క్యూ కట్టనున్నాయా? జనాల కోరికలు తీర్చేందుకు సర్కార్ సీరియస్గా ఆలోచిస్తున్నదా? మళ్లీ ఎన్నికల్లో మాదే గెలుపు అంటున్నారు కాబట్టి.. పింఛన్ నాలుగు వేలు అయ్యే ఛాన్స్ ఉన్నదా?
భర్తలు చనిపోయి వితంతు పింఛన్ల కోసం ఎదురు చూస్తున్న ఆ ఒంటరి మహిళలకు కొత్త పింఛన్లు రానున్నాయా? అన్నీ వస్తాయి. అన్నీ చేస్తారు. కొంచెం ఓపిక పట్టండి.. సరే సరే తిట్టకండి. ఓపిక మస్తు పట్టారుగా.. ఇక చేసేస్తారు టకీటకీమని. పాలాభిషేకాలు చేయకున్నా.. ఆశీర్వచనాలైతే ఇవ్వండి. మళ్లీ దీవించండి.. మరిచిపోకుండా. అంతే మేము కోరుకునేది.