కాంగ్రెస్ సోషల్ మీడియా బండి సంజయ్కు మద్దతుగా నిలుస్తోంది. బీఆరెస్ సోషల్ మీడియాపై సై అంటే సై అనే రేంజ్లో కొట్లాడుతోంది. కౌంటర్లిస్తోంది. విమర్శకు ప్రతివిమర్శ, దాడికి ప్రతిదాడిగా హోరా హోరీ పోరు సాగుతోంది. బండి సంజయ్ కొడుకు కేసు నేపథ్యంలో ఇక్కడ రెండు పార్టీలు తీసుకున్న లైన్.. విచిత్ర వైఖరికి అద్దం పడుతోంది. శత్రవుకు శత్రువు మిత్రడే అనే లాజిక్ ప్రకారం ప్రస్తుతం ఈ కేసు విషయంలో బీఆరెస్పై పోరాడుతోంది కాంగ్రెస్ సోషల్ మీడియా. బండి కేసు ఉదంతాన్ని పట్టుకుని విపరీతమైన ట్రోలింగ్స్, మీమ్స్ ద్వారా తన స్థాయి తగ్గించుకుని మరి సోషల్ మీడియా వేదికగా కేసీఆర్ రాజకీయాలు చేయడాన్ని కాంగ్రెస్ సోషల్ మీడియా భరించలేకపోయింది.
ఈ సంఘటనతో ఇక తాము అధికారంలోకే రాబోతున్నాం.. అనే వీర లెవల్ ఫోజులిస్తున్న కేటీఆర్.. అండ్ టీమ్ ప్రవర్తన వారికి చిర్రెత్తేలా చేసినట్టుంది. అందుకే ఈ కేసు విషయంలో ఆది నుంచి బీఆరెస్కు కౌంటర్లు వేస్తూ వస్తున్నారు. ఇక్కడ బండి సంజయ్కు వ్యక్తిగతం మద్దతు లభిస్తోంది. అదీ కాంగ్రెస్ సోషల్ మీడియా నుంచి. కానీ బీజేపీ మాత్రం సైలెంట్గా ఉంది. తమాషా చూస్తున్నది. నాయకులు మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారు. ఎక్కడా నోరు విప్పడం లేదు. లోలోన చర్చ జరుగుతున్నదే కానీ… ఎవ్వరూ పెద్దగా స్పందించడం లేదు. బాగైంది అనే భావనలోనే బీజేపీ ఉంది. కొంత మంది కరుడుగట్టిన బీజేపీ అనుకూల సోషల్ మీడియా యాక్టివిస్టులు మాత్రం.. బండికి సలహాలు, సూచనలు చేస్తున్నారు.
బహిరంగ ప్రజా వేదికల మీద ఈ కేసు గురించి మాట్లొడొద్దని, చట్టపరంగా ముందుకు పోయే పరిస్థితులను మీడియాకు ప్రత్యేకంగా వివరిస్తే సరిపోతుందని హితవు పలుకుతున్నారు. ఇక మైనర్ బాలిక అనే కోణాన్ని మరిచి బీఆరెస్ ఇష్టమొచ్చినట్టు సోషల్ మీడియాలో పోస్టింగులు తయారు చేసి పెట్టింది. తాజాగా వాల్ పోస్టర్లు అతికించడం, మెట్రో రైల్లో బండి సంజయ్తో పాటు అతని కొడుకు ఫోటోను చూపుతూ పారిపోయాడు… కనిపిస్తే కబురు చేయండనే అత్యుత్సాహపు ప్రదర్శనలు చేయడం.. వీటన్నింటినీ ఖండిస్తున్నది కాంగ్రెస్ సోషల్ మీడియా. మరి మీ సారు.. జీతం తీసుకుంటా.. అసెంబ్లీకే రావడం లేదు.. ఫామ్హౌజ్ల పన్నడు కదా.. మైక్ పెట్టి అరుస్తూ బీజేపీ వాళ్లు ప్రచారం చేస్తారు.. అప్పుడు బాగుంటుందా? అని ఎద్దేవా చేస్తూ కామెంట్లు పెడుతున్నారు. ఏఐతో చేసిన ఫోటోలను కూడా సోషల్ మీడియాలో జోరుగా వాడుతున్నారు.
మరోవైపు నిబంధనలు ఉల్లంఘించిన వారి అకౌంట్లపై డేగ కన్ను వేసింది సైబర్ క్రైమ్ వింగ్. వీరి అకౌంట్లను బ్లాక్ చేయడమే కాదు.. అరెస్టులు కూడా ఉంటాయనే వార్నింగులు ఇచ్చేస్తున్నారు. ఈ వేడి ఇంకా కొన్నాళ్లు కొనసాగేలా ఉంది. దీన్ని ఇప్పుడప్పుడే వదిలేదే లేదు.. అన్నట్టుగా బీఆరెస్ నేతలు.. ఆ పార్టీ సోషల్ మీడియా ఇక ఇదే పనిగా పెట్టుకున్నారు. కేసీఆర్ పిలిచి మరీ గంటలు గంటలు మీటింగు పెట్టి పార్టీ పటిష్టత, సంస్థాగత నిర్మాణం గురించి చెప్పి పంపితే.. వీళ్లు మాత్రం ఇంకా ఈ సోషల్ మీడియాలో..అదీ ఈ కేసు చుట్టే గింగిరాలు తిరుగుతూ గత్తరబిత్తర అవుతున్నారు.